డ్రగ్స్ పై అధికారుల ఉక్కు పాదం
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ తో కలిసి సమావేశం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి.గీతే , సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో కొంతమంది వస్త్ర పరిశ్రమ కార్మికులు మద్యానికి బానిసై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇలా జరగకుండా స్థానిక కౌన్సిలర్ ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ను ఆదేశించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్ మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.
విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితాన్ని నాశనం చేస్తాయి…డ్రగ్స్ కు నో చెప్పండి అనే పోస్టర్లు రిలీజ్ చేశారు.I AM ANTI DRUG SOLDIER అనే పోస్టర్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి అందరూ I AM ANTI DRUG SOLDIER* గా నమోదు చేసుకొని మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ కోరారు.
సమావేశంలో డీ.ఎం.హెచ్ ఓ రజిత, డీ.ఏ.ఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.