రంగంలోకి కేసిఆర్‌.

https://epaper.netidhatri.com/

`హుస్నాబాద్‌ తో ఎన్నికల ప్రచారం షురూ…

`కొత్త పథకాలపై సర్వత్రా ఆసక్తి.

`కేసిఆర్‌ సభలంటే మామూలుగా వుండదు.

`ఉద్యమ కాలం నుంచి కొన్ని వందల సభలు.

`గత ఏడాది కొంగరకలాన్‌ తర్వాత మొదటి సభ హుస్నాబాద్‌ లోనే.

`సభ నిర్వహణ అంతా హరీష్‌ రావుదే.

`అభివృద్ధి, సంక్షేమమే అసలైన ఎజెండా!

`చేసిన పనులే ప్రచారాస్ర్రాలు.

` అన్నపూర్ణ తెలంగాణే కళ్లముందు కనిపిస్తోంది.

`రైతు సంక్షేమంలో నెంబర్‌ వన్‌.

`మహిళా సాధికారతలో ఆదర్శం.

`అన్ని రంగాలలో అభివృద్ధి.

`ప్రతి వ్యవస్థ లోనూ ప్రగతి.

`తెలంగాణ అంటేనే వెలుగుల జగతి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల శంఖారావం పూరించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు. గత ఎన్నికలలో మొదటి సభ హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం. నామినేషన్ల వేసే సమయంలో సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. అలా కొన్ని కొన్ని బలంగా నమ్మే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇక ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టనున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. గత నెల రోజులుగా వాళ్లు ప్రజల్లో తిరుగుతూనే వున్నారు. ఊరూరు వెళ్లి ప్రచారం చేసుకుంటూనే వున్నారు. వారికి తోడుగా అటు కేటిఆర్‌, ఇటు హరీష్‌రావులు కూడా గత కొంత కాలంగా అనేక సభల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల తరుపున ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎన్నికల ప్రచారం ముగిసినట్లే అని చెప్పొచు. ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్ధుల ఎంపికలోనే తలమునకలై వున్నారు. ప్రతిపక్షలు సీట్లు పంచుకునే లోపు బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు స్వీట్లు పంచుకునే సమయం వస్తుందన్న జోష్‌లో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలున్నారు. ఇక ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రారంభంతో పార్టీలో మరింత జోష్‌ నిండుతుంది. కాంగ్రెస్‌ పార్టీ, బిజేపిలు చెబుతున్నమాటలు, వారి వెనుకున్న కుట్రలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజలకు అర్ధమయ్యే యాసలో చెబితే ఇక ఆ పార్టీల సంగతి అంతే సంగతులు అని చెప్పకతప్పదు. అంతే కాకుండా కొత్తగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి పధకాలు ప్రకటిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. కాని ప్రజలు ఇప్పటికే వున్న అనేక పధకాలతో ఎంతో సంతృప్తిగా వున్నారు. దివ్యాంగులకు చెందని పెన్షన్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆసరా పెన్షన్లు కూడా మరింత పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. అయినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో సంతృప్తికరంగా వున్నట్లే వాతావరణం కనిపిస్తోంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పిడికెడుమంది నాయకులు చేసిన హడావుడి, తప్ప ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసింది లేదు. ఇబ్బందులు ఎదుర్కొనట్లు దాఖలాలు లేవు. రోడ్లెక్కి ఉద్యమాలు చేయలేదు. ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్బాలు కూడా లేవు. కారణం తెలంగాణ తొమ్మిదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. అందుకే ప్రతిపక్ష నాయకుల్లో కనిపిస్తున్న అసహనం ప్రజల్లో ఎక్కడా లేదు. తెలంగాణ రైతులంతా కేసిఆర్‌ పాలనను పొగుడుతున్న వాళ్లే కాని, తెగిడిన రైతు ఒక్కరు కూడా లేదు. ఇదీ ఒక నాయకుడి పాలనా ప్రతిభకు నిదర్శనం. ఈ తొమ్మిదేళ్లలో మాకు ఇది అందలేదు. అన్న రైతు లేడు. రైతు ఊహించకముందే తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. సాగుకు అవసరమైన కరంటు అంతా ఉచితంగా . ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు. రైతులు ఆ ఆనందం నుంచి తేరుకునేలోపే చెరువులున్నీ నింపేశారు. రైతులు తమ పొలాలు తడుపుకుంటుంటేనే కాళేశ్వరం పూర్తి చేశారు. ఎప్పుడో ఎండిపోయిన మోడువారిన చెరువు కళకళలాడిరది. ఒట్టిపోయిన బావులన్నీ నీళ్లతో నిండాయి. బోర్లు ఎల్లబోశాయి. ఇదంతా కలా నిజమా? అనుకునేలోపు రైతు బంధు ఇచ్చాడు. పెట్టుబడి సాయం సాగుబాటుకు ముందే అందించారు. ఇలా రెండు పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. ఇంకేముంది రైతుకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందనుకునే సరికి, పండిన పంట కూడా తామే కొంటామని కళ్లాల దగ్గరే కాంటలుపెట్టారు. మార్కెట్‌కు తరలించే కష్టం తొలగించాడు. కూర్చున్న చోటకే రైతుకు ఆదాయం అందించారు. ఇదీ కేసిఆర్‌ దార్శనికతకు నిదర్శనం. ఇలాంటి నాయకుడు దేశం మొత్తంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరకొరు లేరు.
ఇక తెలంగాణలోని కుటుంబాలన్నీంటికి పెద్దన్నయ్యాడు. పెద్దకొడుకుగా కీర్తింపబడుతున్నారు.
ఒకప్పుడు వయసు మళ్లిన వారికి పెన్షన్‌ అంటే ఎంత పెద్ద తతంగమో తెలియంది కాదు. ఆ తర్వాత కొంత కాలానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఇచ్చి అదే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆసరా పెన్షన్లు వెయ్యి, రెండువేలు, మూడు వేలు ఇలా పెంచుకుంటూ పోయారు. వయసు మళ్లీన వారి జీవితాలను గౌరవం తెచ్చారు. వారి ఆకలి తీర్చుతున్నారు. కుటుంబాలలో వారికి మరింత గౌరవం దక్కెలా చేశారు. ఒకప్పుడు వయసు మళ్లిన తల్లిదండ్రులను కొడుకులు చూసుకోవడానికి పంపకాలు చేసుకునేవారు. తండ్రి ఓ కొడుకు ఒక దగ్గర, తల్లి ఓ కొడుకు దగ్గర వుండాల్సివచ్చేది. ఎప్పుడైతే వారికి పెన్షన్‌ వస్తుందో అప్పటినుంచి వాళ్లను పిల్లలు కూడా సంతోషంగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్లంతా కేసిఆర్‌ను పెద్దకొడుకుగా భావించుకుంటున్నారు. మనసుల్లో దేవుడిగా కొలుసుకుంటున్నారు. అంతే కాకుండా కుల వృత్తులకు చెందిన వారికి కూడా నెల నెల పెన్షన్‌ ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందిస్తున్నారు. బీడి కార్మికులకు కూడా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇక ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే పేదంటికి ఎంత భారమో తెలియంది కాదు. కేసిఆర్‌ ఒకనాడు చూసి చలించిన సందర్భాన్ని గుర్తు చేసుకొని తెలంగాణ వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మి పధకం తెచ్చారు. పేదింటి ఆడపిల్లకు మేనమామై పెండ్లిచేస్తున్నాడు.
తెలంగాణలో కుల వృత్తులు అంతరించి పోయి, గ్రామీణ జీవనం అస్తవ్యస్తమైంది. అటు సాగు లేక, ఇటు కుల వృత్తులు చేసుకోలేక, ప్రజలు అల్లాడిన పరిస్ధితి ఎదురైంది.
తెలంగాణ రాగానే కుల వృత్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. పాడి కావాలనుకున్న రైతులకు గేదెలను అందించారు. కురుమ, యాదవ కులాల సోదరులకు పెద్దఎత్తున గొర్రెల యూనిట్లు పంపిణీచేశారు. గీత కార్మికుల కోసం పెద్దఎత్తున చెరువు గట్లపై చెట్ల పెంపకంచేపట్టారు. కళ్లు దుకాణాలకు అనుమతులిచ్చారు. నీరా అమ్మకాలను పెంచారు. గీత కార్మికులకు పెన్షన్‌ అందజేస్తున్నారు. ఇక ముదిరాజ్‌సోదరులు ఒకప్పుడు చెరువు, అడవుల మీద ఆధారపడి జీవించేవారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువుల ద్వంసం జరిగింది. అడువులు లేకుండాపోయాయి. తెలంగాణవచ్చిన తర్వాత పెద్దఎత్తున చెట్ల పెంపకం చేపట్టారు. చెరువులను మరమ్మత్తులుచేశారు. తెలంగాణలోని 46వేల చెరువుల్లో ప్రభుత్వం చేపలను పెంచుతోంది. ముదిరాజ్‌ సోదరులకు ఉపాది మార్గం చూపించింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు చేపలు ఆంధ్ర ప్రదేశ్‌నుంచి వచ్చేవి. ఇప్పుడు చెరువు చేపలు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి పంపబడుతోంది. ఇలా కుల వృత్తులను కూడా నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కింది.
మన దేశ సమాజంలో అట్టడుగు వర్గాలుగా పరిగణింపబడుతున్న ఎస్సీ, ఎస్సీలు ఆర్ధికపరమైన ఇబ్బందులతో జీవితాలు గడుపుతున్నారు.
వారిలో కూడా మిగతా సమాజంతో సమానంగా ఆర్ధిక వృద్ది, పురోగతి కల్పించాలని ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విదంగా దళిత బందు, గిరిజన బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచి, వారిని ఆర్ధికంగా నిలబెట్టిన ఏకైక నాయకుడు, పాలకుడు కేసిఆర్‌. అందుకే కేసిఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. అని ప్రజలు అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారంలో ఇదే విషయం చెప్పి ప్రజలు దీవెనలు అందిస్తున్నారు. మళ్లీ సారే రావాలి. కారే గెలవాలని ఆశీర్వదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *