సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న
పాలకుర్తి నేటిధాత్రి
కార్మిక వర్గానికి చట్టాలు, హక్కులు సాధించిన మహనీయుడు కామ్రేడ్ బి టి రణదేవ్ అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న అన్నారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీటీ రణదేవ్ 34 వర్ధంతిని పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ భారతదేశ కార్మిక ఉద్యమంలో బీటీ రణదేవ్ కీలక పాత్ర పోషించారని, భారతదేశ కార్మిక వర్గానికి చట్టాలు, హక్కులు సాధించిన మహనీయుడు అని కొనియాడారు. భారత పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడి చేస్తుందని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గ విముక్తి కోసం కార్మికులు సంఘటితంగా పోరాడాలని, తమ హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సవరణలు చేస్తుందని విమర్శించారు. దీని ఫలితంగా కార్మికులు మరింత బానిసత్వంలోకి నిట్టివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ కార్మికులపై మరింత అదనపు పనిభారం మోపుతున్నారని కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా కార్మిక వర్గ సామాజిక సమస్యలపై బి టి ఆర్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి సోమయ్య, ఎండి మైబు, షేర్ సమ్మయ్య, బోడ యాకన్న, గాదపాక రాములు, చిక్కుడు పరమేష్, ఎండి గుంశ, ఎండి అబ్బాస్, ఈరెంటి నాగన్న, షేరు ఆంజనేయులు, షేర్ సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.