ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విసృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా కడియం కావ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనఅందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందని తెలిపారు.గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలి కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అలాంటి మతతత్వ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కార్యకర్తలకు మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో కూడా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు సూచించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, మీ ఇంటి ఆడ బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.