ఫుట్ పాత్ ఆక్రమణలపై ‘ ఉక్కుపాదం’.. గచ్చిబౌలిలో ఆక్రమణల తొలగింపు
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
ఫుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడి పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకటరమణ హెచ్చరించారు. శనివారం శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి టెలికం నగర్ నుండి ఉర్దూ యూనివర్సిటీ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.
టౌన్ ప్లానింగ్ సెక్షన్ టీపీఎస్ సాయి తేజ పర్యవేక్షణలో సిబ్బంది ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో పాదచారుల నడక దారులను ఆక్రమిస్తే సహించేది లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి శనివారం ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైన్మెన్లు మోహన్, మహారాజ మరియు ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
