తాళ్ల గురిజాల గ్రామంలో ముగిసిన ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామంలో ఆదివారం రోజు ప్రారంభమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ బుధవారం రోజు ముగింపు దశకు చేరుకుంది.5 సంవత్సరాలకు ఒకసారి గౌడ కులస్తులందరూ కలిసి గొప్పగా జరుపుకునే ఈ వేడుకకి నెలరోజుల ముందునుండే అందరూ కలిసి ప్రణాళికని రూపొందించుకొని కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఆలయ ప్రాంతాన్ని శుద్ధి చేసి రంగులతో, విద్యుత్ దీపాలతో, పచ్చని పందిళ్లతో అమ్మవారి ఆలయాన్ని నూతనంగా ముస్తాబుచేసి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేశారు.ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో నివసించే గౌడ కులస్తులంతా సొంతగూటికి చేరుకుని బందుమిత్రులను పిలుచుకొని వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమం మొదటి నుండి అమ్మవారి మహత్యాన్ని చరిత్రను ఒగ్గుకథ రూపంలో అందరికీ తెలియజేస్తూ వచ్చారు.ఆదివారం రోజున పోచమ్మ తల్లి బోనాలతో మొదలైన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ కళ్యాణం,నాగవెల్లి పట్నం కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముగింపు దశకు చేరుకుంది. ప్రతి గౌడ కుటుంబంలోని ఆడపడుచులు ఎల్లమ్మ తల్లి బోనాలు ఎత్తుకొని మంగళవారం రోజున మాదిగ లంద నుండి ఎల్లమ్మ తల్లిని మేళ తాళాలతో,డప్పు చప్పులతో,ఉర్రూతలూగించే ఒగ్గు కళాకారుల కీర్తనలతో నృత్యాలతో,గ్రామస్తుల కోలహలాల మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. బుధవారం ఉదయాన పోతురాజు చేసే బలి కార్యక్రమంతో ఈ వేడుక ముగుస్తుంది.ఈ సందర్భంగా గౌడ కుల పెద్దలు మాట్లాడుతూ గ్రామమంత సస్యశ్యామలంగా ఉండాలని, అమ్మవారి కృప కరుణ ప్రజలందరిపై ఉండాలని ఎల్లమ్మ తల్లిని గౌడ కులస్తులు వేడుకున్నారు.ఈ వేడుకలో గ్రామస్తులతో పాటు, చుట్టుపక్క గ్రామల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడంతో గ్రామం అంతా పండుగ వాతావరణం తలపించిందని,అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగిందని,అమ్మవారి కృపతో అందరి సహాయ సహకారాలతో ఈ బోనాల పండుగ కార్యక్రమం విజయవంతంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కుల బంధువులకు, గ్రామ ప్రజలకు గౌడ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version