ఆశల సౌధం…పాలనా నిలయం!
– తెలంగాణ భూతల స్వర్గం…
– కేసిఆర్ పాలన స్వర్ణ యుగం.
-చారిత్రక నిర్మాణాల తెలంగాణ.
-సచివాలయ నిర్మాణం గొప్ప ఆవిష్కరణ.
-హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడు.
-ఆ పక్కన అంబేద్కరుడు
-ఈ పక్కన అమరవీరుల స్మృతి చిహ్నం.
-మధ్య లో పాలన యంత్రాంగం.
-యాదగిరి నర్సన్నకు కొత్త ఆలయం.
-యాదగిరిగుట్ట కు కొత్త శోభ.
-తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కాళేశ్వరం.
– దేశంలోనే అత్యంత గొప్ప రిజర్వాయర్ మల్లన్న సాగరం.
-మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం.
-ఇంటింటికీ మంచినీటి భగీరధ ప్రయత్నం.
-చెరువుల పండుగలో సరికొత్త పర్వదినం.
-జిల్లాలలో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు.
-హైదరాబాదు చుట్టూ నాలుగు ప్రభుత్వ వైద్యాలయాలు.
-అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు.
-కొత్త ఆసుపత్రి వరంగల్ కే తలమానికం
హైదరబాద్,నేటిధాత్రి:
ఒక వ్యక్తి పట్టుదల ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేస్తుందని చెప్పడానికి నిదర్శనం, నిర్వచనం ముఖ్యమంత్రి కేసిఆర్. అసలు తెలంగాణ అనేది ప్రజల అరవై ఏళ్ల కల. తలంగాణ వస్తే చాలు అనుకున్న రోజులు. కాని తెలంగాణ సిద్ధించడం అన్న సందర్భం నుంచి బంగారు తెలంగాణ నిర్మాణం వంటి వినూత్నమైన,విప్లవాత్మకమైన అనుభవాలు అన్నవి అందరి వల్ల కాదు. చారిత్రక సత్యాలను ఆవిష్కరించడం అన్నది యుగపురుషుల వల్లే సాధ్యమౌతుంది. అదే ముఖ్యమంత్రి కేసిఆర్ నిరూపించి చూపించింది. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులౌతారని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసిఆరే నిదర్శనం. కళ్లముందు సాక్ష్యాత్కారం. ఎక్కడి తెలంగాణ? ఎలా వున్న తెలంగాణ. ఎనమిదేళ్ల క్రితం ఎలా వుంది. ఇప్పుడెలా వుంది. కేవలం ఎనమిదేళ్ల కాలంలో ఒక రాష్ట్ర రూపురేఖలు ఇంతలా మారడం అన్నది ఎలా సాధ్యమైంది. అందివల్ల అయ్యేదేనా? అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమయ్యేవే. ఎందుకంటే ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలనకు గీటురాయిగా చెప్పుకోవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం నేను చూసిన హైదరాబాద్ వేరు..ఇప్పుడున్న హైదరాబాద్ను చూసి ఆశ్చర్యపోయానన్నారు. అసలు నేను తెలంగాణలో వున్నానా, లేక లండన్లో వున్నానా? అమెరికాలో వున్నానా? అన్నంతగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ను ఆంధ్రప్రదేశ్ గడ్డమీద కొనియాడారు. అంటే ఒక నాయకుడు తలుచుకుంటే తన పాలనలో ఎన్ని అధ్భుతాలు సృష్టించగలరో చూపించిన ఏకైక నాయకుడు కేసిఆర్.
ఎనమిదేళ్ల కాలంలో జరిగిన తెలంగాణ నిర్మాణం నభూతోనభవష్యతి.
తెలంగాణ రావడమే కల అనుకుంటే, తెలంగాణ నిర్మాణం అన్నది కేసిఆర్ అందించిన గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సౌకర్యాలు, అన్ని రకాల వసతులు వున్న రాష్ట్రాలలో ఒకటికి రెండు దఫాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనేక మంది నాయకులు దేశంలో వున్నారు. కాని తెలంగాణ వచ్చాక అసలు తెలంగాణ చెందిన పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించేందుకే ఎంతో కాలం పట్టింది. అయినా ఎనమిదేళ్లలో ప్రపంచంలోనే ఏ ప్రాంతం అభివృద్ధి చెందనంత వేగంగా తెలంగాణ అభివృద్ధిచెందింది. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన విజన్ వున్ననాయకుడు. అందుకే ఎంతో దూరదృష్టితో అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు.
తెలంగాణ వచ్చాక జరిగిన నిర్మాణాలలో అతి ముఖ్యమైనది కాళేశ్వరం.
ఆ తర్వాత యాదగిరి గుట్ట పునర్ నిర్మాణం. ఒకటి ఆదునిక దేవాయలం. మరొకటి హైందవ సంస్కృతికి నిదర్శనం. కాళేశ్వరం నిర్మాణంలో తెలంగాణలో కొత్తగా సుమారు 16లక్షలకు పైగా ఆయకట్టు స్ధిరీకరణ జరగడంతోపాటు, దాని ద్వారా తెలంగాణలో చెరువులు, రిజర్వాయర్లు నింపడంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మారిపోయింది. ఒకనాడు గుక్కెడుమంచినీటి కటకటే..సాగునీటికి అవస్ధలే. తెలంగాణ పల్లెలో ఆడబిడ్డలు బిందెలు నెత్తిన పెట్టుకొని వ్యవసాయ బావుల వద్దకు కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకున్న రోజులు. కాని నేడు ప్రతి ఇంటికీ మంచినీటిని అందించే మిషన్ భగీరధ చేపట్టి ముఖ్యమంత్రి కేసిఆర్ అపర భగీరధుడయ్యాడు. ఆ మధ్య ఓసారి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో ఎదరైన మహిళతో మాట్లాడుతూ అవ్వా…మంచినీళ్లొస్తున్నాయా? అంటే పొయ్యికాడికే నీళ్లొస్తున్నాయి సారూ..అంటూ దండం పెట్టిన సందర్భం. తాను బిందెలతో నీళ్లు మోసి, మోసి చెయి విరిగిపోయిన సందర్భం గుర్తు చేసింది ఆ మహిళ. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ పుణ్యమా అని వంటింట్లోకే మంచినీళ్లు వస్తున్నాయి సంతోషంగా మహిళలు చెబుతున్నారు. ఇదీ తెలంగాణ సాధించిన విజయం అని చెప్పడానికి ఒక మచ్చు తునక.
ఇక సాగు నీటి సందర్భం గురించి చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అన్నది సాధ్యమేకాదని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణను అభివృద్ధికి ఆమడ దూరం తరిమారు. ప్రగతిని నిర్లక్ష్యం చేశారు.
తెలంగాణను చిన్న చూపు చూశారు. తెలంగాణ మేధావులు ఎంత మంది తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని సూచించినా పెడ చెవిన పెట్టారు. అంతే కాదు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదని కొంత మంది తెలంగాణ మేధావులు కూడా ఉమ్మడి పాలకులకు వంత పాడిన వారున్నారు. సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలికిన నాయకులు కూడా వున్నారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గోస పెరిగింది. వ్యవసాయం ఆగమైంది. పల్లెలు పాడుబడిపోయాయి. కాని తెలంగాణలో ప్రాజెక్టులు సాధ్యమే అని నమ్మిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ వస్తే తెలంగాణ లో ప్రాజెక్టులు నిర్మాణం చేసి చూపిస్తా అని చెప్పిన నాయకుడు కేసిఆర్. అన్నట్లుగానే తెలంగాణ సాధించి, కాళేశ్వరం నిర్మాణం చేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాన సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసిఆర్.
కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ భూతల స్వర్గంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.
హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మార్చేశారు. అందమైన హైదరాబాద్ నిర్మాణం చేశారు. కేవలం ఎనమిదేళ్లలలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఎనమిదేళ్ల క్రితం చూసిన తెలంగాణకు ఇప్పటికీ అనేక రెట్లు మార్పు జరిగింది. ప్రగతి వేగం పుంజుకున్నది. పట్టణాలే కాదు…పల్లెల్లో అభివృద్ధి వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన స్వర్ణయుగంగా మారింది. ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో వుండడమే స్వర్ణయుగం. తెలంగాణ వచ్చాక వృద్దాప్యంలోవున్న పెద్దలకు అందుతున్న ఆసరా భరోసాతో మొదలు, అనేక రకాల సంక్షేమ పథకాలు అందుతున్న ఏకైక రాష్ట్ర్రం తెలంగాణ. ఎన్నో పథకాల అమలే కాదు, నూతన నిర్మాణాలు జరగడంతో తెలంగాణ ఒక అధ్భుతమైన రాష్ట్ర్రంగా మారిపోయింది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. కొత్తగా సాగిన నిర్మాణాలలో తెలంగాణలో కొత్త రిజర్వాయర్లు. భవిష్యత్తు తరాలకు వారుధులుగా నిలుస్తాయిని చెప్పడంలో సందేహం లేదు.
మల్లన్న సాగర్ లాంటి నిర్మాణాలు ఎవరూ కలలో కూడా ఊహించలేదు.
అలా తెలంగాణను దీర్ఘ దృష్టితో ఆవిష్కరించిన నేత కేసిఆర్. పాలనాపరమైన విధానాలలో అనేక రకాలైన మార్పులు తెచ్చినట్లే , కొత్త కొత్త నమూనాలతో నిర్మాణాలు కూడా చెపట్టిన ఘనత కేసిఆర్కే దక్కుతుంది.. నేడు ఆవిష్కరించనున్న తెలంగాణకొత్త సచివాయలం అన్నది ఎన్నో విశేషాలతో కూడుకున్నది. సచివాలయానికి ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజ్యాంగ కర్త. భారతరత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాత స్పూర్తితో తెలంగాణలో పాలన సాగుతోందని చెప్పడానికి నిదర్శనంగా ఆ విగ్రహం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా దళితుల సంక్షేమం కోసం చేపట్టనన్ని పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారు. అందులో దళిత బంధు అన్నది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. తెలంగాణలో సామాజిక న్యాయమేకాదు, ఆర్ధికపరమైన అసమానతలు తగ్గి, అన్ని వర్గాల ప్రజలు ఒక్కటే అని నిరూపించేందుకు, భవిష్యత్తులో సర్వమానవాళి సమానత్వం రూపుదిద్దుకునేందుకు వేసిన గొప్ప మార్గంగా దళిత బంధును చెప్పొచ్చు. ఇక వైద్య రంగంలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకనాడు తెలంగాణలో పది జిల్లాలు వుండేవి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా 33 మూడు జిల్లాలు ఏర్పాటు చేసి, అన్ని జిల్లాల్లో వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు, నూతన భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అంటే వైద్యం ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్దే. హైదరాబాద్ చుట్టూ నాలుగు వైపుల నాలుగు అతి పెద్ద ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్ లో సుమారు 2వేల పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్నారు.
ఇక పాలనాపరమైన వ్యవస్ధలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మాణం చేసి, ప్రజలకు అన్ని రకాల పాలనా సౌకర్యాలను ఏక కాలంలో, ఒకే దగ్గర అందేలా చేసిన పాలకుడు కేసిఆర్. గతంలో ప్రజలు ప్రభుత్వ కార్యాయాల చుట్టూ తిరగాలంటే ఎంతో కష్టపడేవారు. అవి ఎక్కడున్నాయో కూడా తెలియక అవస్ధలు ఎదుర్కొనేవారు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. కాని ఇప్పుడు ఏ పని కావాల్సి వచ్చినా, అన్ని రకాల వ్యవస్ధలు ఒకే చోట కేంద్రీకృతం చేసి, అధ్భుతమైన సమీకృత కార్యాలయాలతో సరికొత్త తెలంగాణను ఆవిష్కరించారు. ఒక్కో కలెక్టర్ కార్యాలయం ఒక సెక్రెటెరియేట్ను తలపించేలా నిర్మాణాలు సాగించారు. పాలనను కొత్త పుంతలు తొక్కించారు.
తెలంగాణ సాధనలో అమరుల గుర్తుగా అమరవీరుల స్మృతి చిహ్నం కూడా దాదాపుగా పూర్తయింది.
గొప్ప హైందవవాదిగా కేసిఆర్కు పేరు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరి గుట్ట ఎంతో ప్రశస్తమైంది. ఎంతో మహిమాన్వితమైంది. అందుకే తెలంగాణ యాదగిరి గుట్ట పునర్మిర్మాణం అన్నది ఒక అధ్భుతం. అసలు పూర్వకాలంలో గుడులు ఎలా నిర్మాణం చేశారో అన్నది ఒక పెద్ద ప్రశ్న. కాని నేడు అదే తరహాలో కృష్ణ శిలతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాడు. కొత్త యాదాద్రి సొగబులు అద్దాడు. చరిత్రలో తనకంటూ ఒక పేజీనే కాదు, తెలంగాణ వున్నంత కాలం, చరిత్ర నిలిచినంత కాలం కేసిఆర్ పేరు చిరస్ధాయిగా నిలుస్తుంది. ఆచంద్ర తారార్కం ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. భవిష్యత్ తరాలు ప్రతి సందర్భంలోనూ చెప్పుకునేంత గొప్పగా వుంటుంది. నేడు అశోకుడు చెట్లు నాటించేను అని ఎలాచెప్పుకుంటున్నారో…తెలంగాణను పాలించిన కేసిఆర్ అన్నది ప్రతి సందర్భంలోనూ చెప్పుకునే రోజు వస్తుంది. దటీజ్ కేసిఆర్.