మొగుళ్ళపల్లి ఎంపీటీసీ పదవికి, మండల రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎర్రబెల్లి దంపతులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి వనిత పున్నం-చందర్ రావు దంపతులు మొగుళ్లపల్లి ఎంపీటీసీ పదవికి, రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు చేశామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్న మమ్మల్ని ఆదరించి జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఎంపీటీసీగా గెలిపించిన మొగుళ్లపల్లి ప్రజలకు, మాకు అన్ని విధాలుగా సహకరించిన బిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఎంపీటీసీగా గెలుపొందినప్పటి నుండి మాకు ఉన్న పరిచయాలతో మొగుళ్ళపల్లిలో కొన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ, రైతుబంధు సమితి సభ్యునిగా రైతులకు, ఎంపీటీసీగా గెలిపించిన ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకున్న స్థానికంగా ఉన్న మండల, గ్రామ ప్రజా, ప్రతినిధులు సహకరించకపోవడంతో పాటు దళిత బంధు, గృహ లక్ష్మీ, బీసీ బంధులాంటి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో తనకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో మనస్థాపం చెంది ఎంపీటీసీ పదవికి, రైతుబంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, రైతులకు మేము అనుకున్న రీతిలో న్యాయం చేయలేకపోయినందున రాజీనామా చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించగలరని వారిని వేడుకుంటున్నట్లు ఎర్రబెల్లి దంపతులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version