కల్తీ ఇంధనమే కూల్చిందా…

కల్తీ ఇంధనమే కూల్చిందా?

 

 

 

 

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.

  • తప్పు ఎక్కడ జరిగిందని వైమానిక నిపుణుల విశ్లేషణలు

న్యూఢిల్లీ/చెన్నై, జూన్‌ 14: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ సాలిగ్రామ్‌ జే మురళీధర్‌ తాజాగా ఓ వార్తా సంస్థ తో మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్షి ఢీకొంటే రెండు ఇంజన్లు ఒకేసారి విఫలంకావడానికి అవకాశం ఉందన్న వాదనను తోసిపుచ్చారు. ‘పక్షి ఢీకొంటే విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగి నిప్పురవ్వలు, పొగ వస్తాయి. రెండు ఇంజన్లను పక్షులు ఒకేసారి ఢీకొనే అవకాశం ఉండదు. విమాన ప్రమాదానికి ఇంధన కల్తీనే ప్రధాన కారణంకావచ్చు. ఇంధనం కల్తీ అయితే రెండు ఇంజన్లపైనా ఒకే ప్రభావం పడుతుంది. దీనివల్ల వేగం తగ్గిపోయి విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభించదు. 35టన్నుల కంటే అధికంగా ఇంధనం ఉన్నందున విమానం కూలిపోయిన క్షణాల్లోనే భారీ విస్ఫోటనంతో అగ్నిగోళం ఏర్పడింది’ అని మురళీధర్‌ వివరించారు. ఈ ఘోరానికి గల కారణాలపై నిపుణుల నుంచి సీనియర్‌ పైలట్ల వరకూ విభిన్న ఊహాగానాలు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం విమాన ప్రమాదానికి కారణాలు ఇవీ..

ఒక ఇంజన్‌ వైఫల్యం, ల్యాండింగ్‌ గేర్‌ మూసుకోకపోవడం..

విమానం టేకాఫ్‌ అయిన వెంటనే పక్షులు ఢీకొనడం లేదా అంతర్గత సమస్యలతో ఒక ఇంజన్‌ విఫలమై ఉంటుంది. బోయింగ్‌లోని అత్యాధునిక శ్రేణి విమానాల్లో రెండు శక్తిమంతమైన ఇంజన్లు ఉంటాయి. వీటిలో ఒకటి విఫలమైనా రెండోదాని సాయంతో విమానం పైకి ఎగురుతుంది. విమానం టేకాఫ్‌ అయ్యాక ల్యాండింగ్‌ గేర్‌ మూసుకుంటే విమానం పైకి ఎగరడానికి సాయపడే ఏరోడైనమిక్‌ ప్రవాహం ఏర్పడుతుంది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న సమయాల్లో పైలట్లు ల్యాండింగ్‌ గేర్‌ను పైకి ఎత్తడం మర్చిపోయే అవకాశమూ ఉంది. ఒక ఇంజన్‌ విఫలం కావడానికి తోడు గేర్‌ను కిందకు వదిలేయడం వల్ల విమానం ఎత్తుకు ఎగిరే సామర్థ్యం కోల్పోతుంది. భూమికి 300-400 అడుగుల ఎత్తున ఇలాంటి పరిస్థితి ఎదురైతే దాని నుంచి బయటపడటానికి పైలట్‌కు ఎక్కువ సమయం లభించదు.

రెండు ఇంజన్లు విఫలం కావడం..

ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. పక్షులు ఢీకొనడం, ఇంధనం కల్తీతోపాటు సాధారణ తనిఖీల్లో గుర్తించని యాంత్రిక లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తడాన్ని తోసిపుచ్చలేం. ఈ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ను ఎత్తడానికి, గాలి వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన థ్రస్ట్‌ (ఎగరడానికి అవసరమైన వేగం) ఉండదు. ఈ కారణంగా విమానం క్షణాల్లోనే వేగాన్ని కోల్పోవడంతో పాటు అది ఎగురుతున్న ఎత్తు నుంచి శరవేగంగా కింద కు పడిపోవడం ప్రారంభమవుతుంది.

ఫ్లాప్‌ కాన్ఫిగరేషన్‌లో సమస్య..

సురక్షితమైన ఎత్తుకు చేరే వరకూ రెండు ఫ్లాప్‌లు (రెక్కల వెనుక భాగం) విచ్చుకొని ఉంటేనే విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఒకవేళ వీటిని ముం దుగానే మూసేస్తే ఆ శక్తి కూడా గణనీయంగా తగ్గిపోతుం ది. ప్రమాదం జరిగిన సమయంలో అహ్మదాబాద్‌లో గాలి సాంద్రత తక్కువగా ఉంది. విమానం గేర్‌ తెరుచుకొని ఉం డగానే ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. దీంతో పైకెగరడానికి కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది.

సెన్సార్లలో లోపాలు..

ఆధునిక విమానాలన్నీ ఆటోమేటెడ్‌ వ్యవస్థలపై ఆధారపడినవే. గాలి వేగాన్ని, యాంగిల్‌ ఆఫ్‌ అటాక్‌ను గుర్తించే సెన్సార్లు విమాన కంప్యూటర్‌కు తప్పుడు డేటాను ఇస్తే ఆటో-థ్రోటిల్‌ వ్యవస్థ ఇంజన్‌ శక్తిని ముందుగానే తగ్గించే ప్రమాదం ఉంది. ఇటువంటి తప్పుడు హెచ్చరికల కారణంగా విమానం ఎగిరే ఎత్తు తగ్గిపోతుంది. అలాగే గాలివేగాన్ని కొలిచే పిటాట్‌ ట్యూబ్‌ మూసుకోపోవడం, విమాన నియంత్రణ వ్యవస్థ విఫలంకావడం వల్ల విమానం వేగం, ఎగురుతున్న కోణం విషయంలో పైలట్లు పొరబడే అవకాశం ఉంటుంది. కాగా బ్లాక్‌బాక్స్‌ డేటాను విశ్లేషించాక పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

‘బోయింగ్‌’ నివేదికను వెంటనే విడుదల చేయాలి..

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 787 విమానాలకు సంబంధించిన నిర్మాణ లోపాలపై నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రజావేగు సలే్‌హపూర్‌ తరపు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు లేఖ రాశారు. ‘బోయింగ్‌ 787, 777 విమానాల్లో తీవ్రమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని బోయింగ్‌ క్వాలిటీ ఇంజనీర్‌ అయిన సలే్‌హపూర్‌ 2024 ప్రారంభంలో ఆరోపించారు. దీనిపై 2024 మార్చిలో దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌ఏఏ ఉన్నతాధికారులు.. అదే ఏడాది డిసెంబరులో విచారణ పూర్తయిందని సమాచారం ఇచ్చారు. తమ దర్యాప్తునకు సంబంధించిన నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ నివేదిక వెలుగు చూడలేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఆ నివేదికను విడుదల చేయాలని కోరారు. దీనిపై ఎఫ్‌ఏఏ స్పందించాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version