3 ఇడియట్స్ పార్ట్-2
ఆమిర్ ఖాన్ క్రేజీ అప్డేట్
భారతీయ సినీ చరిత్రలో విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే, నవ్వుల విందును పంచిన ఆల్టైమ్ బ్లాక్బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రుల గుండెలను తాకింది. అప్పటి నుండి ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఆ నిరీక్షణకు తెరదించుతూ, సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు రాజ్కుమార్ హిరానీ ‘3 ఇడియట్స్ 2’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సీక్వెల్ గురించి ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. రాజ్కుమార్ హిరానీ ఇప్పటికే ఒక అద్భుతమైన ఐడియాను డెవలప్ చేశారని, అది విన్నప్పుడు తాను ఎంతో ఎగ్జైట్ అయ్యానని తెలిపారు. మొదటి భాగంలో ఉన్న హ్యుమర్, ఎమోషన్స్ ఏమాత్రం తగ్గకుండా, పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాలు ఏ మలుపు తిరిగాయనే కోణంలో కథ సాగబోతోందని హింట్ ఇచ్చారు. మారుతున్న జీవనశైలి, ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న విద్యా ఒత్తిళ్లు, ఏఐ వంటి ఆధునిక అంశాలను హిరానీ తనదైన మార్క్ వ్యంగ్యంతో ఈ సినిమాలో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు 15 ఏళ్ల క్రితమే 460 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఇండియన్ సినిమా సత్తాను చాటిన ‘3 ఇడియట్స్’, ఇప్పుడు సీక్వెల్తో రాబోతుండటం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. బాలీవుడ్లో తొలిసారి 200 కోట్ల క్లబ్ను ప్రారంభించిన ఈ ఫ్రాంచైజీ, పార్ట్-2తో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ ముగ్గురు ‘ఇడియట్స్’ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చేసే రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలి
