రోడ్డు అక్రమణాలపై సమగ్ర విచారణ జరపాలి
అక్రమణలు తొలగించి దోషులు ఎంతటి వారైనా ప్రజా కోర్టులొ శిక్షించాలి- పైడిపల్లి రాజు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలో కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్లను ప్రభుత్వ ఆస్తులను అక్రమలకు గురిచేసారని వీరిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించి ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగరాన్ని ప్రజాప్రతినిధులే ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తూ జైలుకు పోయారని అయినా వీరి వక్రబుద్ధి మారడం లేదని ప్రభుత్వ ఆస్తులను, రోడ్లను కబ్జా చేస్తూ ప్రజాదనాన్ని కొల్లగొట్టుతున్న పట్టించుకునే అధికారులు జిల్లాలో లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాలకు గురైన స్థలాలను కాపాడాలని రామచంద్రాపూర్ కాలనీ భగత్ నగర్ లో రోడ్లను మూసేసి భవనాలు నిర్మించారంటే ఎంత స్థాయిలో కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని కబ్జాల వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం చూస్తుంటే వారి అవినీతి ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన బండి సంజయ్ కి కబ్జాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆక్రమనలకు అవినీతి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పిన బండి సంజయ్ రామచంద్రాపూర్ కాలనీ, భగత్ నగర్ లో తమ పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన కబ్జాపై మాట్లాడాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు వేసి అమ్మిన చరిత్రఉందని, చెరువులు, కుంటలను, పరంపోగు భూములను మాయం చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారని రానున్న కాలంలో వీటన్నింటిని బహిర్గతం చేసి ప్రజా ఆందోళన చేపడుతామని పైడిపల్లి రాజు హెచ్చరించారు.
