కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం.

-లంచాలు తీసుకోకుండా వుండలేం?

-రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము.

-ఇరుక్కొని ఇబ్బందులు పడలేం.

-మొదటికే మోసం తెచ్చుకోలేం.

-బలవంతంగా కొలువు చేయలేం.

-రాజకీయాల ఒత్తిడి భరించలేం.

-చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం.

-హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం.

-రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం

-కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం.

-అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం.

-కుటుంబానికి దూరంగా వుండి బతకలేం.

-ట్రాన్స్‌ఫర్ల బారిన పడి ఈ వయసులో ఒంటరి జీవితాలు అనుభవించలేం.

-కనికరించండి..విముక్తి ప్రసాదించండి.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల వేడుకోలు.

-ఇప్పటికే చాలామంది నిజాయితీగల ఉద్యోగులు నిరవదిక సెలవల్లో ఉన్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి
ఈ కొలువులు మాకొద్దు మహా ప్రభో అని కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా వున్న ఉద్యోగులు కొందరు తమ ఆంతరంగికుల వద్ద చెప్పుకుంటున్నారు. రిటైర్‌ మెంటు దగ్గరగా వున్న ఉద్యోగులు చాల మందిది ఇదే అభిప్రాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు రిటైర్మెంట్‌వయసు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్త వారిలో కొంత కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం పెంచింది. అదే పెద్ద భారమనుకుంటే, మళ్లీ ఈ ప్రభుత్వం మరింత పెంచే ఆలోచనలు చేస్తుందన్న వార్తలు వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆందోళణకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. పైగా ఇంత కాలం అదీ ఇదీ తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు కూడా వున్నారు. ఇప్పుడు కూడా ఏదీ లేకుండా పనిచేయలేకపోతున్నాం. మరో వైపు రాష్ట్ర సర్కారు ఏసిబి దాడుల నేపధ్యం కూడా తోడౌతుంది. మరో వైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పని చేసినా కష్టమే..చేయకపోయినా కష్టమే! చేస్తే ఊరికే చేయొద్దని అంటారు. చేస్తే తప్పంటారు. రాజకీయ నాయకులు తెచ్చే పనుల్లో ఎంత నిజాయితీ వుంటుందో అందరికీ తెలిసిందే. చేయకపోతే వారు ఊరుకోరు. చేయమని చెప్పే ధైర్యం మాకు లేదు. ఇచ్చింది తీసుకొని పనిచేయాలంటే భయమేస్తోంది. ఎక్కడ ఏసిబికి చిక్కి చిక్కుల్లో పడతామేమే అన్న భయం వెంటాడుతోంది. ఈ వయసులో లేని పోసి సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని పనులు చేయలేక, నాయకులకు ఎదురు చెప్పలేక ఓ వైపు సతమతమౌతున్నాం. ప్రతి వారు వచ్చిన పని చేయమని బెదిరించేవారు తయారయ్యారు. నీతిగా పనిచేయాలంటే కొన్ని పనులు కావు. అవినీతికి పాల్పడితే ఎప్పుడు పట్టుబడతామో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి మరింత పవర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందిని పెంచే కసరత్తు కూడా జరుగుతోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్దం కాకుండా వుంది. బాదితుల పక్షాన నిలిస్తే నాయకులు ఊరుకోరు. నాయకుల పక్షాన తప్పు చేస్తే బాధితులు సహించరు. ఇద్దరి మధ్య నలిగిపోతూ పనిచేయలేని పరిస్దితి ఎదురౌతోంది. నాయకులు చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు తప్పని సరి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ట్రాన్స్‌ఫర్లను ఆహ్వానించలేం. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వెళ్లలేం. కుటుంబాన్ని వదిలేసుకొని వెళ్లే పరిస్దితి లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వుంటున్నాయి. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అక్కడికి కుటుంబంతో వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు. ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లి వుండే అవకాశంలేదు. ఏ క్షణం ఎలా వుంటుందో ఆరోగ్య పరిస్దితులు అనే భయం కూడా వెంటాడుతోంది. దాంతో పనులు చేయలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యభర్తల వయసు ఎలాగూ 55 దాటివుంటుంది. భర్త ఉద్యోగి అయితే అతని వెంట కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేని పరిస్థితి. భర్త ఉద్యోగం చేసే స్ధలాలకు భార్య వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఎక్కడికో మారు మూల మండలాలకు ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ నరకం చెప్పనలవి కానిది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం అవసరమా? అనే పరిస్దితుల్లో వున్నామని చాల మంది ఉద్యోగులు తెలిసిన వారి ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిస్ధితులను బట్టి మెదులుకోవాలి. నాయకుల తీరును బట్టి మసలుకోవాలి. ఉద్యోగ వర్గాలపై రాజకీయ నాయకుల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రియల్‌ వ్యాపారం పెరిగిన తర్వాత మా కష్టాలు మాకు వున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు వుంటుంది. ఆ సమయంలో ఇచ్చే దాన్ని తీసుకోకుండా వుండలేం. నాయకులు వచ్చిన పుణ్యానికి చేయకు? అంటారు. తీసుకుంటే పుణ్యానికి చేస్తున్నావా? అని నిలదీస్తారు. బాధితులు వచ్చి నానా బూతులు తిడుతుంటారు. అన్యాయం చేస్తున్నారని కేసులు పెడుతుంటారు. వాటన్నింటినీ ఈ వయసులో ఎదుర్కొనే శక్తి లేదు. పొరపాటో, గ్రహపాటో ఎదురైతే, పుసుక్కున ఏసిబికి చిక్కితే జైలు జీవితం అనుభవించలేం. అలాగని బలవంతంగా కొలువులు చేయలేకపోతున్నాం. వయసు మీద పడుతోంది. ఒత్తిడితో మానసిక ఆందోళలకు గురయ్యే పరిస్తితి వుంటోంది. రాజకీయ నాయకులు తర్వాత ఆదుకోవడం అంటూ ఏమీ వుండదు. వాళ్ల పని వారు చేయించుకొని వెళ్తారు. చేతులు దులుపుకుంటారు. పొరపాట్లు చేయించి, మాకేం సంబందం అంటారు. ఉద్యోగులను ఇరికిస్తుంటారు. వారికి ఆ స్వేచ్చ వుంది. ఉద్యోగులకు ఆస్వేచ్చ లేదు. చేతులు దులుపేసుకుంటా? చట్టం వదిలిపెట్టదు. ఎరక్కొపోయి, ఈ వయసులో ఇరుక్కోవడం ఎందుకు? అన్న ప్రశ్నలే వారి మెదల్లోలో మెదులుతున్నాయి. రిటైర్‌ మెంటు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు ప్రబుత్వ ఇవ్వాల్సిన నిదులు ఇవ్వకపోయినా బాండ్లు ఇచ్చినా తీసుకుంటాం. అది ఐదేళ్లకు ఇచ్చిన సరిపెట్టుకుంటాం. కాని ఈ ఉద్యోగాలు మేం చేయలేం. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించండని కోరుతున్నారు. హాయిగా రిటైర్‌ మెంటు తీసుకొని ముదిమి వయసులో ఎంతో కొంత సంతోషంగా వుంటామంటున్నారు. నాయకులు చెప్పే ప్రతి పనిని చేయలేకపోతున్నాం. కనికరించండి. విముక్తి ప్రసాదించండి? అని కొంత మంది అదికారులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్దితులను తాళలేక చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవ్‌లు పెట్టుకొని ఇంటి వద్ద వుంటున్నారు. ఎప్పుడు రిటైర్‌ మెంటు ఇచ్చినా సంతోషమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆనందంగా తప్పుకుంటామంటున్నారు. చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవుల్లో వుండడం వల్ల, చాలా కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు బాద్యతలు నిర్వహిస్తున్నారు. రెండు మూడేళ్ల సర్వీసు వున్న ఉద్యోగులు కొలువులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పదేళ్ల కాలంగా గత ప్రభుత్వ పార్టీ నాయకులు చెప్పినవి చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా అదికారంలో లేకపోవడంతో ఈ పార్టీ నాయకుల పనులు మళ్లీ చేయాలంటే చేయలేకపోతున్నారు. గతంలో ఏమేం చేశారో మాకు తెలుసంటూ ఈ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేసినప్పుడు మేం చెప్పినట్లు ఎందుకు చేయరంటూ కోపం ప్రదర్శిస్తున్నారు. కాదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడం కన్నా, నాలుగు రోజులు హాయిగా బతకాలంటే రిటైర్‌మెంటు ఒక్కటే దారి అని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది అందరి ఉద్యోగుల మనోగతం మాత్రం కాదు. కొంత మంది రిటైర్‌మెంటుకు అతి సమీపంలోవున్న ఉద్యోగుల ఆవేదన మాత్రమే. వారి ఆందోళనలో న్యాయం వుందా? లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ఇంత కాలం పనిచేసి, ఇప్పుడు తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమో కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వ్యవస్ధలను అందరూ కలిసి భ్రష్టు పట్టించారన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. తమ దాకా వస్తే ముఖం చాటేస్తారన్నది వాస్తవం. తప్పుకొని తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నది మరింత నిజం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version