దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి…

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి

కామారెడ్డిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలను తండ్రి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

కామారెడ్డి: జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన ముగ్గురు పిల్లలను కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తట్టుకోలేక తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కామారెడ్డి ఏఎస్‌పీ చైతన్య రెడ్డి ఏబీఎన్‌కు వివరాలు వెల్లడించారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను పెద్ద చెరువులో తోసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఏమి తెలియనట్లు నటిస్తూ, తన భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై అనుమానం కలిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. కుటుంబ పోషణ భారంతో పాటు అప్పుల ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్మాయిల్ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో గోసంగి కాలనీలో ఇద్దరు బాలురు కనిపించకుండా పోయిన ఘటనపై కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని కనుగొంటామని పోలీసులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version