ఆన్ లైన్ జూదంతో అప్పులు.. పీజీ వైద్య విద్యార్థి సూసైడ్
తమిళనాడులోని కొడైకెనాల్ సమీపంలో తన కారులో ఒక యువ వైద్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మృతుడిని దిండిగల్ జిల్లా వేద చంద్రూర్కు చెందిన జోషువా సమ్రాజ్ (29)గా పోలీసులు గుర్తించారు. అతడు రెండో సంవత్సరం పీజీ వైద్య విద్య చదువుతున్నాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. ఆన్లైన్ జూదాల్లో పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన జోషువా ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కారులో అతను ఇంట్రావెనస్ డ్రగ్ తీసుకుని మరణించినట్టు నిర్ధారించారు. జోషువా ఫిలిప్పీన్స్లో మెడిసిన్ పూర్తి చేసి తమిళనాడులోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు.
నాలుగు రోజులుగా జోషువా కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వేదచంద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పూంబారై సమీపంలో ఒక కారు ఆగి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో జోషువా మృతదేహాన్ని కనుగొన్నారు. పక్కనే ఇంట్రావెనస్ డ్రగ్ గుర్తించారు. కారులో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో లభించిన బ్యాంకు లావాదేవీల ఆధారంగా నిందితుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడని, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి ఆధారాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జోషుగా తనకు తానుగా ఇంజక్షన్ చేసుకుని సూసైడ్ కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. గతంలో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంవత్సరం మార్చిలో ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ సీనియర్ సర్జన్ డాక్టర్ జార్జ్ పి. అబ్రహామ్ (74) కూడా తన ఫామ్ హౌస్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది.