`చిట్ కంపెనీలు ..చీకటి దందాలు!?
`ఒక్కసారి చిట్ వేస్తే.. ఇక మిగిలేది చీకటే!
`నమ్మి చిట్టి కడితే చీటి చిరిగినట్లే!?
`లాక్కోలేక, పీక్కో లేక కష్టాలు కొని తెచ్చుకోవడమే!
`గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే!
`జీవితాలు ఆగమే…బతకంతా నరకమే!
`నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు?
`జనాన్ని నట్టెట ముంచేస్తారు!
`తేరగా చేతులెత్తేస్తారు!
`బోర్డు తిప్పేసి కంపనీ లాస్ అని మూసేస్తారు!
`అట్లుంటది చిట్ కంపనీల మోసం!
ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం!
12 నెలలుగా వరంగల్ నగరంలో ‘‘చిట్స్ రిజిస్ట్రార్’’ లేడు.
`దివాళా కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు!
`దివాళా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు!
`కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు!
`కంపనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు!
`కంపనీకి రావాల్సి వుంటే వేధించుకు తింటారు!
`ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు!
`పోలీసులు కూడా ప్రజల పిర్యాదులు పట్టించుకోరు!
`నాయకులు, పోలీసులు కంపనీలకు అండగా నిలుస్తారు!
`బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు!
జనాలకు ‘‘చిట్ చట్టాల’’ మీద అవగాహన వుండదు!
బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు!
ఆ సొమ్మును ‘‘చిట్ రిజిస్ట్రార్’’కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికి ఉండదు!
`పదే పదే కంపెనీల మోసాలకు బలౌతుంటారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
చట్ట బద్దమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి, చిట్టీలు వేసి మోసపోవద్దు? అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్ కంపనీ ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగూ ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలను నిర్వహిస్తుంటారు. మా చిట్స్ కంపనీలో చిట్టీల కట్టమంటారు? ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడుపు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్ధలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టీపట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్ పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం వుండదు. జనం సొమ్ముతో ఉడాయిస్తుంటారు. కంపనీ దివాళా తీసిందని కాకమ్మ కధలు చెబుతారు. జనం నోట్లో మట్టికొడతారు. నాలుగు రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బైటకు వచ్చి మళ్లీ కొత్త బాగోతం మొదలు పెడతారు. పాత బోర్డు స్ధానంలో కొత్త బోర్టు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతి రూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్ప వరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని ఉత్తచిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్ధులు పెంచుకుంటారు. చిట్ వేసేదాక బెల్లం మీద ఈగలు వాలినట్టు, జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంట పడీ పడీ చిట్టీ కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోల్లు ఇంటికి తిరిగినట్లే తిరుగుతారు. ఒక్క సారి చిట్టీ కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే, పెనాల్టీలు వేస్తారు. చిట్టీ గడువు పూర్తయి, నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరుకు కంపనీ దివాళా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక్క వరంగల్ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వెలిసిన కంపనీలకు, మూత పడిన కంపనీలకు లెక్కేలేదు. కొత్తవి పుట్టుకొస్తూనే వుంటాయి. పాతవి మూత పడుతూనే వుంటాయి. కాని వ్యక్తులు వాళ్లే వుంటారు. జనం సొమ్మును దశాబ్ధాల తరబడి దోచుకుంటూనే వున్నారు. త్వరలో వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్ కంపనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటిదాత్రిలో…త్వరలో..
వరంగల్లో చిట్స్ రిజిస్ట్రార్ ఎక్కడ?
ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా వుంది?
`సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు?
`వరంగల్ అంటే ఎందుకు సుముఖంగా లేరు?
`వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు?
`వచ్చేందుకు సిద్దంగా వున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
`రెవిన్యూ వ్యవస్ధలో ఏం జరుగుతోంది?
వరంగల్లో చిట్స్ రిజిస్ట్రార్ లేక ఏడాది గడుస్తోంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే వుంది. కనీసం ఇన్ చార్జి కూడా ఎవరూ లేరు. చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా పని చేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు. అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేస్తే ఎలాంటి ఫలితం వుండదనుకుంటున్నారా? లేక ప్రజా ప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది. ఆ మధ్య ఓ వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పని చేయాలని వెళ్లిపోయారు. కారణాలు ఏమైనా కావొచ్చు? అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్ వుంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజా ప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా, సమస్యలు ఎదురౌతానకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి, ఉద్యోగానికే ఎసరు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అదికారులు సిద్దంగా వున్నారు. కాని వారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతుల్లో వుండాలని ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిని అధికారులు చిట్స్ రిజిస్ట్రార్గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒక వేళ పనిచేద్దామని వచ్చే వారిని ప్రజా ప్రతినిధులు రానివ్వడం లేదు? కారణమేమిటంటే తమ మాట వినని అదికారులు వస్తే ఆ ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్ రిజిస్ట్రార్ లేకుండానే కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్ అంటేనే చిట్ ఫండ్ కార్యాలయాల గోల్ మాల్కు అడ్డా? ఏ చిట్ ఫండ్ చూసినా అదే తీరు. అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపనీలే ఎక్కువ. ప్రజలను వీదిన పడేసిన కార్యాలయాలే వున్నాయి. వేల కోట్లు రూపాయల కుంభాకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్ కంపనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్స్ రిజిస్ట్రార్ వుండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు వున్నారు. కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే, వాళ్లంతా చిట్స్ కంపనీలకే వత్తాసు పలుకుతారన్నది భహిరంగ రహస్యమే. అందుకే వరంగల్కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి, వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్ రిజిస్ట్రార్గా పని చేయమని చెప్పేవారిని వదిలేయండి. కాని వస్తామని అంటున్నవారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి? ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.