శతక్కొట్టిన మంధాన.

శతక్కొట్టిన మంధాన…

 

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) తన టీ20 కెరీర్‌లో

తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం

51 బంతుల్లోనే సెంచరీ

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీతో అదరగొట్టింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపిన స్మృతి ఆఖరి ఓవర్‌లో వెనుదిరగగా, హర్లీన్‌ డియోల్‌ (23 బంతుల్లో 7 ఫోర్లతో 43) అద్భుత సహకారం అందించింది. ఇక, తెలుగమ్మాయి, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటుతూ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. ఫలితంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 97 రన్స్‌తో ఘన విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌కిదే అతిపెద్ద ఓటమి. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో పైచేయి సాధించింది. రెండో మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. లారెన్‌ బెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన యువ స్పిన్నర్‌ శ్రీచరణి (3.5-0-12-4) అద్భుత గణాంకాలు నమోదు చేయడంతో ఇంగ్లండ్‌ 14.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ సివర్‌ బ్రంట్‌ (42 బంతుల్లో 10 ఫోర్లతో 66) మినహా ఎవరూ రాణించలేదు. రాధా యాదవ్‌, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మంధాన నిలిచింది. వామప్‌ మ్యాచ్‌లో తలకు గాయం కావడంతో ముందు జాగ్రత్తగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినిచ్చారు.మంధాన, హర్లీన్‌ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ మంధాన, వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరును అందించారు. అయితే చివర్లో పుంజుకున్న ఇంగ్లండ్‌ బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగారు. ఆరంభంలో మరో ఓపెనర్‌ షఫాలీ (20) తడబడినా.. మంధాన సహజశైలిలో బ్యాట్‌ ఝుళిపించింది. మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడేస్తూ చకచకా స్కోరును పెంచింది. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు అందించింది. ఆ తర్వాత హర్లీన్‌ రాకతో భారత్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. పదో ఓవర్‌లో ఆమె మూడు ఫోర్లు సాధించింది. అలాగే మంధాన సిక్సర్‌తో స్కోరు 11వ ఓవర్‌లోనే వందకి చేరింది. అయితే హర్లీన్‌ 26 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వ్యాట్‌ హాడ్జ్‌ వదిలేసింది. అటు అవలీలగా బౌండరీలు బాదేసిన మంధాన 51 బంతుల్లోనే టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకుంది. 16వ ఓవర్‌లో హర్లీన్‌ను పేసర్‌ లారెన్‌ బెల్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 94 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం భారత్‌ వేగంగా వికెట్లను కోల్పోయింది. రిచా (12), జెమీమా (0) 18వ ఓవర్‌లో వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫోర్‌తో స్కోరును 200కి చేర్చిన స్మృతి మంధాన ఆ వెంటనే అవుటైంది. మొత్తంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 26 పరుగులే సాధించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version