సి ఎం ఆర్ వడ్ల ను సకాలంలో ఇవ్వక పోతే మిల్లర్స్ పై చర్యలు
వనపర్తి నేటిధాత్రి;
2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీఎంఆర్ వడ్లు రైస్ మిల్లర్ల తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 రబీ సీజన్ కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ వడ్లు జనవరి 25 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. 2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన సీఎంఆర్ వడ్లు కూడా రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు మిల్లర్లు ధాన్యాన్ని అప్పగించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మిల్లర్లు నిర్లక్ష్య ధోరణి వీడి సీఎంఆర్ ధాన్యాన్ని అప్పగించి చట్టపరమైన చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇంకా చాలామంది మిల్లర్లు ఎంత చెప్పినా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదని, అదే ధోరణి కొనసాగితే ధాన్యాన్ని ఇతరులకు షిఫ్టింగ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు.
సమావేశంలో సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, సివిల్ సప్లై డిఎం రమేష్, రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు