` కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హాట్ టాపిక్ అతనే
` అవినీతి చేయడంలోనూ ఆదర్శం అతనే?
` అవినీతిపరులను కాపాడడంలోనూ అతనే దిట్ట?
` స్టాంపులు అమ్మడంలో ఆరి తేరి, అందరికీ అలవాటు చేసింది అతనే!?
` ఈ చీడ రాష్ట్రమంతా పాకినా ప్రభుత్వం పట్టించుకోదా?
` దర్జాగా స్టాంపులు అమ్ముకునేందుకు ఆశీస్సులిస్తున్న వారిని గుర్తించరా?
` కరీంనగర్లో అంతటా వినిపించేది అతనే?
` అధికారులకు ప్రీతి పాత్రుడతడే?
` వసూళ్ళు , పంపకాలకు అధికారులకు నమ్మిన బంటే?
` అవినీతి కొత్త తరహాలు…రిజిస్ట్రేషన్ కార్యాలయాలే అడ్డాలు?
` నేటిధాత్రితో తమ గోడులో కన్నీటి పర్యంతమైన భాదితులు
హైదరాబాద్ , నేటిధాత్రి :
ఉద్యోగం అన్నది జీవితానికి ఉపాధి మార్గమా…అక్రమ సంపాదనకు లైసెన్సా అన్నది తెలియనంతగా అవినీతి పెరిగిపోయిందనడానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఒక్కటి చాలు సాక్ష్యానికి….! ఈ ప్రపంచంలో గాలి, నీరు, ఆకాశం, అగ్ని అందరి సొంతం. కాని భూమి మాత్రం కొందరి సొంతం. ఇదే సర్వదరిద్రాలకు కారణం. సూది మొనంత కూడా భూమి ఇవ్వనన్నందుకే మహాభారతం జరిగింది. రాజ్యాలన్నింటికి ఇదే సూత్రం. ఇప్పటికీ దేశాలలో దురాక్రమణలకు బావదారిద్య్రం. మరి ఆ భూమి ఒకనాడు భుక్తి కోసం…గూడు కోసం…అదే నేడు వ్యాపారం కోసం…ఆస్ధుల కూడబెట్టుకోవడం కోసం…స్ధిరాస్థులుగా మలుచుకొని జీవితాంతం కాలుమీద కాలేసుకొని బతకడం కోసం…ఇదే ఆనాటి నుంచి అధికారులకు వరంగా మారింది. తెలంగాణ అన్న ఉనికే భూమి కోసం…దొరలు అక్రమంగా ఆక్రమించుకున్న భూములకు లెక్కలేసి, కాగితాలు సృష్టించి, అమాయకులను ఆనాడు అలా మోసం చేశారు…నేడు ప్రజా ప్రభుత్వాలలో, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు. అదే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. జనాలను జలగాల్లా పీడిస్తున్నారు. రక్తం తాగుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఊడలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాని వాటిని కత్తిరించేవారులేకపోతున్నారు. ప్రభుత్వ ముద్రించి, అమ్మి, ఆదాయం సమకూర్చే స్టాంపులను, ఉద్యోగులు తయారు చేయడం ఏమిటి? వాటిని దర్జాగా కార్యాలయాల్లోనే అమ్మడం ఏమిటి? రిజిస్టర్లు తారు మారు చేయడం ఏమిటి? బ్యాంకులను కూడా బురిడీలు కొట్టించడం ఏమిటి? కోట్లుకు కోట్లు దోచుకుపోతున్నా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోవడం ఏమిటి? ఆ శాఖ పెద్దలు సమాచారం తెలిసినా కదలకపోవడం ఏమిటి? పెద్దలే ఏకంగా తప్పు చేసిన ఉద్యోగులకు అండగా నిలవడం ఏమిటి? విచారణ అధికారులు వాళ్లే…తప్పు చేయించేది వాళ్లే అయితే వారికి అడ్డేది…అవినీతి అంతానికి దిక్కేది…?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఏ ఉద్యోగిని కదించినా చెప్పేది ఒక్కరి పేరే… ఆ ఒక్కరే సురేష్? ఇతని పేరే అందరూ ఎందుకు చెబుతున్నారు? ఇతని వల్లే జిల్లాలో మొత్తం శాఖ భ్రష్టు పట్టిపోయిందన్న మాటలు ఎందుకు అంటున్నారు? అందరూ చెప్పేది అతని గురించే…అన్ని వేళ్లూ అతని వైపే? 2014కు ముందే అనేక రకాల అవినీతి కార్యకలాపాలు చేసినట్లు శాఖలో చెప్పుకుంటారు. ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారు. కేసు కూడ నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లాడు. ట్రిబ్యునల్ తీర్పుతో మళ్లీ ఉద్యోగంలో చేరాడు…కేసు మాత్రం ఆగలేదు…ఆయన కూడా ఆగకుండానే సంపాదనలో మునిపోతున్నాడు. అందిన కాడికి దోచుకుంటున్నాడు..ఇదే బాధితులు చెబుతున్న మాట. ఆయన తర్వాత జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఇదే తరహాలో స్టాంపులు అమ్ముకున్నారు? దోచుకోవాల్సినంత దోచుకున్నారు. ప్రభుత్వానికి రూ. 70లక్షలకు పైగా కన్నం పెట్టారు. పట్టుబడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు…ట్రిబ్యునల్ పుణ్యమా? అని మళ్లీ విధుల్లో చేరారు. కాని కాజేసిన సొమ్ము మాత్రం జమ చేయలేదు. వీరందరికీ సాయం చేస్తున్న వ్యక్తిగా తెరమీద మళ్లీ సురేషే కనిపిస్తున్నాడు? శాఖలో అవినీతి ఉద్యోగులకు ఆసరాగా సదరు సురేష్ గుర్తింపులో వున్నాడు. అవినీతి చేసినా ఫరవాలేదు. ఉద్యోగాలు పోయినా ఫరావాలేదు…అడ్డూ అదుపు లేకుండా సంపాదించుకోండి…పట్టుబడినా మళ్లీ ఉద్యోగం తెచ్చుకోండి? అన్నది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ పోతున్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు. పైగా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని సవాలు కూడా విసురుతున్నారట? ఇక్కడ ఈ మాత్రమైనా పని చేస్తున్నాం…? మేమే లేకపోతే ప్రభుత్వానికి ఆదాయమే లేదన్నంతగా మాట్లాడుతున్నారట? ఇలా జిల్లా పెద్దలు మాట్లాడుతుంటే…కింది స్ధాయి ఉద్యోగులైన సురేష్ లాంటి వారు ఏం చేస్తారో తెలియంది కాదు…ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్న సామెత ఊరికే రాలేదు. ఇతని అవినీతి అక్రమాలపై, రైతులపై దౌర్జన్యంపై, రియలెస్టేట్ వ్యాపారుల వేధింపులపై పెద్దపెల్లి జిల్లాలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి?. అయినా యంత్రాంగం కదలడం లేదు? ఎందుకంటే వారికి వాటాలున్నాయన్న మాటలు బాధితులే అంటున్నారు.? ఇదిలా వుంటే ఈ వ్యక్తి లీలల్లో మరో కోణం కూడా వుంది. ఎవరైతే తనకు అడ్డుగా వున్నారన్న ఉద్యోగులను కళ్లల్లో పెట్టుకున్నాడంటే ఇక అంతే…ఖర్మకాలి ఒక వేళ అలాంటి అధికారులు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే…ఇక అంతే సంగతి? వారు ఉద్యోగంలోకి రారు..రాలేరు? అంతటి చక్రం తిప్పడంలో సురేష్ ఘనాపాటి అంటున్నారు. పోయిన ఉద్యోగాలు రావాలన్నా అతనే…రాకుండా చేయాలన్నా అతనే…అంటే ఇక అతని లీలలు ఎలా వున్నాయో! అర్ధం చేసుకోవచ్చు!! విద్యాశాఖలోనో, వైద్య శాఖలోనో…మరే ఇతర శాఖలోనూ సాధ్యమయ్యే పని కాదు. సంపాదనకు తావే లేదు…అయినా ప్రభుత్వ పెద్దలకు అతను కనిపించడం లేదా? శాఖ పెద్దలు ఇలా చూస్తూనే వదిలేస్తూనే వుంటారా? ఉపేక్షించడంలో కారణాలేమైనా ఇప్పటికైనా చెబుతారా? అని ప్రజలు అడిగి, అడిగీ విసిపోతున్నారు…
నీతి లేని, అవినీతికి అడ్డాలుగా కొన్ని శాఖలు చెబుతుంటారు. వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా? అక్రమ సంపాదనల కోసం లైసెన్స్లు తీసుకున్నారా? అంటూ సమాజం పుట్టినప్పటినుంచి అడుతున్నదే…అవినీతి సాగుతున్నదే…కాని సామాన్య జనం ఆశ…ఇప్పుడైనా అవినీతి ఆగుతుందేమో! అన్న ఆశ…ఆ ఆశ తీర్చేవారికన్నా, మరింత దోపిడీ పెంచేవారు..వారిని ప్రోత్సహించేవారే వస్తున్నారు. ఎన్నికల సమయం వచ్చిన ప్రతీసారి ఇది కూడా ప్రతి ఎన్నికల్లో ఒక అస్త్రం. పరిపాలనలో అవినీతికి తావులేని పాలన అందిస్తామని చెబుతూనే వుంటారు. మనం వింటూనే వుంటున్నాం. కాని అవినీతి ఆగింది లేదు. అవినీతి రహిత సమాజం మనం చూస్తామన్న నమ్మకం ఏ తరానికి లేకుండా పోతోంది. ఇదేనా మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్నది అని ప్రశ్నించుకోవడం…మళ్లీ మర్చిపోవడం…మనకు ఏ పనైనా తొందరగా కావాలి. అందరికన్నా ముందు కావాలి. అందుకు అధికారులు చేతుల్లోనైనా వుండాలి. లేకుంటే వారి చేతులు తడిపేందుకు ముందు మనమే సిద్దం కావాలి…ఇది కూడా అవినీతి కారణమౌతుంది. మేమెందుకు ఇవ్వాలి? అంటూ అందరూ ఎందుకు ప్రశ్నించరు? అవినీతిని అంతం చేయడం కోసం మీడియా నిరంతం కృషి చేస్తూనే వుంది. కాని అందుకు సహకరించడంలో ప్రజలు కూడా ముందుకు రావాలి. మా పని అయిపోతే చాలు…మా పని తొందరగా పూర్తయితే చాలు…అనే ధోరణి ప్రజల్లో కూడా కరెక్టు కాదు. అది కూడా అవినీతిని ప్రోత్సహించేలా చేస్తుంది. మరింత అవినీకి కారణమౌతోంది.