మహిళా న్యాయవాది దారుణ హత్య
• పొలం వద్దే మెడ కోసి చంపిన సోదరుడు
* ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి
* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం
* ఎస్ ఐ, ఎమ్మార్వో లను సస్పెండ్ చెయ్యాలి
* హత్యను నిరసిస్తూ రోడ్డుపై న్యాయవాదులు ధర్నా..
చేవెళ్ల, నేటిధాత్రి:
ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కనికరం లేకుండా సొంత చెల్లెలిని కత్తితో నరికి చంపిన ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం రేపింది.
కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్నకుమారి( 34) చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెకు, ఆమె సోదరుడు రాజుకి మధ్య ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద ఆస్తి పంచాయితీ జరుగుతుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు రాజు వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో మొయినాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
* పోలీసుస్టేషన్ ముందు చేవెళ్ల కోర్టు న్యావాదుల ధర్నా..
తోటి న్యాయవాది హత్యకు గురవ్వడంతో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులు బైకాట్ చేశారు. ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని న్యాయవాదులు ప్రశ్నించారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
* ఎస్ ఐ, ఎమ్మార్వో లను సస్పెండ్ చెయ్యాలి.
బుధవారం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్యకు
ఆస్థి వివాదమే కారణం కారణమయ్యింది. ఈ హత్యకు మొయినాబాద్ ఎమ్మార్వో, పోలీసులు కారణమని చేవెళ్ల కోర్టు న్యాయవాదులు ఆరోపించారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు.
రెవెన్యూ అధికారులు భూ సమస్యలు, ఆస్తి వివాదాలపై
అలసత్వం వహిస్తున్నారని, ప్రతి చిన్న సమస్యను కాలయాపన చేస్తూన్నారని, భూ హత్యలకు రెవెన్యూ
అధికారుల అలసత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో త్వరితగతిన సమస్యను పరిష్కరించి ఉంటే ఈరోజు ఒక నిండు ప్రాణం బలి కాకపోయుండేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అన్నారు.
