పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద ఈవ్ టీజింగ్ ప్రత్యేక నిఘా
టేకుమట్ల ఎస్సై అమూల్య
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు టేకుమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా, పరీక్షా కేంద్రం వద్ద బాలికలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈవ్ టీజింగ్ను పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో టేకుమట్ల ఎస్సై అమూల్య సాధారణ మహిళ వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులతో కలిసి ఉండి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో అల్లరి చేసే యువకులు, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, బాలికలు నిర్భయంగా పరీక్షలు రాసేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా
ఎస్సై అమూల్య మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రత పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత అని, పరీక్షా కేంద్రాల వద్ద ఈవ్ టీజింగ్, వేధింపులు, అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలు ధైర్యంగా చదువుపై దృష్టి పెట్టి పరీక్షలు రాయాలని సూచించారు
