అనధికారిక లేఅవుట్లపై పర్యవేక్షణ కరువు
స్థానిక సంస్థల ఆదాయం కోల్పోతున్న అధికారుల వైనంపై ప్రజలలో అనుమానాలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రామడుగు మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నూతన పోకడలను కోనసాగించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, వెదిర, దేశరాజుపల్లి, షానగర్, రామడుగు, గుండి, గోపాలరావుపేటతోపాటు మోతె, కొరటపల్లి, కొక్కెరకుంట, వన్నారం గ్రామాలలో అనుమతులు లేని లేఅవుట్లు విచ్చలవిడిగా నెలకొన్నాయి. గత ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరించిన అధికారులు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇలా ఉండగా 2020వ సంవత్సరం తర్వాత రామడుగు మండలంలోని పలు గ్రామాలలో విచ్చలవిడిగా లేఅవుట్ల నెలకోన్నాయి. ఆయా గ్రామాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపం ఈలేఅవుట్లవిషయంలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 113, సెక్షన్114 అనుసరించి అక్రమ లేఅవుట్లను కనిపెట్టి చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ అధికారులు ఏళ్లుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం చూసి గ్రామ అధికారుల, మండల అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోని పంచాయతీరాజ్ చట్టం అనుసరించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకొని గ్రామపంచాయతీల అభివృద్ధికి పాటుపడంతో పాటు, అధికారులు గడిచిన మూడు సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్నారా, మామూళ్ల మత్తులో మునిగారా, ప్రజాప్రతినిధులకు అధికారులు తలొగ్గారా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా మండలంలోని ఒక గ్రామంలో వెలసిన లేఅవుట్లో 20 ఫీట్ల రహదారులు స్పష్టంగా కనబడుతున్న అట్టి ప్లాన్ పై స్వయంగా ఆగ్రామ సర్పంచ్ నిబంధనలకు అనుకూలంగా లేఅవుట్ కలదని సంతకం చేయడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైనది