రాజన్న ఆలయంలో నకి’లీలలు

నకిలీ దృవపత్రాలతో పదోన్నతి పొందిన ఆలయ ఏ.ఈ.ఓ హరికిషన్…?
– ప్రవేశం తీసుకుంది సేలంలో… పట్టా పొందింది బీహార్ లో…
– ఆలయ రిటైర్డ్ ఉద్యోగి నామాల రాజేందర్ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
– ఇదే వరసలో మరికొందరూ…?

వేములవాడ నేటి ధాత్రి

దక్షిణాకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం కలకలం సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికవరకు కేవలం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, లడ్డు తయారీలో నాణ్యత లోపం, శానిటేషన్ విభాగం వారి నిర్లక్ష్యం, బ్లాక్ లో టికెట్టు విక్రయం, సిబ్బంది చేతివాటం వంటి పలు విషయాల్లో వార్తలోకెక్కిన రాజన్న ఆలయం ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాలతో పదోన్నతి పొందిన ఉద్యోగుల వ్యవహార శైలితో మరోమారు వార్తల్లోకెక్కి సంచలనం సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… రాజన్న ఆలయంలో ఏ.ఈ.వోగా విధులు నిర్వహిస్తున్న ఎస్.హరికిషన్ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆలయాధికారులు సైతం సీనియర్లను కాదని, హరికిషన్ కు పదోన్నతి కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించినట్టు గత కొన్నేళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్ కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పప్పటికి సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపించాయి.
ప్రవేశం తీసుకుంది సేలాంలో…. పట్టా పొందింది బీహార్ లో..
వాస్తవానికి హరికిషన్ నకిలీ దృవపత్రాల విషయంలో ఆయన చేసిన తప్పును ఆయనే బయటకు తెలిసేలా చేసుకున్నాడనే విషయం తెలుస్తోంది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఇంటర్మీడియట్ అర్హత కలిగియున్న హరికిషన్ పదోన్నతి పొందే సమయానికి డిగ్రీ పట్టాను సంపాదించాడు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోని ఏ ఒక్క యూనివర్సిటీల్లో కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని సేలాంలో, బీహార్ రాష్ట్రంలోని మరో యూనివర్సిటీలో డిగ్రీ చదివినట్లు పట్టాలు సమర్పించాడు. ఇందులో కనీసం ఆయన పూర్తి పేరు, తండ్రిపేరు, పుట్టినతేది వంటి ప్రాథమిక వివరాలు కూడా సరిగ్గా లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు సదరు విద్యార్థికి సంబంధించిన అకాడమీకి వివరాలు తెలపాలని కోరుతూ యూనివర్శిటీలకు లేఖలు రాశారు. వాటిపై ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. దీంతో హరికిషన్ సర్టిఫికేట్ల విషయంలో అనుమానాలు రెట్టింపయ్యాయి.
రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగులోకి…
గత కొన్నేళ్లుగా నకిలీ దృవపత్రాలపై ఆలయంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో ఎవరూ దీనిపై దృష్టిసారించలేదు. అయితే ఆలయంలో సూపరింటెండ్ గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన నామాల రాజేందర్ ఈ నకిలీ దృవపత్రాల విషయంలో హరికిషన్ పై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి గత నవంబర్ నెలలో హరికిషన్ నకిలీ ధృవపత్రాల విషయంలో అన్ని ఆధారాలతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చినట్లయింది.
ఇదే వరసలో మరికొందరు…?
మరోవైపు ఈ విషయంలో కేవలం హరికిషనే కాకుండా ఇదే వరసలో మరికొంత మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. హరికిషన్ మాదిరే మరికొంత మంది ఉద్యోగులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి, అక్రమ మార్గంలో పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నారు. ఏదిఏమైనా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజన్న ఆలయంలో ఇలాంటి నకిలీలు ఉంటూ, అందులోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు అధికారులను, ఇటు కింది స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తూ కాలం వెల్లదీస్తున్న నకి’లీలపై’ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు భక్తులు కోరుతున్నారు. వేచి చూడాలి మరి విషయం న్యాయస్థానం దృష్టికి వెళ్ళాక కూడా దేవాదాయ శాఖ అధికారులు స్పందిస్తారో లేదోనని….?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version