దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
నెల్లూరులో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో భర్త. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.
నెల్లూరు, జనవరి 31: నెల్లూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీహరి, శ్రీనందినికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది. కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త.. అదే కారణంగానే ఆమెతో తరచూ గొడవులు పడినట్లు తెలుస్తోంది. దీంతో కుమార్తెను వదిలి శ్రీనందిని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఒక సెల్ఫోన్ షాప్లో పనిచేస్తోంది. ఇటీవల నెల్లూరుకు వచ్చిన శ్రీనందిని ఇంటికి వెళ్తుండగా.. ఆమెను అడ్డగించాడు భర్త. వెంటనే ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హతమార్చిన అనంతరం శ్రీహరి.. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రీనందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
