రాయి పల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పిన ప్రాణాపాయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిధిలోని రాయి పల్లి చౌరస్తా వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఒక బస్సు, కర్ణాటక ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు, అలాగే ఒక డీసీఎం వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
