తగ్గి..నెగ్గి!

https://epaper.netidhatri.com/view/288/netidhathri-e-paper-8th-june-2024%09

భవిష్యత్తులో పవన్‌ సిఎం. కావడం ఖాయం.

-భవిష్యత్తు ఏపికి దొరికిన కొత్త గొప్ప నాయకత్వం.

-ఇకపై ఏపిలో ప్రాంతీయ పార్టీల చుట్టే రాజకీయం.

-జనసేన అధినేతే జనవిజేత!

-జనసేనుడి విశ్వరూపం!

-జనసేన ప్రభంజనం.

-నూటికి నూరు శాతం గెలుపు.

-చరిత్రలో సరికొత్త రికార్డు.

-పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.

-పదహారేళ్ళ కష్టం నుంచి వచ్చిన విజయం.

-ప్రజా రాజ్యం నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం.

-2014 జనసేన ఆవిర్భావం.

-పదేళ్ల సుదీర్ఘ పోరాటం.

-పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి భారం.

-ఈసారి కసిగా చేసిన రాజకీయం.

-తానేంటో చూపిస్తానని పదే పదే చేసిన శపథం.

-ఇన్నాళ్లకి నెరవేరిన లక్ష్యం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే గొప్పొడు అన్నట్లు పవన్‌ కళ్యాన్‌ నిజంగానే తగ్గినెగ్గాడు. తగ్గి నిలిచాడు. నిలిచి గెలిచాడు. గెలిచి చూపించాడు. తనేంటో తన పవర్‌ ఏమిటో మరోసారి నిరూపించాడు. తన సినీ జీవితంలోనే కాదు, రాజకీయాల్లో కూడా తానే నెంబర్‌ వన్‌ అని గెలిచి చూపించాడు. ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజం. ఓటమి తెలిసిన వాడికే గెలుపు విలువ తెలుస్తుంది. ఒకసారి ఓడిన వారికే గెలవాలన్న కసి మరింత పెరుగుతంది. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సివుంటుంది. గెలిచేందుకు పడాల్సిన శ్రమ కూడా తెలుస్తుంది. అప్పుడు విజయం కూడా ముంగిట్లో వచ్చి వాలుతుంది. ఇది జనసేనాదిపతి పవన్‌ కల్యాణ్‌ విషయంలో రుజువైంది. ఎందుకంటే రాజకీయాల్లో ఓటమిని చాలా మంది జీర్ణించుకోలేరు. పట్టుదలతో ముందుకు సాగలేరు. కొందరిని ఓటమి కుంగదీస్తే మరికొందరిలో మరింత కసి పెంచుతుంది. అదే పవన్‌ జీవితంలో విజయాన్ని అందించింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లు పవన్‌ అంటే గాలి కాదు. తుఫాన్‌..ఒక రకంగా చెప్పాలంటే సునామీ అన్నారు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు మొదలైంది కాదు. రాత్రికి రాత్రి నాయకుడినౌతానని పవన్‌ కూడా అనుకోలేదు. ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడైప్పుడే ఆయన రాజకీయాలను ఒంటబట్టించుకున్నాడు. కాని అప్పుడు పార్టీ గెలవకపోయేసరికి కొంతనిరాశకు లోనయ్యాడు. ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు అన్నతోనే విభేదించాడు. ఇది చాలా మందికి తెలియని అంశం. ఎందుకంటే పవన్‌ అంటే కసి. దేనినైనా సాధించాలన్న పట్టుదలకు నిదర్శనం. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో…అక్కడే వెతుక్కోవాలనుకున్నాడు.

రాత్రికి రాత్రి రాజకీయాలు ఏలడం సాధ్యం కాదని గ్రహించాడు. తెలుగు తెరను మూడు దశాబ్ధాల పాటు ఏలిన చిరంజీవికే రాజకీయాలు సాద్యం కాలేదు. అలాంటప్పుడు తానేంత కష్టపడాలో పవన్‌కు బోధపడిరది. అందుకే ఆయన ఒక్కొ మెట్టు ఎలా ఎక్కాలో అన్నదానిపైనే గురి పెట్టాడు. దానిని అర్ధం చేసుకోలేని వాళ్లు పదే పదే పవన్‌ను అనేక సందర్బాలలో ఎత్తి పొడిచే ప్రయత్నం చేశారు. కాని పవన్‌ ఏనాడు కుంగిపోలేదు. విమర్శలను నుంచి మరింత నాయకత్వానికి పదును పెంచుకున్నాడు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం కూడా చేశాడు. దాంతో ఆయనను టైమ్‌పాస్‌ లీడర్‌ అన్నారు. ప్యాకేజీ స్టార్‌ అన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని చేసినా ఆయన అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు, ఎంచుకున్న గమ్యం చేరేందుకు ఒక పధకం ప్రకారం ముందుకు వెళ్లాడు. ఆయన రాజకీయ జీవితంలో కొన్ని ఆసక్తిరమైన అంశాలు అనేకం వున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ముందు చూపు ఎంతో గొప్పదని చెప్పకతప్పదు. 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పోటీ చేయలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాడు. కాని ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం పవన్‌ కూడా పోటీ చేయడానికి ఇష్టపడలేదు. కారణం కొత్త రాష్ట్ర్గ్రం జగన్‌ లాంటి నాయకుడి చేతిలోకి వెళ్లే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అంధకారమౌతుందని ఊహించాడు. తర్వాత అదే జరిగింది. అయితే 2014 తర్వాత తెలుగుదేశం, జనసేన, బిజేపి పొత్తుతో వెళ్లాయి. అధికారంలోకి వచ్చాయి. కాని ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలకు పవన్‌కు తావు లేకుండాపోయింది. పైగా కేంద్రం నుంచి పెద్దగా సహకారం అందలేదు.దాంతో ముందు పవన్‌ కేంద్రం మీద అసంతృప్తి వెల్లగక్కాడు.

ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేయడాన్ని ఆయన భహిరంగంగానే విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ రెండు లక్షల కోట్లు ఇస్తామంటే రెండు పాచి పోయిన లడ్డూలంటూ కేంద్రాన్ని దుయ్యబట్టాడు. అది తెలుగుదేశం రాజకీయం మీద కూడా తీవ్రప్రభావం చూపింది. కారణాలు ఏవైనా తర్వాత 2019 ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీచేశారు. మూడు పార్టీలు ఎన్నికల్లో తలపడ్డాయి. దాంతో జగన్‌ లాభపడ్డాడు. ఒక్కఛాన్స్‌ అంటూ జగన్‌ చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశంపార్టీని, జనసేనను కాదనుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఏకంగా రెండు చోట్ల పోటీ ఓడిపోయారు. కనీసం ఒక్క చోట కూడా ప్రజలు గెలిపించలేదు. అది పవన్‌లో మరింత కసిని పెంచింది. ఐదేళ్లపాటు ఆయన సీరియస్‌ రాజకీయాలు చేయానుకున్నారు. లక్ష్యంతో ముందుకు సాగారు. జగన్‌ను ఎదుర్కొవాలంటే ఒంటరి పోరాటం చేసే సమయం ఇది కాదని నిర్ణయం తీసుకున్నారు. ఏపి పరిస్ధితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిరదని గ్రహించాడు. తెలుగుదేశంతో పొత్తుకు ఆనాడే మళ్లీ బిజాలు వేశాడు. ఎన్నికలకు రెండేళ్ల ముందే సంకేతాలు పంపుతూ వచ్చాడు. దీనిని వైసిపి రాద్దాంతం చేయాల్సినంత చేసింది. అయినా పవన్‌ ఎక్కడా వెరవలేదు. ప్రతిసారి జగన్‌ పాలనపై విరుచుకుపడుతూ వచ్చారు. అడుగడుగునా జగన్‌ను నిలదీస్తూ వచ్చాడు. ఒక్కొక్కరి తాట తీస్తానంటూ బెదిరిస్తూ వచ్చారు. ఇది జగన్‌ పాలన నచ్చని వారికి బాగా నచ్చింది. ఇదే క్రమంలో బైబై జగన్‌ అంటూ పవన్‌ చేసిన స్లోగన్లు బాగా జనంలోకి వెళ్లాయి. ఇక పవన్‌ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రశ్నిస్తే ఏకంగా జగన్‌ నువ్వు నాలుగో బార్యగా వుంటానంటే అభ్యంతరం లేదంటూ పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా జగన్‌ మీద ఆధిపత్యం సాధిస్తూ వచ్చారు. ఇది పవన్‌ అభిమానుల్లో మరింత ఆత్మస్ధైరం నింపుతూ వచ్చింది. పవన్‌ అభిమానుల్లో ఆశలు రేపింది. పవన్‌ నాయకత్వం మీద మరింత నమ్మకం ఏర్పడిరది. చంద్రబాబును జైలుకు పంపడం వంటి పరిణామాలు జరిగిన నేపధ్యంలో పవన్‌ తోడుగా నిలవడం వంటి అంశాలు తెలుగు సమాజాన్ని కదిలించాయి. ప్రజలు పవన్‌ వైపు ఆలోచించేలా చేశాయి. ఇక అప్పటి నుంచి పవన్‌ తన ప్రతాపాన్ని మరింత చూపిస్తూ వచ్చారు. వారాహితో సాగించిన పర్యటనలు గొప్పగా సాగాయి.

నిజంగా పవన్‌ సునామీయే. ఏ పార్టీ అయినా ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన అన్ని స్ధానాలు గెలవడం అన్నది ఎవరికీ సాధ్యం ఏనాడు సాధ్యం కాలేదు. కాని ఒక్క పవన్‌కుమాత్రమే సాధ్యమైంది. ఎక్కడ తగ్గాలో…ఎక్కడ నెగ్గాలో అన్నది ఇక్కడ కూడా పవన్‌ విజ్ఞతను చూపించింది. పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశంపార్టీ 25 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దాంతో జగన్‌ పార్టీ పావలా అంటూ ఎద్దేవా చేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ 24 సీట్లు జనసేనకు ఇచ్చింది. అందులో మూడు సీట్లు బిజేపికి ఇవ్వాలని షరతు పెట్టింది. అయినా పవన్‌ ప్రశ్నించలేదు. తెలుగుదేశం చెప్పినట్లుగానే విన్నాడు. ఇచ్చిన 24 సీట్లలో మూడు బిజేపికి ఇచ్చి, 21 సీట్లలో పోటీ చేశారు. 21కి 21 గెలిచారు. ఇదీ విజయంమంటే.. అని నిరూపించారు. పార్లమెంటు సీట్లు కేవలం 2 మాత్రమే ఇచ్చారు. ఆ రెండు సీట్లు కూడా జనసేన గెలవడం అంటే మాటలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి విజయంలో పవన్‌ పాత్ర చాలా గొప్పది. పెద్దది. పవన్‌ వల్లనే తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం సాధ్యమైందని చెప్పడంలో సందేహం లేదు. అసలు పదేళ్లలో ఏపికి ఏం చేయని బిజేపికి కూడా ఓట్లు పడడం, సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. తెలుగుదేశం పార్టీ బిజేపిపొత్తుకోసం ప్రయత్నం చేసినప్పుడు అందరూ బాబు నిర్ణయం తప్పన్నారు. కాని పవన్‌ అప్పటికే బిజేపితో కొనసాగుతున్నారు. ఏపికి స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు. పవన్‌ పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్‌ మీద కోపం ప్రజల్లో ఇంకా తగ్గలేదు. పైగా దేశంలో బిజేపి గెలుపు అవకాశాలే కనిపిస్తున్న సంగతి తెలిసి, తెలిసి చంద్రబాబు లాంటి నాయకుడు కాంగ్రెస్‌వైపు చూడలేడు. నిజంగానే దేశ వ్యాప్తంగా బిజేపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న సంకేతాలు వుంటే అప్పుడు పరిస్దితి వేరుగా వుండేదేమో! కాని గెలుపు వైపు వెళ్లడమే సరైన నిర్ణయం అనుకున్నారు. మళ్లీ 2014 పొత్తును తెరమీదకు తెచ్చారు. మూడు పార్టీలు కలిసి ముందుకు సాగాయి. అయితే భవిష్యత్తు ఏపిలో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలకే కీలకం కానున్నాయి. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపిలో కూడా కనిపించనున్నాయి. జాతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేని రాజకీయాలు సాగనున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version