మందమర్రి, నేటిధాత్రి:-
మందమర్రి పట్టణానికి చెందిన
మట్టె రవీందర్ కు అరుదైన గౌరవం దక్కింది. తాను రాసిన మౌనం వీడనా అనే కవితకు గుర్రం జాషువా సాహిత్య జీవన సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాద్ లోని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీనటుడు, కమెడీయన్ డాక్టర్ ఎస్ సుదర్శన్ ఆదివారం సాయంత్రం అవార్డును ప్రదానం చేశారు. విశ్వకవి గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని కవులు, కళాకారులు, రచయితలతో పాటు సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశామని సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ సరోజనమ్మ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అవార్డు గ్రహీతలను శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మకమైన జాషువా సాహిత్య జీవన సాఫల్య పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందని, తాను రాసిన మౌనం వీడనా అనే కవితకు ఈ పురస్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు బస్టాప్ కోటేశ్వరరావు, సహాయ నటి పద్మ, హీరోయిన్ ఫైజా జాన్, యాంకర్ రజిని, అసిస్టెంట్ సినీ నిర్మాత కపిల్, డైరెక్టర్ గుర్రపు విజయ్, ప్రముఖ రచయిత కావాడి మల్లయ్య, వివిధ జిల్లాల నుండి వచ్చిన అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.