మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ…

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ

 

బాల్యం :
పల్లె పరిమళంలో పుట్టిన వ్యక్తిత్వం
మట్టివాసనలో మమకారం కలిసిన ఆ పల్లె గాలి…
అక్కడే మంజుల పత్తిపాటి అనే ఒక సున్నిత హృదయం రూపుదిద్దుకుంది.ఆలేరు పల్లె గాలిలో, మట్టి పరిమళంలో పెరిగిన ఆ చిన్నారి… పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా చదివింది.
రాధ–నర్సింహారావు దంపతులకు మూడవ సంతానంగా జన్మించిన ఆమెకు, తండ్రి ఉపాధ్యాయ వృత్తి కేవలం జీవనోపాధి కాదు—అది విలువల బాట.
1974లో ఆలేరు నేలపై పుట్టిన ఆ చిన్నారి, పుస్తకాల మధ్య మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో కూడా పెరిగింది. అల్లారుముద్దుగా పెరిగినా, ఆ పల్లె జీవితం ఆమెకు మానవత్వాన్ని నేర్పింది.
టైపింగ్ హయ్యర్, లోయర్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం—ఆమె పట్టుదలకి నిదర్శనం.
తన చిన్ననాటి జ్ఞాపకాలను “పల్లెటూరి జ్ఞాపకాలు”గా పదాల్లో నింపినప్పుడు—ఆమె హృదయం కవిత్వంగా పలికింది.

వివాహం :

బాధ్యతల బాటలో బలమైన అడుగులు
చిన్న వయస్సులోనే వివాహం…
జీవితం ఒక్కసారిగా బాల్యాన్ని వెనక్కి నెట్టేసి బాధ్యతల వైపు నడిపింది.
బావి నీళ్ళ బరువు కేవలం భుజాలపై కాదు—జీవితంపై పడింది.
బిందెలు మోసిన చేతులు, కట్టెల పొయ్యిపై వండిన వేళ్లు—కష్టాల్ని కరిగించి బలంగా మారాయి తర్వాత కలం పట్టి సమాజాన్ని మేల్కొలిపాయి.
ప్రతి కష్టం ఆమెను కూల్చలేదు—మరింత గట్టి చేసింది. ఆ కష్టాల్లో ఆమె చిరునవ్వు చచ్చిపోలేదు…
అదే ఆమె అంతర్ముఖ బలానికి నిదర్శనం.

MPDO కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేసి, తరువాత ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ—
ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా తన పాత్రలను సమర్థంగా నెరవేర్చింది.

రాజకీయ ప్రస్థానం:
ప్రజల మధ్య పుట్టిన నాయకత్వం
స్వార్థం లేని సేవాభావం—అదే ఆమెకు అసలైన గుర్తింపు.స్వల్ప వేతనంలోనూ అవసరమైన వారికి చేయూతనిచ్చిన ఆ మనసు, రాజకీయాలకు మార్గం చూపింది.అందరిలో కలసి పోయే, అందరి కష్టాల్లో
పాలుపంచుకునే తత్వాన్ని గ్రహించిన వారి జీవిత భాగస్వామి మంజుల పత్తిపాటిని తొలిసారిగా
రాజకీయ- రంగప్రవేశం చేయించారు. మండల కేంద్రంలోని మన్నెవారి తుర్కపల్లి నుండి BRS పార్టీ తరుపున 2018 లో MPTCగా పోటీ చేసి రెండు ఓట్ల తేడాతో ఓడినా—ఆమె సంకల్పం మాత్రం ఓడిపోలేదు. BRS పార్టీ మండల అధ్యక్షురాలిగా, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ప్రజల సమస్యలను తనవిగా భావించింది. రైతుల కష్టాలపై స్పందిస్తూ, రైతు సమస్యలపై గళమెత్తుతూ మార్కెట్ వ్యవసాయ కమిటీలో సేవలు అందించారు.  రైతులకు  గోనె సంచులు అందుబాటులో ఉంచుతు
లారీల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు.
రైతులకు సేవ చేస్తూ కరోన సమయంలో నిత్యావసర సరుకులు ప్రజలకు అందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆమె నాయకత్వం కేవలం పదవి కాదు, బాధ్యతగా మార్చుకొన్నది.
సామాజిక సేవ చేస్తూ వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత సాహిత్య రచనల పట్ల ఆమె ఆసక్తి కనపరచినారు. అందుకు ఇంకో కారణం ఆమె పడిన కష్టాలు కూడా.
రాజకీయ ప్రయాణంలో ఊరు ఊరు తిరుగుతున్నఅప్పుడు ప్రత్యక్షంగా ప్రజల సాధక బాధలు తెలుసుకొని స్పందించి అధికారులకు తెలియచేసి సమస్య పరిష్కారం చేసేది

అక్షరయాత్ర;
హృదయం పలికిన కవిత్వం
జీవితాన్ని దగ్గరగా చూసిన కళ్లకు…
బాధను అనుభవించిన హృదయానికి…
కవిత్వం ఒక సహజ స్పందన.
మంజుల గారి కలం—కేవలం అక్షరాలు కాదు, అనుభవాల ప్రవాహం. ఆమె జీవితానుభవాలే ఆమె కలానికి మసి అయ్యాయి. మూడు వందలకు పైన కవితలు రాసింది. రైతుల కష్టం, మహిళల వేదన, బాల్యపు జ్ఞాపకాలు, ప్రకృతి పరిరక్షణ…
ప్రతి అంశం ఆమె కవితల్లో జీవిస్తుంది.
రైతుల కష్టాలు, మహిళల అగచాట్లు,బాలకార్మిక వ్యవస్థ గురించి, పండుగలకు పకృతికి గల సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ గురించి, బాల్య స్మృతులు, ఓటు హక్కు విలువ,
కళాకారుల కష్టాలు, స్త్రీ హృదయం, సాంఘిక అంశాలపై మరియు కళాకారులు దేవుని రూపాలు, అమ్మ హృదయం, శ్రీ సీతారామ దివ్య చరితం, చివరి దుప్పటి వంటి వంటి రచనలు—
ఆమె అంతరంగ గాథలకు ప్రతిబింబాలు.
పత్రికలు, ఆన్‌లైన్ వేదికలు—అన్నింటిలో ఆమె కవిత్వం పాఠకుల హృదయాలను తాకుతోంది.

ముగింపు:
మట్టిలో మొలిచిన మానవత్వం, పద్యంగా వికసించింది
మట్టిలో పుట్టి…
కష్టాల్లో కరిగి…
సేవలో వెలిగిన ఒక జీవితం—మంజుల పత్తిపాటి.
ఆమె కలం కేవలం రాయదు…
మనసులను మేల్కొలుపుతుంది.
బాధను పలుకుతుంది.
ప్రకృతిని కాపాడమని పిలుస్తుంది.
మట్టివాసనలో మొలిచిన ఆ మానవత్వం…
ఈరోజు కవిత్వంగా వికసించి,
సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version