సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు…

సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

నేటిధాత్రి, వరంగల్.

వరంగల్ జిల్లా దేశాయ్‌పేట్ రోడ్డులోని సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డి. మహేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త సి వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ, 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ద్వారా కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శాస్త్రవేత్త సి.వి. రామన్ అని పేర్కొన్నారు. భౌతిక శాస్త్రంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని తెలిపారు.

దేశంలో సైంటిఫిక్ టెంపర్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు.

ప్రిన్సిపాల్ మహేందర్ మాట్లాడుతూ, సైన్స్‌కు జీవితాంతం అంకితమైన మహనీయుడు సి.వి. రామన్ ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version