సైలెంట్ కిల్లర్.. లక్షణాలు లేకుండానే కమ్మేస్తున్న కిడ్నీ వ్యాధి
కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది.
- విలవిల్లాడుతున్న యువత
- 58.9 శాతం మందిపై ప్రభావం
- 24.01 శాతం మందికి అధిక రక్తపోటు
- అధికంగా పురుషులే బాధితులు
- ఏఐఎన్యూ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ: కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది. వ్యాధి ప్రభావం బయటపడకపోవడంతో చాలామంది తమకు కిడ్నీ జబ్బు ఉందనే విషయాన్నే గుర్తించలేకపోతున్నారు. నగర యువతలో సుమారు 58.9శాతం మంది ఈ వ్యాధి బారిన పడినప్పటికీ దీనిని గుర్తించక వైద్యులను సంప్రదించలేకపోతున్నారు. నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు 2025 వరల్డ్ కిడ్నీ డే నుంచి 2026 వరల్డ్ కిడ్నీ డే (12-3-2026) వరకు ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
ప్రతి నలుగురిలో ఒకరికి..
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 24.01 శాతం మందికి హైపర్టెన్షన్ ఉన్నట్లు తేలింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. స్టేజ్ 3 సీకేడీలో 2.46శాతం మంది, స్టేజ్ 4సీకేడీలో 0.33 శాతం, స్టేజ్ 5 సీకేడీలో 0.07శాతం మంది ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ సంఖ్యలు తక్కువగా కనిపించినప్పటికీ, ముందుగా నిర్ధారణ కాకుండానే నిశ్శబ్ద కిడ్నీ సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులు సమాజంలో ఉన్నారని సూచిస్తున్నాయని వివరించారు.
