ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం హజ్రత్ ఇబ్రాహీం (అలై), ఆయన కుమారుడు ఇస్మాయీల్ (అలై) అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించిన కాబా గృహం నేడు గొప్ప ఆరాధనా స్థలంగా మారింది.
‘ఈ గృహాన్ని సకలజనావళికి కేంద్రంగా, శాంతి నిలయంగా రూపొందించాం.
ఇబ్రాహీం ఆరాధన కోసం నిలిచిన ఈ పవిత్ర ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా ఏర్పాటుచేయమని ఆదేశించాం.
అలాగే ఈ గృహానికి ప్రదక్షిణ, అందులో ఏతెకాఫ్, రుకూ, సజ్దాలు మొదలైనవన్నీ పాటించేవారి కోసం ఈ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచమని ఇబ్రాహీంను, ఇస్మాయీలును నిర్దేశించాను’ అని ఖురాన్లో అల్లాహ్ పేర్కొన్నాడు.
అందుకే ముస్లింలు ఏటా మక్కా వెళ్తారు. అక్కడ ఖుర్బానీ ఇస్తారు.
పండుగకు ముందురోజైన ‘యౌమె అరపా’ నాడు ఉపవాసం పాటిస్తే..
వారు గత సంవత్సరం చేసిన పాపాలు క్షమకు నోచుకుంటాయని ప్రవక్త (స) తెలియజేశారు.
హజ్ యాత్ర
ఇస్లాం ఐదు మూలస్తంభాల్లో హజ్ ముఖ్యమైంది.
స్తోమత ఉన్న ముస్లింలు జీవితకాలంలో ఒక్కసారైనా తప్పక చేయాల్సిన ధార్మిక విధి.
ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలున్న విశిష్ట ఆరాధన ఇది. ఏటా లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు వెళ్తారు.
ప్రపంచం నలుమూలల నుంచి అల్లాహ్ పట్ల భక్తితో ఆయన ఆహ్వానానికి జవాబుగా ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అని పలుకుతూ కాబాగృహానికి వస్తారు.
జాతి, ప్రాంతం, భాషా భేదాలు అక్కడ కనిపించవు.
అందరూ ఒకేరకమైన నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఒకే విధమైన హజ్ కర్మలు నిర్వర్తిస్తారు.
సర్వమానవ సమానత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తారు.
హజ్ యాత్రికుల హృదయాల్లో అల్లాహ్ పట్ల అంతులేని విశ్వాసం, ప్రేమ తొణికిసలాడుతుంటాయి.
హజ్ యాత్రికుల అంతరంగంలో దేవుడొక్కడే అనే భావన, సమాజపరంగా అందరూ ఒక్కటేనన్న ఆలోచన బలపడతాయి.
హజ్ యాత్ర ప్రజల్లో సమానత్వాన్ని, సహోదర భావాన్ని దర్శింపజేస్తుంది.
ఒకే దైవం, ఒకే ప్రవక్త (స) అన్న విశ్వాసం, ఒకే జీవిత లక్ష్యం (ఖురాన్), ఒకే జీవన విధానం (కిల్లా.. కాబా ప్రదక్షిణ) ఇవన్నీ సామాజిక సమైక్యతకు బలమైన పునాదులు
ఇబ్రాహీం గాథ
నేటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అరబ్బు భూభాగంలో దైవగృహం సాక్షిగా జరిగిన ఇబ్రాహీం గాథను, ఆయన త్యాగస్ఫూర్తి, సహనశీలతలను బక్రీద్ నాడు స్మరించుకుంటారు.
ఇబ్రాహీం (అలై) మహా దైవప్రవక్త.
ఆయనకు ఖలీలుల్లాహ్ (దేవుని మిత్రుడు) అనే బిరుదు కూడా ఉంది.
ఒకనాడాయన తన పుత్రుడి గొంతు కోస్తున్నట్లు కలగన్నారు.
దీన్ని దైవాజ్ఞగా భావించి పుత్రుణ్ణి సంప్రదించారు. ‘ఆ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చండి.
నేను సిద్ధంగా ఉన్నాను.
అది దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు’ అన్నాడు.
దీంతో ఇబ్రాహీం తన ప్రాణం కంటే మిన్న అయిన పుత్రుడి మెడ నరికేందుకు కత్తి తీసుకున్నారు.
బాల ఇస్మాయీల్ తన మెడ కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.
మెడపై కత్తి పెట్టగానే ‘ప్రియమైన ఇబ్రాహీం!
నువ్వు నీ కలను నిజం చేయడానికి పూనుకున్నావు.
నా ఆజ్ఞను అమలుచేసేందుకు మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను ప్రసన్నుడనయ్యాను.
పరీక్షలో అత్యుత్తమంగా ఉత్తీర్ణులయ్యారు.
ఇక భౌతిక చర్యగా మిగిలిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు.
ఇది మీ పరిపూర్ణ విశ్వాసానికి మచ్చుతునక అంటూ దైవవాక్కు వినిపించింది.
స్వర్గం నుంచి పొట్టేలు ప్రత్యక్షమై ఇస్మాయీల్ స్థానంలో కనిపించింది.
దాంతో పుత్రుడికి బదులు పొట్టేలును బలి ఇచ్చారు. ఇలా బలివ్వడాన్ని ఇస్లామీయ పరిభాషలో ఖుర్బానీ అంటారు.
బక్రీద్ అంటే త్యాగోత్సవం.