ఐనవోలు బిఆర్ఎస్‌ లో అంతర్గత కుమ్ములాటలు…

ఐనవోలు బిఆర్ఎస్‌ లో అంతర్గత కుమ్ములాటలు??
ప్రత్యర్థుల కుట్రలకన్నా ప్రమాదకరంగా సొంత పార్టీ రాజకీయాలు
బిఆర్ఎస్ లో త్యాగాలెవరివి?ఫలితాల భోగాలు అనుభవిస్తున్నది ఎవరు?
పాత–కొత్త వర్గాల మధ్య పొసగని పొత్తు..
పార్టీ లోపలే ఐక్యత లేని పాలకులు
గ్రామానికి న్యాయం చేయగలరా?
కుట్రలు చేసిన ఆ నా(లుగురు) యకులు బలైన ఈ నా(లుగురు)యాకులపై సమగ్ర కధనం మరో సంచికలో……

నేటిధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోందా?అందుకు కారణం ప్రత్యర్థి పార్టీల దాడులు కావా? పార్టీని బలహీనపరుస్తున్నది సొంత నాయకుల మధ్య కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలేనా? అంటే అవును అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీని కష్టకాలంలో నడిపించిన పాత తరం నాయకులు ఒకవైపు, అధికారం వచ్చిన తర్వాత చేరిన కొత్త వర్గం మరోవైపు నిలబడి అధికార కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి నెలకొంది. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఈ వర్గ పోరు బహిర్గతమై, సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి దారితీశాయి.

బిఆర్ఎస్ లో త్యాగాలెవరివి?ఫలితాల భోగాలు అనుభవిస్తున్నది ఎవరు?

బిఆర్ఎస్ పార్టీ ఐనవోలులో బలపడటానికి కారణం పదవులు కాదు, ప్రచారం కాదు—కార్యకర్తల త్యాగాలు, చెమట చుక్కలే. అయితే ఆ త్యాగాల ఫలితాలను ప్రస్తుతం చివరి నిమిషంలో పార్టీలో చేరినవారే అనుభవిస్తున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నవారు కాదు ఇళ్లలో ప్రశ్నలు ఎదుర్కొన్నవారు కాదు, సొంత ఖర్చులతో పార్టీని నిలబెట్టినవారు కాదు. అధికార వాసన వచ్చిన తర్వాత చేరినవారే లబ్ధిదారులు ఈ అసమానతే పార్టీని లోపల నుంచి కుళ్లగొడుతోంది

పాత–కొత్త వర్గాల మధ్య పొసగని పొత్తు కాదు… అది యుద్ధం!

పార్టీని మొదట్లో నడిపినవారు
అధికారం లేని రోజుల్లోనూ,
ఎన్నికల ఓటముల నడుమనూ,
ప్రజల మధ్య పార్టీ జెండాను వదలకుండా మోసిన పాత తరం నాయకులు ఒకవైపు.అధికారం వచ్చిన తర్వాత,నేనే నాయకుడు” అన్నట్టు ఎంట్రీ ఇచ్చిన కొత్త వర్గం మరోవైపు.ఈ రెండింటి మధ్య పొసగు లేదు.ఇది పొత్తు కాదు.ఇది మౌన యుద్ధం.పాతవారిని పక్కన పెట్టడం,కొత్తవారికి పెత్తనం పంచడం,మా మాటే చివరి మాట” అనే అహంకారం ఇవన్నీ పార్టీని లోపల నుంచే చీల్చేలా చేస్తున్నాయి

సొంత పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కృషి చేసింది ఎవరు?

ఈ ప్రశ్నకు సమాధానం బయట లేదు పార్టీ ఆఫీసుల లోపలే ఉంది.టిక్కెట్లు రాకపోవడం,
ప్రాధాన్యత దక్కకపోవడం,
తమ మాటకు విలువ లేదన్న కోపం
ఇవన్నీ కలిసి నిశ్శబ్ద తిరుగుబాటుకు దారి తీశాయి.
బయటికి బిఆర్ఎస్ జెండా పట్టుకుని,లోపల మాత్రంఎవడు గెలిచినా పరవాలేదు… మనవాడు మాత్రం గెలవకూడదు అనే నీచమైన రాజకీయాలు జరిగాయి. ప్రత్యర్థుల ప్రచారానికి అవసరం లేకుండా, సొంత పార్టీ నాయకులే అభ్యర్థుల కాలును పట్టి వెనక్కి లాగిన చరిత్ర ఇది.

పార్టీ లోపలే ఐక్యత లేని పాలకులు గ్రామానికి న్యాయం చేయగలరా??

మీరు మీరే కొట్టుకుంటుంటే,మాకు పాలన ఎలా ఇస్తారు. అని నమ్మకం తో గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పార్టీ లోపల ఐక్యత లేకపోతే ప్రజల్లో నమ్మకం నిలబడదన్నది రాజకీయ సత్యం.ఇలాగే కొనసాగితే ఈ పాలన ఐదేళ్లు కాదు,ఐదు నెలలకే ప్రజల నమ్మకం కోల్పోతుంది. చివరిగా ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోకపోతే,త్యాగాలను గుర్తించకపోతే,వర్గ. అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టకపోతే ఐనవోలు బిఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో మరింత రాజకీయ నష్టం తప్పదన్న హెచ్చరికలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

కుట్రలు చేసిన ఆ నా(లుగురు) యకులు బలైన ఈ నా(లుగురు)యకులపై సమగ్ర కధనం మరో సంచికలో……

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version