చదువు చారెడు…ఫీజులు బారెడు!

 

 

` ప్రైవేటు విద్య …ర్యాంకులు మిద్య!

` ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు?

` లక్షల్లో వసూళ్లు…విద్యా విధానానికి తూట్లు!

` ప్రచారం ఆకాశం…చదువులో అద్వాహ్నం?

` తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’!

`ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి!

` ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రైవేటు సంస్థల అసత్య ప్రచారం!

` తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం!

`దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు!

` పైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్‌ ప్రసారాలు…

` ప్రభుత్వ విద్యా సంస్థలపై కక్కుతున్న కాలకూట విషాలు.

` ప్రైవేటుకు వచ్చేది పదుల ర్యాంకులే!

` ప్రచారంలో చూపించేదంతా అబద్దమే!

`దీనంతటికీ కారణం విద్యాశాఖ నిర్లక్ష్యమే!

`మీ నేటిధాత్రి లో ఎక్స్‌ క్లూజివ్‌..

హైదరబాద్‌,నేటిధాత్రి:   

విద్య మిధ్య కావొద్దు. విజ్ఞానం వ్యాపారం కావొద్దు. అందుకే విద్యాదానం మహాదానం అన్నారు. కాని నేడు అదే విద్యను వ్యాపారం చేసుకుంటున్నారు. విజ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. జనమంతా చదువకు కొంటున్నారు. ఇదే అదునుగా అక్షరం రాని వాళ్లు విద్యాలయాలు స్ధాపిస్తున్నారు. చదువు కొందామనుకుంటున్న తల్లిదండ్రుల రక్తం జలగల్లా పీల్చుకొని తాగుతున్నారు. విద్యావ్యాపారం కొంత మంది గుప్పిట్లో పెట్టుకోని ఏలుతున్నారు. తెలంగాణలో విద్యావ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు. పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. చట్టాలను అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పెడ చెవిన పెడుతున్నారు. చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వాల చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు. మొత్తం విద్యావ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకొని మాఫియా సామ్రాజ్యం చేసుకొని ఏలేస్తున్నారు. విద్యా వ్యవస్ధను పశ్నార్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యేలా చేస్తున్నారు. పేదలకు విద్యను దూరం చేసే కుట్రను పెద్దఎత్తున పన్నుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ విద్య కాదని ప్రజలకు ప్రైవేటు విద్యా మత్తును అలవాటు చేశారు. ఆడి పాడే వయసులో విద్యను బలవంతంగా రుద్ది తల్లిదండ్రుల బలహీనతను వాడుకుంటున్నారు. ర్యాంకుల మాయాలోకం చూపిస్తున్నారు. ర్యాంకులను రద్దు చేసినా, జిపిఏలతో ప్రచారం మరింత పెంచుకున్నారు. తమ పిల్లలు విద్యావంతులు కావాలనుకుంటున్న తల్లిదండ్రులు, వారి భవిష్యత్తు కోసం ఊహాలోకంలో కలలు గంటున్నారు. లక్షలకు లక్షలు కార్పోరేట్‌ స్కూళ్లుకు ఇచ్చి వాటిని పోషిస్తున్నారు. లేని ర్యాంకుల పంటలను ప్రచారం చేసుకొని కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. కాని చదువుకున్న ప్రతి విద్యార్ధికి ర్యాంకు రాదు. లోపభూయిష్టమైన విద్యా వ్యవస్ధలో మొండి విధానాలు అమలు చేస్తున్నారు. ఉపాధి కోసమే విద్య అన్నంతగా రుద్దిరుద్ది బుద్ధిహీనులను చేస్తున్నారు. యంత్రాలుగా మార్చుతున్నారు. పనిచేసే రోభోలుగా పిల్లలను మార్చుతున్నారు. చదువుకొమ్మంటే చదువుకోవాలి. ఆడుకొమ్మంటే అడుకోవాలి. అంతే తప్ప మనిషి స్వతహా ఆలోచించే స్ధితి నుంచి మరమనిషిని చేసి ఆడిస్తున్నారు. బాల్యం నుంచే పాఠశాలే కర్మాగారాలుగా మారుతున్నాయి. 

  ప్రైవేటు స్కూల్‌ విద్యనే పెద్ద మిధ్య. కాని తల్లిదండ్రుల ఆశలకు నిచ్చెనలేస్తున్నారు. 

  కళ్లకు కనికట్టు కట్టేస్తున్నారు. అందమైన ఆకర్షణీయమైన బిల్డింగును చూపిస్తున్నారు. రంగురంగుల భ్రోచర్లు ముద్రించి తల్లిదండ్రుల ముందు వుంచుతున్నారు. కళ్లు జిగేల్‌ మనిపిస్తున్నారు. నల్లగా వుండాల్సిన నల్ల బల్ల స్ధానంలో ఆధునిక డిజిటల్‌ బోర్టును చూపించి లెక్కలేసి మరి ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నారు. ఏసీలలో పాఠాలు చెబుతున్నామంటూ లక్షలు దోచుకుంటున్నారు. స్కూల్‌ ఫీజులకు అదనంగా స్కూల్‌ డెవలప్‌ మెంటు ఫండ్‌ అంటూ లక్షలు పట్టపగలు దోపిదీ చేస్తున్నారు. విద్యార్ధుల చదువులకు స్కూల్‌ డెవలప్‌ మెంట్లకు సంబంధం ఏమిటన్నది తల్లిదండ్రులు అడగలేరు. విద్యా వ్యవస్ధ ప్రశ్నించదు. ప్రభుత్వాలకు పట్టదు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో చదవాల్సిన విద్య, ప్రైవేటు స్కూల్లో చదివే విద్య ఒక్కటే. పైగా ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పే గురువులు నిష్ణాతులు. ఆయా సబ్జెక్టులలో ఆరి తేరిన వారు. కాని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఫలితాలకు, ప్రైవేటు స్కూళ్లలో వచ్చే ఫలితాలలో వుండే తేడాలే విద్యార్ధి లోకాన్ని గందరగోళంలోకి నేట్టేస్తున్నాయి. తల్లిదండ్రులు జీవితాలను ఆగం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు చెప్పే గురువులు ఎంత నిష్ణాతులైనా, చదువకు చెప్పడానికి మాత్రం బద్దకస్తులు. ఉద్యోగం వచ్చేదాకా వుండే శ్రద్ద వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత వుండడం లేదు. అంతే కాదు ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడు. అసలు ఒక్కసారి ఉద్యోగం వచ్చిదంటే ఆ ఉపాధ్యాయుడు పుట్టిన ఊరులోనే వుండడు. పక్కనే వుండే పట్టణం చేరుకుంటాడు. అక్కడి నుంచి స్కూలుకు వస్తూ వెళ్తుంటాడు. తమ పిల్లల కోసం నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. మరి ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పే అద్యాపకులు ప్రభుత్వ ఉపాధ్యాయులంత నిష్ణాతులు కాదు. ప్రభుత్వం పెట్టే పరీక్షల్లో నెగ్గిన వారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే దురదృష్ట వంతులు. కాని ప్రభుత్వ ఉపాద్యాయుల కంటే కష్టపడి చదవు చెబుతుంటారు. మేనేజ్‌ మెంటుకు గజగజ వణుకుతూ పనిచేస్తుంటారు. కాని చదువు చెప్పని ప్రభుత్వ ఉద్యోగులు హక్కులు, జీతాల, డిఏలు, ఇంక్రిమెంట్లు అంటూ చదువు చెప్పడం వదిలేసి, నిరసలను తెలియజేస్తుంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే జీతంలో పదో వంతు ప్రైవేటు స్కూల్‌ టీచర్‌కు రాదు ఇంటర్నేషనల్‌ స్కూల్లో పనిచేసే టీచర్‌ జీతం కూడా ఇవరైవేలు దాటదు. పైగా మేనేజ్‌ మెంటు దోపిడికీ మాత్రం పరోక్ష సహాకారం అందడంలో ప్రైవేటు ఉపాధ్యాయకులు కృషి కూడా వుంది. ఎందుకంటే అందులో పనిచేసే అద్యాపకులు పాఠాలు బోధించే బాధ్యతనే కాదు, విద్యార్ధులను చేర్చించడాన్ని కూడా నిర్వర్తిస్తుంటారు.  

 అసలు స్కూలు అంటే ఎలా వుండాలన్నదానికి స్పష్టంగా మార్గదర్శకాలున్నాయి. 

కాని ఏ ప్రైవేటు స్కూలు కూడా ఆ మార్గదర్శకాలు పాటిస్తున్న ధాఖాలాఉ ఎక్కుడా లేవు. అసలు నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ లతోపాటు ఉమ్మడి జిల్లాలు,కొత్త జిల్లాలలో ప్రైవేటు పాఠశాలు ఇరుకు డబ్బాలు. నాలుగైదు అంతస్ధుల మేడలు. కనీసం గాలి కూడా ఆడలేనంత ఇరుకు సందులు. అవి స్కూళ్లయినా, కాలేజీలైన ఒకేటే తంతు. పేరు మాత్రం పెద్ద పెద్ద బ్రాండ్లు. అసలు విద్యా వ్యాపారంలో స్కూళ్లకు కొత్త కొత్త పేర్లు పెట్టడం కూడా ఒక వ్యాపారంలో ఒక భాగమైంది. ప్రభుత్వం ఆ పేర్లను నిషేదించింది. కాని ఏ ప్రైవేటు స్కూలు ఆ పేర్లను మార్చలేదు. ఏ ప్రైవేటు స్కూల్‌ బోర్డు చూసిన టెక్నొ, మోడల్‌, ఇంటర్నేషన్‌, పబ్లిక్‌ అంటూ రకరకాల పేర్లు జోడిస్తుంటారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూలు వాతావరణం అందమైన ప్రకృతి వనంలా వుండాలి. కాని అలా వుండదు. ఊపిరి కూడా ఆడనంత ఇరుకైన, చీకటి గదులుంటాయి. ఇది కూడా ప్రైవేటు వ్యాపారానికి ఇబ్బందిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తుండడంతో విపరీతంగా ఫీజులు పెంచి, పట్టపగలే లైట్లు, ఏసి గదులు, అద్దాల అమరికలతో సరికొత్త లోకం సృష్టిస్తున్నారు. చెప్పే చదవు చారెడు, ఫీజుల బారెడు వసూలు చేస్తున్నారు. తెలంగాణలో సుమారు 11వేల ప్రైవేటు స్కూళ్లు వున్నట్లు అంచనా. ప్రైవేటు స్కూళ్లలోనే ఏటా 30లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే విద్యా వ్యాపారం ఎంతలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఓవైపు పేదల కోసం మోడల్‌స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జిల్లాపరిషత్‌ స్కూళ్లు, ప్రాధమిక, మాధ్యమిక, మున్సిపల్‌ స్కూళ్లు ఇలా కొన్ని వేల స్కూళ్లలో ఉచిత విద్య అందిస్తోంది. ప్రజల ఆలోచనా సరళిలో మార్పురావడం లేదు. పక్కనే ప్రభుత్వ స్కూల్‌ వున్నప్పటికీ దాన్ని దాటి ప్రైవేటు స్కూల్‌ వైపు తల్లిదండ్రులుచూస్తున్నారు. అందుకే ప్రైవేటు స్కూళ్లు ఫీజులు విపరీతంగా పెంచేస్తున్నారు. ఏటా పది శాతం ఫీజులు పెంచుకుంటూ, పాఠ్యపుస్తకాల విక్రయంతోపాటు, ఆఖరుకు పిల్లలు కొనుక్కునే పిప్పర్‌మెంట్లు కూడా యాజమాన్యాల కనుసన్నల్లోనే అమ్మకాలు సాగుతున్నాయంటే, పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు స్కూళ్లో చదివిన ప్రతి విద్యార్ధి ర్యాంకర్‌ కాలేదు. ప్రైవేటు స్కూళ్లను పది ఏర్పాటు చేసుకొని, వ్యాపారం చేసుకునే వారు అన్ని స్కూళ్లలో ర్యాంకర్లందరినీ ఒకే చోట ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటాడు. అది నిజమని నమ్మి తల్లిదండ్రులు మోస పోతుంటారు. ప్రభుత్వ స్కూళ్లలో అంతకన్నా మించి ర్యాంకులు ఎన్ని వచ్చినా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటనలు జారీ చేయడం జరగదు. విద్యా వ్యవస్ధ లోపమో, పాలకుల నిర్లక్ష్యమో కాని ప్రైవేటు స్కూళ్ల వ్యాపారానికి వరమైతోంది. తల్లిదండ్రులకు శాపమౌతోంది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఇదే కొనసాగుతోంది. అందుకే మన విద్యా వ్యవస్ధ ఇలా దిగజారి పోతోంది. ప్రైవేటు వ్యవస్ధ కోరలు చాచుకొని ఎదురు చూస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version