రెండో సారి స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో సారి సంచలన తీర్పు.
`మూడోసారైన మిగతా ఎమ్మెల్యే లపై ఇలాంటి తీర్పే ఇస్తారా?

`ఎన్నికల కమీషన్ తో డీ కొంటారా?
`ఎప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు వేయాల్సిందే?
`ఆఖరు నిమిషం లో నైనా నిర్ణయం ప్రకటించాల్సిందే?
`ఇవి మధ్యంతర తీర్పులే అనుకోవాల్సిందే?
`గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించలేదు?
`అందుకే అప్పటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు?
`ఆ అవసరం కూడా అప్పటి స్పీకర్లకు రాలేదు?
`ఉమ్మడి రాష్టంలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లపై ఆఖరు దశలో చర్యలు తీసుకున్నారు?
`ఈ సారి అదే వ్యూహం అమలు చేయాలని చూస్తున్నట్టున్నారు?
`ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యే లను రాళ్లతో కొట్టండి అని సిఎం రేవంత్ చెప్పారు?
`అప్పుడు అధికారంలోకి రాలేమనే ఆలోచనతో చెప్పారా?
`అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే మాట మార్చారు?
`పది మంది ఎమ్మెల్యే లను చేర్చుకున్నారు?
`ఇప్పుడు కిటికీ లే తెరిచాను.. దార్వజ తెరిస్తే బి ఆర్ ఎస్ లో ఒక్కరు ఉండరన్నారు?
`పార్టీ మారిన ఎమ్మెల్యేలు మారినట్లు కూడా చెప్పారు?
`నిన్నటికి నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య లపై క్లీన్ చిట్ ఇచ్చారు?
`అందరు స్పీకార్లు నారాయణ రావు లా ఎందుకు లేరు?
`స్వతంత్రంగా ఎందుకు వ్యవహరించడం లేదు?
`కనీసం యనమల రామ కృషుడుకు వున్న దైర్యం ఎందుకు లేదు?
`కనీసం ఆలపాటి ధర్మారావ్ లాగా కూడా ఎందుకు లేరు?
`ఆనాడు నాయకుల దైర్యం వేరు.. ఆ విలువలు వేరు?
`ఇప్పుడు పాలక పక్షం చెప్పింది వినకుండా ఉండలేరు?
హైదరాబాద్, నేటిధాత్రి:
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాబిరామ వినుర వేమ అని చెప్పినట్టే వుంది మొత్తం కధ. ఎన్నికల ముందు ఏం చేప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎన్నికల సభల్లో ఎక్కడికెళ్లినా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని పిలుపునిచ్చారు. కాని ఎన్నికలయ్యాక, గెలిచాక ఆ మాట మర్చిపోయారు. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన సభ్యులను చేర్చుకున్నారు. గత పాలకులు చేసినప్పుడు తప్పుగా తోచి ంది. ఇప్పటి పాలకులకు ఒప్పుగా మారింది. అయ్యవారు ఉల్లిపాయ తినొద్దని చెప్పారు. అంటే తాము తినొద్దని కాదన్నట్లు వుంది. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ గూటికి చేరుతున్నామని కూడా చెప్పారు. అది కూడా నియోజక వర్గ అభివృద్ది కోసం, ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడానికే పార్టీ మారుతున్నామన్నారు. సంతోషం..కాని పార్టీ మారుతున్నట్లు అప్పుడు చెప్పినట్లు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే బి ఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తుందని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఊహించలేదు. కోర్టు తలుపు తట్టి తమను అనర్హులుగా ప్రకటించేవరకు కొట్లాడతారని అసలే అనుకోలేదు. గతంలో పార్టీ మారిన వారు ఎలా పదవులు అనుభవి ంచారో తాము కూడా అలాగే పదవుల్లో కొనసాగుతామనుకున్నారు. కాని తలనొప్పి వస్తుందని అనుకోలేదు. అంతే కాదు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నామేమో అని అసలే అనుకోలేదు. సిఎం. రేవంత్ రెడ్డి సూచనల మేరకు పార్టీలో చేరారు. ఆయన అభయంతో కండువా మార్చుకున్నారు. అయితే ఓ వైపు కేంద్రంలో ప్రదాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతుంటారు. పార్లమెంటులో పదే పదే రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మాట్లాడుతుంటారు. రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయే అంటారు. మరి తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకోవద్దని సూచించలేదు. ఏకంగా కడియం శ్రీహరి లాంటి వారికి అధిష్టానమే కండువా కప్పి మరీ పార్టీలోకి తీసుకున్నది. ఇది ద్వంద్వ విధానం కాదా? అని బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే అసలు పది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ తేల్చేశారు. తీర్పునిచ్చారు. నెల రోజులు క్రితం ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పారు. తాజాగా సంక్రాంతి రోజున ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలెయాదయ్యలు పార్టీ మారలేదని తీర్పు చెప్పేశారు. ఆ మరునాడే సుప్రింకోర్టులో కేసు వుండడంతో చివరి క్షణంలో ఈ తీర్పును గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పేశారు. అయితే కోర్టు మరోసారి స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటికే మూడు నెలలు గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరింత గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కోరడం జరిగింది. దాంతో మరో రెండు వారాలు సుప్రింకోర్టు గడువును ఇవ్వడం జరిగింది. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొని వుంది. మొత్తంగా ఇప్పటి వరకైతే ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు. కారు దిగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కు అనిపించచలేదు. ఆ మధ్య ఐదురుగు పార్టీ మారినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ ఐరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు తనకు ఎలాంటి ఆదారాలు కనిపించలేదని తేల్చేశారు. వాళ్లు బిఆర్ఎస్ పార్టీలో వున్నట్లు స్వయంగా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను రికార్డు చేయడం జరిగింది. తాము పార్టీ మారలేదని ఘంటా పధంగా వారు చెప్పారు. స్పీకర్ పూర్తిగా నమ్మారు. తన తీర్పును వెలువరించారు. తర్వాత సరిగ్గా సంక్రాంతి పండుగ నాడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పండుగ లాంటి వార్తను అందించారు. వారి రాజకీయ జీవితానికి కొత్త కాంతిని సంక్రాంతి రోజు ప్రసాదించారు. ఎక్కడా ఈ ఏడుగురు ఎమ్మెల్యే విషయంలో తనకు ఎలాంటి రుజువులు లభి ంచలేదు. పైగా పార్టీ మారినట్లు ఆరోపించి, స్పీకర్కు పిర్యాదు చేసిన వారు కూడా సూటిగా, స్పష్టంగా ఎలాంటి ఆదారాలు సమర్పించలేదు. వారు అంది ంచిన ఆదారాలలో నిజాలు కనిపించలేదు. అసలు వారు పార్టీ మారినట్లు తనకు స్పష్టత రాలేదు. అందుకే ఏడుగురు ఎమ్మెల్యేపై పిరాయింపు కేసును కొట్టేస్తున్నట్లు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గడ్డం ప్రసాద్కు వున్న విశేష అదికారాలతో ఇచ్చిన తీర్పు. ఆయన తీర్పును ఇప్పుడు ప్రశ్నించినంత మాత్రాన ఇప్పటికప్పుడు జరిగేదేమీ లేదు? ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. వారిలో మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఎంపిగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల విషయంలో తీర్పు ఎలా వుండబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నా, ఆ తీర్పు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రింకోర్టు ఆదేశాలను ప్రతిపక్షమైన బిఆర్ఎస్ సరిగ్గా అర్దం చేసుకోలేదో ఏమో కాని, ఏదో ఒక తీర్పు వెల్లడిరచాలని మాత్రమే ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ తీర్పు కూడా అందుకు అనుగుణంగానే వుంది. అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న మాట. ఎందుకంటే సుప్రింకోర్డు పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే సప్పెండ్ చేస్తారా? లేదా? అని హెచ్చరించలేదు. ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తారా? లేదా? అనేది మాత్రమే సుప్రింకోర్టు చెప్పినట్లు స్పీకర్కు అర్దమైనట్లుంది. అందుకే ఆయన పార్టీ పిరాయించినట్లు ఆరోపించడబడుతున్న ఎమ్మెల్యేలకు ఊరట ప్రసాదించారు. వీటన్నింటిపై మళ్లీ బిఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్దితి వుంది. అక్కడ కూడా వాయిదాల పర్వంతో మరింత కాలం కాలయపన తప్పదు. ఆ తర్వాత స్పీకర్ తీర్పును కోర్టు సమర్ధిస్తే బిఆర్ఎస్ చేసేదేమీ లేదు. ఒక వేళ మళ్లీ బిఆర్ఎస్ సుప్రింకోర్టు తలుపు తడితే అక్కడ ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు పుణ్య కాలం పూర్తి కావొచ్చు. అప్పుడు ఎలాంటి తీర్పు వచ్చినా జరిగేదేమీ లేదు. బిఆర్ఎస్కు ఒరిగేదేమీ లేదు. అయితే నైతికత అనేది తెరమీదకు వస్తుంది. చట్టసభల తీరు, నాయకులు వ్యహారం ఎన్నికలను అపహస్యంచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనేది తెలిసిందే. ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకుంటే స్పీకర్ గడ్డం ప్రసాద్కు రాజకీయంగా ఏం జరుగిందో తెలుసు. రాజ్యాంగ పరంగా ఆయనకు విశేషమైన అధికారులున్నప్పటికీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా కొన్ని విషయాలపై కంకణ బద్దలై వుండాల్సిందే..లేకుంటే ఆయన పదవికి కూడా గండం రావొచ్చు. కాని చరిత్రలో కొంత మంది స్పీకర్లు నిక్కచ్చిగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. పాలకులను ఎదిరించిన స్పీకర్లు కూడా వున్నారు. 1989 సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ నియంతృత్వ పోకడలు నచ్చని అప్పటి స్పీకర్ తన పదవి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడు. ఎదురులేని పాలకుడు. ఎన్టీఆర్ ఏది చెబితే అదే నడిచిన కాలం. భవిష్యత్తులో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చే అవకాశం లేదనుకుంటున్న కాలం. అలాంటి బలవంతమైన నాయకుడు, ఎన్టీఆర్ సర్కారు తీరు స్పీకర్ నారాయణరావుకు నచ్చలేదు. నారాయణరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే. అయినా స్పీకర్ బాద్యతలను నిర్మొహమాటలంగా నిర్వహించారు. సహజంగా స్పీకర్ దృష్టి ఎక్కువగా ప్రతిపక్షం వైపు వుండాలని అనుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్షాల గొంతు ప్రభుత్వం నొక్కకుండా కాపాడేదే స్పీకర్. అలాంటి స్పీకర్ పూర్తిగా పాలకపక్షం వైపు నిలబడితే ప్రతిపక్షాని విలువేముంటుంది. అందుకే న్యాయబద్దంగా తన విధులు నిర్వహించడం ఎన్టీఆర్కు ఇబ్బంది అనిపిస్తుందని తెలసి తన పదవికి రాజీనామా చేశారు. ఆఖరుకు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక మరో స్పీకర్ యనమల రాముకృష్డుడు కూడా అదే ఎన్టీఆర్కు 1994లో మైక్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ కంట తడి కూడా పెట్టుకున్నారు. అయినా విదినిర్వహణ కోసం యనమల నిలబడ్డాడు. 1991లో ఓ సినిమా విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రచ్చ చేసింది. ప్రతిపక్షం గొంతు నొక్కేంత పని చేసింది. సినిమా వ్యహారం కూడా ఆనాడు అసెంబ్లీని కుదిపేసింది. సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దాంతో అప్పటి స్పీకర్ ఆలపాటి ధర్మారావు సినిమాను చూసి, ఆ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని అప్పటి కాంగ్రెస్ పెద్దల సూచనలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. కీలకమైన విషయాల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి.