రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా..
జహీరాబాద్. నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ నెలలో సెహ్రీ, ఇఫ్తార్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా రంజాన్ నెలలో ఉపవాసం చేసిన ముస్లింలందరూ ఖర్జూరం తిని తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు రకరకాల ఆహారపదార్ధాలు, పండ్లు ఉన్నా… ఒక్క ఖర్జూరంతోనే అది కూడా మూడు ఖర్జూరాలు తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా.. ఇలా చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..ఇస్లాం మతంలో రంజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 28న సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ మాసం ప్రారంభం అయింది. మార్చి 1వ తేదీన మొదటి ఉపవాసం పాటించారు. మార్చి 1న భారతదేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. దీంతో భారతదేశంలో రంజాన్ నెల ప్రారంభం అయింది. ఉపవాసం దీక్షను మార్చి 2నుంచి ప్రారంభిస్తున్నారు. రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు సెహ్రీ, ఇఫ్తార్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
ఉపవాసం దీక్ష విరమించి తర్వాత తీసుకునే విందుని ఇఫ్తార్ అని అంటారు. ఈ ఇఫ్తార్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖర్జూరం. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ఇతర దేశాల్లోని ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి.. సూర్యాస్తమం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం విరమిస్తారు. అయితే ఖర్జూరంతోనే ఉపవాసం ఎందుకు విరమింస్తారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఖర్జూరంతో ఉపవాసం ఎందుకు విరమిస్తారంటే..
రంజాన్ సమయంలో ఖర్జూరాలను ఉపవాసం విరమించడం సున్నత్గా పరిగణించబడుతుంది. దీని కారణం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ఖర్జూర పండ్లను చాలా ఇష్టపడేవాడట. దీంతో ఆయన ఉపవాసం ముగించే సమయంలో ఖర్జురాలను తినేవారు. అంటే ఆయన ఖర్జూరాలు తిని ఉపవాసం ముగించేవారు. అప్పటి నుంచి ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సంప్రదాయంగా.. మారింది. దీనిని సున్నత్ గా పిలుస్తారు.. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
ఇస్లాంలో సున్నత్ అంటే అర్ధం ఏమిటంటే..
ఇస్లాంలో సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం అంటే ప్రవక్త ముహమ్మద్ చూపిన అడుగుజాడలను అనుసరించడం. సున్నత్ అనే పదానికి అర్ధం ఖురాన్లో చాలా చోట్ల దేవుని మార్గం అని సూచిస్తుంది.
ఇఫ్తార్లో ఎన్ని ఖర్జూరాలు తింటారంటే..
ప్రవక్త ముహమ్మద్ తన ఉపవాసం ముగించడానికి మూడు ఖర్జూరాలు తిని.. నీటిని ఉపయోగించేవారట. దీంతో ఇప్పటికీ చాలా మంది ముస్లింలు మూడు ఖర్జూరాలు తిని అనంతరం నీటిని తాగి తమ ఉపవాసాన్ని ముగిస్తారు. అల్లాహ్ దూత ప్రార్థనకు ముందు పండిన ఖర్జూర పండ్లు తిని తన ఉపవాసాన్ని విరమించారని హదీసులో ప్రస్తావించబడింది. అదే విధంగా
సహీహ్ అల్-బుఖారీ (5445)లో ఎవరైతే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం ఏడు అజ్వా ఖర్జూరాలు తింటారో ఆ రోజు వారికి ఎటువంటి విషం లేదా మంత్రవిద్య హాని కలిగించదని.. అతని అల్లా రక్షణలో ఉండటాన్ని పేర్కొన్నారు.
ఖర్జూరంతో ఉపవాసం విరమించడం అవసరమా?
రంజాన్ నెలలో ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సున్నత్.. అయితే ఇలా చేయడం తప్పనిసరి కాదు. ఖర్జూరాలతో ఉపవాసం విరమించకపోయినా ఎటువంటి సమస్య లేదు. అయితే ఖర్జూరంతో ఉపవాసం విరమించడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.
రంజాన్లో ఖర్జూరాలు ఎందుకు ఉపయోగిస్తారంటే
శాస్త్రీయ కారణం- ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉపవాసం తర్వాత వచ్చే బలహీనత, అలసట లేదా తలనొప్పి వంటి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందువల్ల ఉపవాసం విరమించే సమయంలో ముందుగా ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరం.
ఖురాన్ లో ఖర్జూరాల గురించి ప్రస్తావన.
ఇస్లాంలోని అత్యంత పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఖర్జూరం ఇతర చెట్ల గురించి దీని పండ్ల కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. ఖురాన్లో ఖర్జూరాలను 22 సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇస్లాంలో వీటికి ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ముహమ్మద్ కూడా ఖర్జూరాలు తిని వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పేవారట.