అక్రమ మైనింగ్ ఆరోపణలను ఖండించిన ఆలేరు ఎమ్మెల్యే
#రాజపేట మండలం చల్లురు గ్రామంలోని 322 సర్వే నెంబర్ లో ఉన్న క్రషర్ కు తమకు సంబంధం ఉంది అని వస్తున్న ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య తీవ్రంగా ఖండించారు..
యాదాద్రి నేటిధాత్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ అక్రమ మైనింగ్ నిర్వహించిన వెంటనే అధికారులు అరికట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రాజాపేట తదితర మండలాలల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టుగా ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున అధికారులు ఆయా అక్రమ మైనింగ్ జరుగుతున్న కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగినా, అధికారులు విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో మైనింగ్ వ్యవహారాలపై కొన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నాయకులపై దుష్ప్పచారానికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఆలేరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి ఆదరణ పొందుతున్నందునే ఓర్వలేక తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని పేర్కొన్నారు.
అధికార పార్టీకి చెందిన నాయకలకు అక్రమ మైనింగ్ సంబందాలు ఉంటే తగిన ఆధారాలతో నిరూపించాలన్నారు.నిరాధార ఆరోపణలు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
