బస్సులు ఆగడం లేదని గ్రామస్థుల ధర్నా
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామస్థులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సులు తమ గ్రామంలో ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ గ్రామంలో ఆగకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి సుమారు అరగంట పాటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. డిపో అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిపో అధికారులను కోరారు.
