`అదాని ఒప్పందంపై తొందరపాటు తగదు
`రాజకీయం వేరు, ప్రజా ప్రయోజనం వేరు
`చంద్రబాబు తప్పులు ప్రత్యర్థులకే లాభం
`కక్షసాధింపులు మాని ప్రజాసేవపై మరింత దృష్టిపెట్టాలి
`అధికారం శాశ్వతం కాదు
`ఇవ్వాళ మనం చేసేది, రేపు రెట్టింపు ఇబ్బందులు పెట్టవచ్చు
`ప్రచారం కంటే పని ముఖ్యం
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒడిషా, తమిళనాడు, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముాకశ్మీర్ రాష్ట్రాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులకాంట్రాక్టులకోసం గౌతమ్ ఆదాని మరో ఏడుగురు కొందరు అధికార్లకు రూ.265 మిలియన్ డాలర్లు లంచంగా చెల్లించేందుకు అంగీకరించారంటూ, యు.ఎస్.కు చెందిన సెక్యూరిటీస్ ఎ క్స్చేంజ్ కమిషన్ ఆరోపించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ అధికార్లకు రూ.228 మిలియన్ డాలర్లు ఆదానీ గ్రూపు చెల్లించిందనేది యుఎస్ అధి కార్ల ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కంపెనీలు ఈ విద్యుత్ను కొనుగోలు చేయడానికి ఈ లంచాలు ముట్టజెప్పారని వారు పేర్కొనడంతో, ఆదానీ గ్రూపుతో నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. దీని ప్రకారం ఏడు గిగావాట్ల విద్యుత్ను ఆదానీగ్రూపు సరఫరా చేయాల్సివుంటుంది. ఇంత పెద్దమొత్తంలో విద్యుత్ సరఫరా ఒప్పందం మరే ఇతర రాష్ట్రంతో కుదరకపోవడం గమనార్హం. అమెరికా చేసిన ఆరోపణలతో ఒక్క సారిగా ఆదానీ గ్రూపు షేర్లు పడిపోయాయి. అయితే తమపై వచ్చిన ఆరోపణలను కంపెనీ తీవ్రంగా ఖండిరచడమే కాకుండా, సెక్యూరిటీలపై మాత్రమే ఆరోపణలున్నాయని, అమెరికా న్యాయశాఖ నమోదుచేసిన కేసుల్లో అసలు వీరిపేర్లు లేవని కంపెనీ మనదేశ స్టాక్ ఎక్స్ఛేంజ్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో ఆదానీ షేర్లు కోలుకున్నాయి. సెక్యూరిటీస్పై కూడా కేవలం ఆరోపణలు మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసి ఇష్టానుసారం తమపై ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. అమెరికాలో ఎవరో ఆరోపణలు చేస్తే మనదేశంలో తుపానుమాదిరిగా వ్యాపించడం ఒక కంపెనీ లేదా వ్యక్తి విశ్వసనీయతను దెబ్బతీసేవిధంగా పుంఖానుపుంఖాలుగా రాయడం ఒక అలవాటుగా మారిపోవడం దురదృష్టం.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వై.ఎస్.ఆర్.సి.పి.ని నామరూపాలు లేకుండా చేయాలన్న అ కుంఠిత దీక్షతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆదానీ అస్త్రం చేతికి చిక్కింది. లడ్డూ విష యంలో రాజకీయం చేయబోయి తలబప్పి కట్టి తెలుగుదేశం అధినేత ఇప్పుడు, ఆదానీతో ఒప్పందాన్ని తిరగదోడతామంటున్నారు. ఆరోపణలు రుజువై, కంపెనీ తప్పిదం బయటపడితే అ ప్పుడు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. అదీకాకుండా ఒప్పందంలో లాభనష్టాలు, జరిగిన మేలు వంటివి పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి తప్ప, కేవలం జగన్ ఒప్పందం కుదు ర్చుకున్నాడన్న కక్షతో అమెరికాలో ఎవరో ఆరోపణలు చేసారన్న నెపంతో దీనిపై చర్యలు తీసుకునేముందు వెనకాముందూ ఆలోచించుకోవడం ఏపీ ప్రభుత్వానికి చాలా అవసరం.
బూమరాంగ్ అవుగున్న రాజకీయ ఎత్తులు
గతంలో లడ్డూమీద రాజకీయం చేయడం బూమరాంగ్ అవడమే కాకుండా, పవన్ కళ్యాణ్కు నేడు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడానికి దారితీసింది. అదేవిధంగా ఓటమితో నైరా శ్యంలో కుంగిపోయిన జగన్ను ఇటువంటి చర్యలతో చంద్రబాబు బలోపేతం చేస్తున్నారు. అంటేఆయన జగన్ను దెబ్బతీయాలనుకొని ఒక పనిచేస్తే పూర్తిగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది.అధికారంలో వున్నప్పుడు లేదా మరెప్పుడైనా జగన్ పెద్దగా ప్రెస్మీట్లు పెట్టరు. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు, తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతం నేపథ్యంలో ఆయన తన కోణాన్ని ఆవిష్కరించడానికి తరచుగా మీడియా సమావేశాలు పెట్టి వివరిస్తున్నారు. ఆదానీ విషయంలో కూడా ఆయన ఇస్తున్న గణాంక వివరణలు ఆసక్తికరంగా వుంటున్నాయి. ‘‘చంద్రబా బు హయాంలో యూనిట్కు రూ.3.41కి కొనుగోలు చేయాల్సి రాగా, 2021 సెప్టెంబర్ 15న సెకీ కేవలం యూనిట్కు రూ.2.49లకే 9వేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేస్తామని చెప్పింది. అదే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రూ.2వేల కోట్లు అదనపు భారంపడిరది. ఇంత తక్కువ ఖరీదుకు విద్యుత్ సరఫరా ఎప్పుడూ జరగలేదు. దీనిపై వక్రీకరణలేంటి?’’ అని వేస్తున్న ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వడంలేదు. ఆదానీ ఒప్పందం రాష్ట్రానికి నష్టం అని మా త్రమే ఊకదంపుడు వార్తలు వస్తున్నాయి. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై రూ.వంద కోట్ల పరువునష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరిస్తున్నారు.
ప్రజాప్రయోజనాలపై రాజీవద్దు
రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం, వ్యతిరేకించడం సహజం. కానీ ప్రజలకు ఉపయోగపడే అంశాలు, వారి ప్రయోజనాలకు సంబంధించిన విషయాలో ఎవరు అధికారంలో వున్నా సంయమనం పాటించడం చాలా అవసరం. ఆదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇష్టారాజ్యంగా మీడియాలో వచ్చిన వార్తలవల్ల నష్టపోయింది షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన సామాన్యులు. అదేవిధంగా జగన్ వాదన ప్రకారం రాష్ట్రానికి ఆదానీపవర్తో కుదుర్చుకున్న ఒ ప్పందం వల్ల లాభమే కాని నష్టం జరగలేదు కదా! దీనిపై ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ గత ప్రభుత్వం తప్పుచేసిందని తేలితే చర్యలు తీసుకోవచ్చు. అనవసర ప్రచారాలు అనర్థహేతువులు. ఎందుకంటే గతంలో కూడా ఆదానీని దెబ్బతీయడానికి డీప్స్టేట్ ప్రయత్నించి చేతులు కాల్చుకున్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
జగన్ను యాక్టివ్ చేస్తున్న బాబు
నిజం చెప్పాలంటే నిస్తేజంగా వున్న జగన్ను మరింత చురుగ్గా, ప్రజల్లోకి వచ్చేవిధంగా చేస్తున్న ది తెలుగుదేశం ప్రభుత్వమే. రాజకీయ కక్షలతో జగన్ అనుకూలురు అనుకున్న వారిని ఎవ్వరినీవదిలిపెట్టడంలేదు. వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇవన్నీ కాలం చెల్లిన విధానాలు. ఎందుకంటే ఎంత ఓటమి పాలైన జగన్ పార్టీకి 40శాతం ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదన్నది అక్షరసత్యం. ఏమాత్రం లెక్కతప్పినా జగన్ మళ్లీ తన స్థానాన్ని పదిలం చేసుకోగలడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కావలసింది, ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలు లేదా అనుకూల ప్రచారం కాదు, తాము ప్రజలకు మేలు చేయడానికి నిబద్ధతతో పనిచేస్తున్నామని నమ్మకం కలిగించడం. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు అటువంటిది లేకపోగా కక్షసాధింపు అనే సుడిగుండంలో చంద్రబాబు చిక్కుకున్నారు.
ఆసరాగా మారిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం అధినేత బహుశా గుర్తించారో లేదో తెలియదు కానీ, రాజకీయ అవసరాల నేపథ్యంలో దగ్గరకు తీసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశరాజకీయాలు నడిపే స్థాయికి చేరుకున్నారు. ఇందులో చంద్రబాబు పాత్రకూడా లేకపోలేదు. రానున్న కాలంలో జనసేన అధినేత తాను చెప్పిన విధంగా కాకుండా, ఆయన చెప్పినవిధంగా తాను నడుచుకునే పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. లడ్డూ వివాదంలో సనాతనధర్మం వైపు నిలిచిన పవన్కళ్యాణ్ ఇప్పుడు మహారా ష్ట్రలో తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించి ఒక్కసారి ‘నేషనల్ స్టార్’గా ఎదిగిపోయారు. గతంలో ఉన్న ఆవేశం ఇప్పుడు ఆయనలో కనిపించడంలేదు. మీడియా స మావేశాల్లో కూడా ఆయన ఇచ్చే సమాధానాలు ఎంతో పరిణితితో వుంటున్నాయి. చంద్రబాబు రాజకీయం, జగన్ను మరింత తొక్కేయాలన్న రీతిలో సాగుతుంటే, పవన్ రాజకీయ ప్రస్థానం పౖెెపైకి దూసుకెళుతోంది. ఇప్పుడు బి.జె.పి. పెద్దలకు ఆంధ్రలో ఒక నాయకుడు దొరికాడు. సరైన శిక్షణతో పవన్ను ముందుకు నిలబెడుతున్నారు. దీన్ని గుర్తించినా చంద్రబాబు చేసేదేం లేదు. పవన్ ఇప్పుడు తాజాగా ఢల్లీిలో ఆరుగురు మంత్రులను కలిసి ప్రజాసమస్యలపైనే మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన వార్తలు తెలుపుతున్నాయి. తన అన్న నాగబాబుకు రాజ్యసభ టిక్కెట్ కావాలని అడిగినట్టు ఎక్కడా బయటపడలేదు. ఢల్లీి పెద్దలు పిలిచారు కాబట్టి, పవన్కళ్యాణ్కు ఈ ప్రస్తావన తెచ్చే అవకాశం దొరికి వుండవచ్చు లేదా లేకపోవచ్చు. మీడియాలో రకరకాల వార్తలు రావడం సహజం. ఒక్కసీటు వచ్చినందువల్ల ఒరిగేది కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పద వికి తనను తాను ఒక గట్టి పోటీదారుగా నిరూపించుకోవడం పవన్కళ్యాణ్కు అత్యంత ముఖ్యం. తగిన అనుభవం సంపాదించుకోవాలన్న ఆయన అభిప్రాయం పరిణితిని చూపుతోంది. రాజకీయాల్లో దూసుకుపోయేవారి వ్యవహారశైలి ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రజాదరణ వున్న నాయకుడికి ప్రత్యర్థితో పనిలేదు. ఎట్లా అంటే…బలవంతుడితో పోరాడవచ్చు కానీ అదృష్టవంతుడితో కష్టం. అదేవిధంగా రాజకీయాల్లో ప్రజాభిమానం కలిగిన వారితో పోరాటం కష్టం. గుంట చిక్కుల రాజకీయాలు అక్కడ పనికిరావు. అయితే ఇక్కడ ప్రజాభిమానం ఒక్కటే కాదు, రాజకీయంకూడా తెలియాలి. లేకపోతే నష్టపోక తప్పదు. ఇందుకు ఉదాహరణ ఎన్టీఆర్. అందుకు తగిన రాజకీయ శిక్షణ బీజేపీ పెద్దలు పవన్కు ఎట్లాగూ ఇస్తారు…ఇస్తున్నారు కూడా. దన్నుగా నిలుస్తు న్నారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండలేకుండా చంద్రబాబు పాలన కష్టమే. ఢల్లీి పెద్దలు చంద్రబాబును విశ్వసించరు. కేవలం పవన్ కళ్యాణ్ ద్వారానే పనులు చక్కబెడతారు. ఇప్పుడు బాబు రాజకీయానికి పవన్ కళ్యాణ్ ఒక ‘ఆసరా కర్ర’గా మారారు. దీన్ని గుర్తించి చంద్రబాబు ఇప్పటికైనా ప్రచారం వదిలేసి పనులపై దృష్టిపెట్టాలి. ఇదే ఆయనకు, ఆయన పార్టీకి శ్రేయస్క రం. లేకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జగన్, పవన్కళ్యాణ్ మధ్యమాత్రమే ప్రధాన రాజకీ యం నడవడం తథ్యం.