హైదరాబాద్‌ లో ఇల్లు కొంటున్నారా? ఎపిసోడ్‌ 3

https://epaper.netidhatri.com/view/213/netidhathri-e-paper-20th-march-2024/2

బంజారా హిల్స్‌ రోడ్‌. నెం. 14? ఏం జరిగింది!?

బుల్డోజర్లు వస్తున్నాయి చూడు?

భాగ్యనగర్‌ స్టూడియో స్థలంలో బాగోతం.

రాఘవేంద్ర కన్స్రక్షన్‌ కబ్జా కహానీ!

బిల్డర్లతో అధికారుల మిలాఖత్‌.

నాయకులతో సంచుల దండలు.

నాయకులకు, అధికారులకు లక్షలకు లక్షలు, కొంతమందికి కోట్లు?

నిబంధనలకు తూట్లు…వెలసిన అప్పార్టుమెంట్లు!

20 ఫీట్ల నాలా 4 ఫీట్లకు కుదింపు?

స్టూడియో వెనకాల వున్న ప్రభుత్వ భూమి స్వాహా?

అధికారులను ప్రశ్నిస్తే అప్పుడు మేం లేమంటున్నారు?

ప్రభుత్వం ఆదేశిస్తే కూల్చేస్తామంటున్నారు?

నాయకులు మాకేం సంబంధం అంటున్నారు?

కూల్చడమే మేలని జనమంటున్నారు?

అక్రమార్కుల భరతం పట్టమంటున్నారు?

అది బంజారాహిల్స్‌ రోడ్డు నెం.14. అక్కడ ఒకప్పుడు రాళ్లు రప్పలే వుండేవి. కాని ఇప్పుడు సంపన్నులు మాత్రమే నివసించే ప్రాంతం. అది చెన్నారెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన కాలం. అప్పటి మద్రాసులో దక్షిణాదికి చెందిన ఉమ్మడి సినీ అవార్డుల పురస్కారాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అప్పటి సినీ పెద్దలంతా ఆ కార్యక్రమానికి రావాలని చెన్నారెడ్డిని కోరడం జరిగింది. దాంతో ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివస్తే, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎంత కావాలంటే అంత స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. సినీ కార్మికులకు అవసరమైన భూమిని కూడా అందిస్తామనన్నారు. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ తరలివస్తే, ఎలాంటి ప్రతిపాదనలకైనా సిద్దమని ప్రకటించారు. దాంతో సినిమా నిర్మాణం కోసం హైదరాబాద్‌, తెలుగు ఇతర ప్రాంతాలకు రావడం మళ్లీ చెన్నై వెళ్లిపోవడం చేస్తుండేవారు. దాంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున ఖర్చు అయ్యేది. నటులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. దాంతో హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మాణం చేసుకోవడానికి స్థలాలు కావాలని కోరారు. అందుకు వెంటనే అంగీకరించిన చెన్నారెడ్డి స్థలాల ప్రతిపాదనలు పంపమన్నారు. దాంతో రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయా, సారధీ ఇలా పెద్దపెద్ద స్డూడియోల నిర్మాణం జరిగింది. అదే సమయంలో భాగ్యనగర్‌ అనే స్టూడియో కోసం కూడా అప్పటి ప్రభుత్వం స్ధలం కేటాయించింది. అదే రోడ్డు నెంబర్‌.14. అక్కడ కొంత కాలం స్టూడియో నడిచింది. సినిమాల నిర్మాణం కూడా జరిగింది. కాని పూర్తి స్ధాయిలో జరగలేదు. కాలం గిర్రున తిరిగింది. అభయారణ్యం లాంటి బంజారాహిల్స్‌ జనారణ్యమైంది. దాంతో స్థలాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ రావడంతో, ఇతర స్టూడియోలలో కూడా సినిమాల షూటింగ్‌ అంతంతమాత్రమే సాగడం మొదలైంది. దాంతో అన్నపూర్ణ లాంటి స్టూడియోలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. నిజానికి స్టూడియో నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని కేవలం షూటింగ్‌ల కోసం మాత్రమే వినియోగించాలి. ఆ స్ధలాలను అమ్మడం, ఇతర కట్టడాలు నిర్మాణం చేయడం నిశిద్దం. కాని అన్నపూర్ణలో కట్టడాలు వెలుస్తుండడాన్ని చూసిన భాగ్యనగర్‌ స్టూడియో చెందిన వాళ్లు, ఆ స్ధలాన్ని రాఘవేంద్రా కన్స్‌స్ట్రక్షన్‌ కంపనీకి అమ్ముకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆ స్ధలాలకు పెద్దగా డిమాండ్‌ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బంజారాహిల్స్‌లో అడుగు జాగ కూడా లేకుండాపోయింది. అలా నిర్మాణాలు పెరిగిపోయాయి. దాంతో అక్కడ స్టూడియో వుండేదని, ఆ స్థలం స్టూడియోదని స్ధానికులకు కొందరికి తప్ప మరెవరకీ లేదు. ఇదే రాఘవేంద్ర కంపనీకి వరమైంది. అప్పటి సిటీ ఛీప్‌ ప్లానర్‌ అండదండలు తోడయ్యాయి. ఆ సమయంలో వున్న తహసిల్దార్‌లు కూడా పూర్తిగా సహకరించారు. భాగ్యనగర్‌ స్టూడియో అధినేతలు దానిని అమ్మేసుకున్నారు. నిజానికి ఆ స్ధలంలో ఎలాంటి కాంక్రీట్‌ నిర్మాణాలు జరగకూడదు. ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగినా ప్రభుత్వం ఆ స్ధలం స్వాదీనం చేసుకోవాలి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్‌ఎంసిలో సిటీ ఛీఫ్‌ ప్లానర్‌ పూర్తిగా సహకరించాడు. రాఘవేంద్ర కంపనీకి అన్ని రకాల అనుమతులు అందించాడు. పనిలో పనిగా ఆ స్టూడియో పక్కన వెనుకవైపు సుమారు 1000 గజాల ప్రభుత్వ స్థలం వుంది. దానిని కూడా రాఘవేంద్ర నిర్మాణ కంపనీ కమ్మేసింది. అంటే కబ్జా చేసింది. అప్పటి ఎమ్మార్వో పూర్తిగా సహకరించాడు. మొత్తంగా అధికారులందరినీ గుప్పిట్లో పెట్టుకొని రాఘవేంద్ర కంపనీ అక్కడ అక్రమంగా అప్పార్టుమెంటు కట్టేసింది. భాగ్యనగర్‌ స్టూడియో వెనక స్థలం 1000 గజాలు స్వాహా చేయడమే కాకుండా, ముందు వుండాల్సిన నాలా కూడా కమ్మేశారు. ఆ స్ధలం ముందు సుమారు 20 ఫీట్ల నాలా వుండాలి. గతంలో వుండేది. దాన్ని 5 ఫీట్లకు కుదించారు. ఆ పని అప్పుడు జిహెచ్‌ఎంసి వాళ్లతోనే పని కానిచ్చారు. తమ చేతికి మట్టి అంటకుండా తెలివి ప్రదర్శించారు. నిజానికి అక్కడ 20 ఫీట్ల నాలా వుండాలి.
ఈ విషయాలపై కొంత మంది స్ధానికులు సంబందిత అధికారులకు కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఆర్టీఐకి ధరఖాస్తు చేసుకున్నారు. కాని ఎవరూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మాకు సంబంధం లేదన్న మాటను కూడా చెప్పడానికి వెనకాడలేదు. అంతే కాదు సంబంధిత తహసిల్ధార్‌ మీకు అవసరమైన ఫైలు ఎక్కడుందో వెతుక్కొండంటూ తిక్క సమాధానం చెప్పడానికి వెనుకాడలేదు. ఫైళ్లకు సంబంధించిన వివరాలు తెలిసిన అధికారులు, పిర్యాధు దారునికి అందించకుండా, ఆ గదిలో ఎక్కడుందో వెత్తుక్కోపో..అంటూ భయపెట్టడం జరిగింది. అలా ఏ అధికారి స్ధానికులకు సహకరించలేదు. అంటే స్టూడియోలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొదన్న నిబంధనలు ఉల్లంఘించారు. ఆ స్ధలాన్ని ఎవరూ అమ్ముకోవద్దు. కొనుగోలు చేసుకోవద్దు. అయినా అమ్ముకున్నారు. కొనుక్కున్నారు. అక్కడ అప్పార్టుమెంటు నిర్మాణం చేశారు. నిబంధనలకు తూట్లు పొడిచారు. పైగా ఆ వెనకాల వున్న 1000 గజాల స్థలాన్ని కూడా స్వాహా చేశారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు సరికాదా..సహకరించారు. నేటిధాత్రి వెలుగులోకి తెచ్చినా అధికారులకు చీమ కుట్టినట్లైనా కావడం లేదు. ఈ విషయంపై ఏ అధికారిని నేటిధాత్రి సంప్రదించినా ఇప్పుడు నేను అక్కడ పనిచేయడం లేదని గతంలో పనిచేసిన వాళ్లంటున్నారు. అప్పుడు ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందని ఇప్పుడు పనిచేస్తున్నవాళ్లు అంటున్నారు. కాని ఆ పొరపాటు ఎవరు చేశారో తెలుసు? ఎలా చేశారో తెలుసు. ఎందుకు చేశారో తెలుసు. కాని ఎవరూ స్పందించరు. ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకొని, ఎలాంటి నిర్మాణాలు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కాని అధికారులు ఆచరించడం లేదు. పట్టించుకోవడం లేదు.
ప్రజలనుంచి వున్న విజ్ఞాపనలను కూడా అధికారులు లెక్క చేయడంలేదు. ప్రభుత్వ ఆదేశాలను అధికారులే బేఖాతరు చేశారు. ఎలాంటి అక్రమ నిర్మాణాలని తేలినా వెంటనే వాటిని తొలగించడం ఖాయమంటూ ప్రభుత్వం చెబుతుంటే, అధికారులకు చలనం లేకుండాపోతోంది. కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఎవరికి వారు పలహారం పంచుకున్నట్లు పంచుకున్నారు. అమ్మకానికి పెట్టి అమ్ముకుంటున్నారు. అప్పార్టుమెంట్లు చేసి, కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. సామాన్యులను బలి చేస్తున్నారు. ఇప్పటికైనా భాగ్యనగర్‌ స్టూడియో స్ధలంలో జరిగిన నిర్మాణాల అమ్మకం ఆపాలి. కొన్నవారికి అసలు విషయం తెలియజేయాలి. మిగిలిన వాటి అమ్మకాలను నిలిపివేయాలి. ప్రభుత్వం ఆ స్ధలాన్ని ముందుగా స్వాధీనం చేసుకోవాలి. లేకుంటే స్థలం కనిపిస్తే చాలు…కబ్జా పెట్టేద్దాం.. బిల్డింగులు కట్టేద్దాం..కోట్ల ఖరీదుకు అమ్ముకుందాం..రియలెస్టేట్‌ వ్యాపారం అని చెప్పుకుందాం అనేవాళ్లు చాలా మంది పెరిగిపోయారు. అదికారులు అడిగింది ముట్టజెప్పుదాం…ప్రసన్నం చేసుకుందాం… అక్రమ పెట్టుబడికి పదింతలు లాభాలు పొందుదాం అనుకునేవారే రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రభుత్వ స్ధలాలు కొట్టేయడం ఎంత సులువో తెలుసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌ పరిసరాల్లో ఏ స్ధలమైనా ఏదో ఒక కిరికిరి వుంటుంది. ఆ లెక్కలేవో ప్రభుత్వ స్ధలాలు నొక్కేసి చూసుకుంటే సరిపోతుందని అనుకునేవారు కూడా పెరిగిపోయారు. ఇలాంటి వారు నగరంలో చుట్టూ చేరిపోయారు. స్ధలాలను కబ్జాలు పెడుతుంటారు. బిల్డర్ల అవరతామెత్తి, బ్యాంకు రుణాలు తెచ్చుకొని, రూపాయి పెట్టుబడి లేకుండా, అప్పార్టుమెంట్లు కడుతున్నారు. అమ్ముతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నారు. వాటిని సిఎం. రేవంత్‌ రెడ్డి అరికడతామన్నారు. చూద్దాం..ఇటు వైపు చూస్తారా..లేదా? అన్నది తేలాల్సివుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version