ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి- ఇరుగురాల భూమేశ్వర్
పెగడపల్లి, నేటిధాత్రి:
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర రెడ్డి ఫంక్షన్ హాల్ లో సిపిఐ తోమ్మిదవ మండల మహాసభ జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇరుగురాల భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు సమరశీల పోరాటాలు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పారదర్శకతను పాటించాలని, గత ప్రభుత్వాల విధానాలని ఈకాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్టంగా చొరవ తీసుకోవాలన్నారు. ఒక శతాబ్దం పూర్తి చేసుకున్న పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను చూసిందని, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతుందన్నారు. ఈసుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాట త్యాగాల గుర్తులు ఉన్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో రాచర్ల సురేష్, గుడ్ల శ్రీనివాస్, బొమ్మన శంకర్, బొమ్మన బాబు, దీకొండ రవికుమార్, శ్రీగిరి రాజకుమార్, ఆత్మకూరి రాజేశం, సిపల్లి బాబు, బత్తుల రామకృష్ణ, కోలాపురి హనుమంతు, మల్యాల అంజయ్య, మల్లారపు భూమయ్య, మల్యాల ఎర్రయ్య, నాగవత్ గంగానాయక్, లింగంపల్లి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.