అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ: తూర్పు ఇండోనేసియా (Eastern Indonesia)లోని లెవోటోబి లకి లకి (Lewotobi Laki Laki) అగ్నిపర్వతం బద్దలవడంతో ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో అక్కడికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా (Air India) విమానం బుధవారంనాడు వెనక్కి మళ్లింది.
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇండోనేసియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లో లెవోటోబి లకి లకి పర్వతం మంగళవారం సాయంత్రం విస్ఫోటనం చెందటంతో 10,000 మీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడింది. 150 కిలోమీటర్ల వరకూ ఈ బూడిద కనిపిస్తోంది. బుధవారం ఉదయం మరోసారి విస్ఫోటనం చెందడంతో దట్టమైన బూడిద ఎగసిపడుతోందని అధికారులు తెలిపారు. 8 కిలోమీటర్ల మేర డేంజర్ జోన్ ప్రకటించారు. దీంతో బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసారు.
కాగా, ఎయిరిండియా ప్రతిరోజూ దేశీయంగా, అంతర్జాతీయంగా 1,000కు పైగా విమాన సర్వీసులను నడుపుతోంది. జూన్ 12 నుంచి 17 వరకూ 83 ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయని, వాటిలో 66 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.