https://epaper.netidhatri.com/
`ఆంద్రప్రదేశ్ లో కూటమికే గెలుపు సంకేతాలు.
`మళ్ళీ రియల్ బూమ్ కు రెక్కలు.
`ఇంత కాలం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక అవస్థలు.
`మళ్ళీ అమరావతి చుట్టూ రియల్ పరుగులు.
`తెలంగాణలో పడకేసిన అమ్మకాలు.
`ఆంద్రాలో పుంజుకుంటున్న వ్యాపారాలు.
`కర్ణాటక నుంచి కూడా అమరావతికి రియల్ వలసలు.
`తెలంగాణ రియల్ కు ఎప్పుడు మంచి రోజులు!
`ఆరు నెలల నుంచి ప్లాటు అమ్మింది లేదు?
`పైస చేతికొచ్చింది లేదు!
`లబోదిబోమంటున్న రియల్ వ్యాపారులు.
`మంచి రోజుల కోసం ఎదురుచూపులు.
`లిటిగేషన్ల లెక్కలతో రియల్ కు తలనొప్పులు!
`ధరలు తగ్గినా అమ్మకాల అలికిడి లేదు.
`భూమికన్నా జనం బంగారం మేలనుకుంటున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో రియలెస్టేట్ రంగం ఒడిదుడులకు లోనైందనే ప్రచారం ఊపందుకున్నది. దాంతో తెలంగాణ రియల్ బూమ్ కాస్త డల్ అయ్యిందంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రియల్ బూమ్ ఒక రకంగా తాండవమాడిరది. కేసిఆర్ పాలనలో సాగు నీటి రంగంలో వచ్చిన మార్పులు, రియల్రంగాన్ని పరుగులు పెట్టించాయి. ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు వేలల్లో వున్న భూముల ధరలు ఒక్కసారి లక్షలకు ఎగబాకాయి. కొద్ది కాలంలోనే లక్షల ధరలు కాస్త కోట్లకు చేరుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పల్లెల్లో కూడా రియల్ వ్యాపారం జోరుగా సాగింది. గ్రామాల్లో కూడా ప్లాట్ల బిబినెస్ మొదలైంది. ఇలా రియల్ రంగం పల్లెలను కూడా వదల్లేదు. భూములు బంగారాన్ని మించి పోయాయి. అటు సాగు రంగం పెరగడంతోపాటు, ఇటు రియల్ వ్యాపారం విసృతంగా పెరిగింది. వ్యవసాయ భూముల ధరల ఆకాశాన్నంటాయి. ఒక దశలో ఎకరం భూమి కొనుగోల కష్టమైపోయింది. అలాంటి ఎత్తునుకు చూసి రియల్ వ్యాపారం గత ఆరు నెలలుగా నేల చూపులు చూస్తోంది. ఇప్పుడు మరింత దిగజారింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ జన సంద్రాలైనాయి. హైదరాబాద్ ఐటి హబ్గా మారడంతో ఒకప్పుడు గుట్టలు, బండరాళ్లతో కూడిన ప్రాంతాలన్నీ జన సంచారంతో నిండిపోయాయి. అక్కడ ఆకాశ హ్రమ్యాలు పెరిగిపోయాయి. అసలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్సీ ఆనవాలు కనుమరుగయ్యాయి. రియల్ రంగం అక్కడి నుంచి విస్తరించి, శంషాబాద్ వరకు పెరగుతూ వెళ్లింది. ఇటు శేరిలింగం పల్లి దాటి పోయింది. సంగారెడ్డిని కమ్మేసేంత దూరం వెళ్లిపోయింది. ఐటి రంగమంతా నగరంలోనే విస్తరించడంతో యువత మొత్తం ఆ కంపనీలకు దగ్గర్లోనే నివాసాలు కోరుకోడంతో విలాసవంతమైన భవనాలు అనేక వెలిశాయి.
గజం భూమి కూడా దొరకనంతగా కాంక్రీక్ జంగిల్ నిండిపోయింది.
అయితే హైటెక్ సిటీలో కూడా స్ధలం లేకపోవడంతో ఐటి నగర శివారుకు కూడా విస్తరించింది. దాంతో రియల్ వేగం ఎవరూ అందుకోలేంతన వేగంగా జోరుగా సాగింది. ఇప్పుడు నగర శివారులో కూడా స్ధలాల కొనుగోలుకు ఆస్కారం లేకుండాపోయింది. ఒకప్పుడు గ్రామాలుగా వున్న నగర శివారు ప్రాంతాలలో పల్లెలన్నీ మాయమైపోయాయి. అప్పార్టుమెంట్లతో నిండిపోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఐటి రంగం మరింత విస్తరించడం కూడా రియల్ రంగానికి ఊపిరి పోసినట్లైంది. దానికి తోడు ఫార్మా రంగం కూడా నగర శివారుల్లో విస్తరించడం కూడా రియల్ భూముకు అదనంగా కలిసొచ్చింది. దాంతో కాంక్రీట్ జీవనం నచ్చని నగర ప్రజలు పల్లె వాతావరణం మేలంటూ మళ్లీ స్వగృహాల వైపు మళ్లారు. దాంతో విల్లాలు విపరీతంగా వెలిశాయి. పట్టణం విస్తీణం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ పరిసరాల్లో ఎటు చూసిన ముప్పై కిలోమీటర్ల వరకు నగరం విస్తరించింది. పల్లెను ఆక్రమించింది. ఇంత వరకు బాగానే వుంది. కాని గత ఆరు నెలలుగా రియల్ రంగం కుదేలౌతూ వచ్చింది. ఐటి రంగం కొంత ఒడిదొడుకులను చూస్తోంది. కరోనా కాలం తర్వాత ఐటి రంగంలో పెను మార్పులు సంబవిస్తూ వచ్చాయి. దాంతో ఐటిలో అనేక ఎగుడుదిగులు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద కంపనీలే సరైన ప్రాజెక్టులు లేక అవస్ధలు పడుతున్నాయి. దాంతో ఉద్యోగుల కోత, కంపనీల ఎత్తివేత కూడా రియల్ రంగం మీద విపరీతమైన ప్రభావం చూపుతోంది. తెలంగాణలో ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు వెలువడినప్పటి నుంచి కూడా రియల్రంగం చూపులు నేల వైపు జారాయి. ఇప్పట్లో ఆకాశం చూసే పరిస్ధితులు కనిపించడం లేదు. అయితే ఈ పదేళ్ళ కాలంలో పెరిగిన రియల్ రంగంలో కూడా తప్పులు విపరీతంగా జరిగాయి. అనేక కంపనీలు ప్రజలు మోసం చేయడం కూడా రియల్ రంగంలో వచ్చిన మార్పులకు కారణమైందనే చెప్పాలి.
రకరకాల ఆఫర్లతో ప్రజలను మైమరిపించి, మోసం చేసిన కంపనీలు అనేకం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
అరచేతిలో వైకుంఠం చూపించి, కస్టమర్లను నిండా ముంచాయి. గత రెండేళ్లుగా ఇలా బోర్డు తిప్పేసిన కంపనీలు అనేకం వున్నాయి. దాంతో భూముల మీద పెట్టుబడి పెట్టాలంటే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ సమస్య ఇలా వుంటే చాలా మంది రియలెస్టేట్ వ్యాపారులు లిటిగేషన్లు వున్న భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది. కొన్న ప్రజలకు తిప్పలు మొదలయ్యాయి. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రియల్ రంగంలో జరిగిన అవకతవకలపై దృషి ్టపెట్టింది. దాంతో పెద్ద పెద్ద కంపనీల భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది. దాంతో రియల్ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కసారిగా రియల్ రంగం ఉచ్చదశను చూసింది. తెలంగాణకు మించి వ్యాపారం జరిగింది. రాష్ట్రం విడిపోవడానికి ముందే ఆంధ్రలో భూములకు మంచి ధరలే వున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ కూడా మరింత ఊపు వచ్చింది. అమరావతి రాజధానితో అటు విజయవాడ, గుంటూరు జిల్లాలలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కాని 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వతం మారింది. చంద్రబాబు పాలన పోయి, జగన్ పరిపాలన వచ్చింది. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతితోపాటు, అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ప్రకటించారు. దాని వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం రియల్ వ్యాపారం ఎవరూ ఆపలేనంత పెరుగుతందని అనుకున్నారు. కాని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుందని ఎవరూ ఊహించలేదు.
మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు వెళ్లకపోవడంతో, అమరావతిలో కూడా ధరలు విపరీతంగా పడిపోయాయి.
రాష్ట్రం మొత్తం భూముల అమ్మకాలు,కొనుగోలు వ్యాపారం ఆగిపోయింది. కనీసం పోలవరం పూర్తయినా కొంత వ్యాపారం గాడిలో పడేదేమో! కాని అదీ పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్ధితులను గురించి విరవిస్తూ ఓ దశలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాలు అమ్మినా, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం రాకపోయేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వంద ఎకరాలు అమ్మినా, తెలంగాణలో ఒక్క ఎకరం రావడం లేదన్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడ ఆలోచన మొదలైంది. జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం గురించి ఆలోచన ప్రారంభమైంది. ఇటీవల తెలుగుదేశం కూటమి వైపు ప్రజలు ఆలోచిస్తున్నారన్న సంకేతాలు వెలువడుతుండడంతో, రియల్ రంగానికి మళ్లీ మంచిరోజులు రానున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో రియల్ రంగం ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఇప్పడున్న పరిస్ధితుల్లో రియల్ రంగం పురోగమనం కష్టంగా వుంది. ఆంధ్రప్రదేశ్లో రియల్రంగానికి మంచి తరుణం కనిపిస్తోంది. మరో వైపు కర్నాకటలో రియల్రంగం కూడా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. గత ఐదేళ్లు కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని అమరావతి మళ్లీ పరుగుల పెట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా రియల్రంగ నిపుణుల సూచనలతో, వ్యాపారులు అక్కడ వాలుతున్నారు. పెట్టుబడులు అక్కడ పెడుతున్నారు. తెలంగాణలో కూడా సాగు కష్టం మొదలౌతోంది. పదేళ్లలో కనిపించని కష్టం తెలంగాణలో కనిపిస్తోంది. దాంతో ఇక్కడ ఎంత లాభం వచ్చినా పరవాలేదు..ఇక్కడ వున్న భూములను అమ్మి, అమరావతిలో పెట్టుబడులుపెట్టేందుకు రియల్ రంగ వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం…