`పిల్లల జీవితాలతో రాజకీయాలా?
` నీచం…నికృష్టం!
`ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా?
`రాజకీయ అలజడి కోసం ఇంత పన్నాగమా?
` విద్యార్థుల జీవితాలతో ఆటలా?
` వారి భవిష్యత్తు అంధకారం చేస్తారా?
` రాజకీయ పార్టీగా బిజేపికి బాధ్యత లేదా?
`పార్టీ అధ్యక్షుడే ఇంతలా దిగజారొచ్చా?
` అడ్డదారిలో అధికారం కోసమే రాజకీయమా?
` ఇంత దుర్మార్గం ఎక్కడైనా వుంటుందా?
`దీనిని ప్రభుత్వంపై పోరామంటారా?
`రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి తప్పులు దేనికి సంకేతం?
` కుట్రలు, కుతంత్రాలు, అబద్దాలు, కట్టు కథలతో అధికారం వస్తుందా?
` రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం కాదా?
` ప్రజా ప్రభుత్వాలను కూల్చడం అనైతిక కాదా?
`దేశం కోసం, ధర్మం కోసమంటే అడ్డదారిలో అధికారమా?
`అధికారంలోకి వస్తే చేసే మేలేమిటో చెప్పాలి.
`అది మర్చిపోయి అయితే మతం లేకపోతే, అణచివేస్తాం…ఇదేనా బిజేపి సిద్దాంతం?
హైదరాబాద్,నేటిధాత్రి:
అనుమానాలతో కాపురాలు, అబద్దాలతో రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలంటేనే అబద్దాలైపోతున్నాయి. మోసాల మాటున స్నేహలు, ప్రజాసేవ ముసుగులో నాయకత్వాలు వుండొద్దు. కాని అలాంటి నాయకత్వాలే ఎక్కువౌతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రలో వున్న పార్టీలు, నేతలు సాగిస్తున్న రాజకీయాలు ఇలాగే వున్నాయనేది ఒక వాదన. అసలు భారతీయ జనతా పార్టీ లక్ష్యమేమిటో ఇప్పటికీ ఆ పార్టీ నేతలకుగాని, కార్యకర్తలకు , ప్రజలకు అర్ధం కావడంలేదనే అంటున్నారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎంత ముఖ్యమో? నైతికత కూడా అంతే ముఖ్యంగా వుండాలి. బిజేపి చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేదని తేలిపోయిందని విశ్లేషకులు అంటున్న మాట. అసలు రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బిజేపి చేయాల్సిన పనులేమిటి? అన్నదానిపై ఆ పార్టీలో ఎక్కడా చర్చ జరిగినట్లుగాని, ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై తీర్మాణాలుచేసినట్లు గాని ఎక్కడా లేదు. కేవలం ఒకటే ఎజెండా? రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా రావాలి. ప్రభుత్వాన్ని పడగొట్టైనా రావాలి? ఏక్నాధ్ షిండేలను తయారు చేసైనా రావాలి? అది ఎలా వచ్చినా ఫరావాలేదా? అన్నదానిపై ఇంతకు మంచి స్పష్టత లేదు? రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన బిజేపిలో ఎవరికీ లేదు. తెలంగాణకు నిధులు తేవాలన్న సోయి లేదు. కనీసం ఇచ్చిన హాహీలన్నా అమలు చేయాలన్నది అసలే లేదు. కాని తెలంగాణలో అధికారం మదే కావాలి? ఇది మాత్రమే వారికి తెలుసు. ఇది అనైతిం కాదా? అని అడిగితే నైతిక, అనైతిక అన్న పదాలకు చోటు లేదన్న రాజకీయాలే బిజేపి చేస్తుందని చెప్పడంలో సందేహం లేదని బిజేపి పెద్దలే ఆఫ్ద రికార్డు చెబుతున్నారు. సరే ఇవన్నీ ఒకెతైతే రేపటి తరం ఎలా వుండాలన్నదానిపై కూడా బిజేపికి సరైన అవగాహన, చిత్త శుద్ది లేదనేది ఇటీవల కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు విద్యార్దులు జీవితాలను బిజేపి తీర్చిదిద్దాలనుకుంటుందా? లేక వారి జీవితాలతో ఆటలాడుకొని రాజకీయాలు ఏలాలనుకుంటుందా? అన్నదానిపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం సాగుతోంది.
బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం తర్వాత బిజేపి పెరుగుతోందని అందరూ అనుకున్నారు.
పాల పొంగులాంటి వాపును చూసి సంబరపడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కొన్ని సీట్లురావడంతో బిజేపికి తిరుగులేదన్నంత అహం తలకెక్కించుకున్నారు. అనుకోకుండా కలిసొచ్చిన రెండు ఉప ఎన్నికల్లో గెలవడంతో మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు. మనం ఇకపై ఏది చెబితే అదే నమ్ముతారన్న భ్రమల్లో బిజేపి నేతలు తేలియాడుతున్నారు. వారు వేసే అడుగులు, చెప్పే మాటలు నిజాలని నమ్మించాలని ఒకటికి రెండుసార్లు అబద్దాలు వల్లిస్తూ, నిజాలు చేస్తున్నామనుకుంటున్నారు. కాని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
అసలు తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే దానికి ఎంతో కొంత ఉద్యమ నేపధ్యం వుండాలి.
కనీసం ఆ పార్టీ నాయకుల్లో కొందరైనా చెప్పుకోవడానికి ఉద్యమం సాగించిన నేతలైవుండాలి. కాని బండిసంజయ్కు ఆ పేరు లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది లేదు. కాని దూకుడు స్వభావం బాగా వుంది. అదే తన రాజకీయ ప్రస్తానానికి తోడ్పాటౌతుందనుకున్నాడు. ఇతర నేతలను దూరం పెడుతూ వస్తున్నాడు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంతోనూ కోరికోరి సమస్యలు తెచ్చుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అబద్దాల పర్వం తెలంగాణ వడ్లు కొనుగోలుతో మొదలైంది. కేంద్రం ఎన్ని కొర్రీలు పెడుతుందో తెలిసి కూడా, తెలంగాణ ప్రజలను బండి సంజయ్ మాయ చేయాలని ప్రతీసారి చూశాడు. కాని ప్రజలు నమ్మలేదు. బిజేపి నేతలే విశ్వసించలేదు. కేంద్రం ప్రతిపాదించిన గోదుమల లెక్కలు, తెలంగాణ లో బియ్యం లెక్కలుగా చూపించి అబాసు పాలయ్యారు. కాళేశ్వరం విషయంలో అనేక సార్లు తెలిసీ, తెలియిని తనమో, లేక ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారనున్నాడో గాని అబద్దాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అభాసుపాలయ్యాడు. ఇక ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అంటూ రకరకాలు కామెంట్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తర కుమారుడైపోయాడు.
ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఫామ్ హౌజ్ను ట్రాక్టర్ తో దున్నేస్తా! అంటూ వ్యాఖ్యానించాడు.
దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందనతో ఇక మళ్లీ ఆ విషయాలు మాట్లాడలేదు. ఇక మత రాజకీయాలు చేయడంలో సంజయ్ దిట్ట? అవకాశం చిక్కినప్పుడల్లా పాత బస్తీ గురించి ప్రాస్తావించడం, భాగ్యనగర్ అమ్మవారి మీద ఒట్లు వేయడం, ఆఖరకు ఓసారి యాదాద్రిలో తడి బట్టలతో కూడా ప్రమాణాలు చేసేంత స్ధితికి దిగజారిన రాజకీయం చేశాడు. ఇక తెలంగాణలోని మసీదులు తవ్వుతామంటూ విపరీత వ్యాఖ్యలు చేసి వివాదాలు కొని తెచ్చుకున్నారు. శివం ఎల్తే మాకు, సమాధి వుంటే మీకూ అని ముస్లింకు పార్టీని దూరం చేసుకున్నారు. ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని నిరుద్యోగుల మీద లేని ప్రేమ కురిపించడం మొదలుపెట్టాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజేపి ఉద్యోగ కల్పన గాలికి వదిలేసింది. కాని తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్నా రాజకీయం చేయాలని చూశాడు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఒక్కొక్కటీ నెరవేరుస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ప్రకటిస్తూ వస్తోంది.
దాంతో ఇక యువత తమ వైపు వచ్చే అవకాశం లేదని అర్ధమైపోయిన బండి సంజయ్ యువతను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు వేస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయదనుకొని బండి సంజయ్ ఉద్యోగాల భర్తీపై నోరు పారేసుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో మహిళా కమీషన్ చీవాట్లు కూడా తిన్నాడు. చేయకూడని వ్యాఖ్యలు చేసి నాలుక కర్చుకున్నాడు. ఏకంగా బిజేపి నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కవిత కోసం తీహార్ జైలులో రూం తయారు చేస్తున్నారన్నంత అహంకారపూరితమైన మాటలు మాట్లాడాడు. ఇది ఎవరికీ నచ్చలేదు. మెచ్చలేదు. అందుకే మరో ఎంపి అరవంద్ స్పందిస్తూ బండి వ్యాఖ్యలను భహిరంగంగానే వ్యతిరేకించడాడు. ఇక ఇంతలో జరిగిన గ్రూప్ వన్ పరీక్ష విషయంలో లీకు వీరుడు? ఎవరు? అన్నదానిపై జరిగిన చర్చలో అందరి వేళ్లూ బిజేపి వైపు, బండి సంజయ్ వైపే చూపాయి. దాని దర్యాప్తు సాగుతూనే వుంది. ఎన్ని రకాల ఆరోపణలైనా, విమర్శలైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేద్దామనుకున్నా సక్సెస్ కాలేకపోతున్నాడు. పిదప అభాసుపాలౌతున్నాడు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయొచ్చని తలనచినట్లున్నాడు. పదోతరగతి పరీక్షల వైఫల్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకున్నట్టున్నాడు. కాని మొదటి రోజు కుదరలేదు. అన్ని వేళ్లూ బిజేపి వైపే చూపించాయి. దాంతో పార్టీ మొత్తం ఇబ్బందిపడే పరిస్ధితి వచ్చింది. అయినా బండి సంజయ్ తన పంతం వదిలేయద్దొనుకున్నాడో ఏమో? కాని రెండో రోజూ హిందీపేపర్ విషయంలో ఇరుక్కుపోయాడు. పోలీసులు అరెస్టు చేశారు.