టోల్ ఫ్రీ నెంబర్,
రివీట్ మొబైల్ ఆప్ అవగాహన కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ కృష్ణప్రియ
జనగామ, నవంబర్ 03 నేటిధాత్రి:-
కల్తీ,అక్రమ మద్యం సరఫరా, నిల్వలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఈఎస్ కృష్ణప్రియ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్, విరీట్ మొబైల్ ఆప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్ కృష్ణ ప్రియ ఆప్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో శాసన సభ 2023 సాధారణ ఎన్నికల
సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎక్సైజ్ శాఖ పకడ్బందీగా, చాలా జాగ్రతతో నిర్వహిస్తుందని, ప్రజలను మరింత అప్రమత్తంగా చేసేందుకు వినియోగదారులు వైన్ షాప్ ల నుండి కొనుగోలు చేసిన మద్యం సరైనదేనా కాదా తెలుసుకొనుటకు విరీట్ (VERIT) మొబైల్ ఆప్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ ఆప్ ద్వారా మద్యం బాటిల్ మూత పై గల హోలోగ్రం ను స్కాన్ చేస్తే బాటిల్ బ్రాండ్, పరిమాణం, ఎంఆర్పి, బ్యాచ్ నెంబర్, తయారి తేది, బాటిల్ జారీ చేయబడిన డిపో, వైన్ షాప్ పేరు డిస్ప్లే అవుతుందన్నారు. ఒకవేళ నకిలీ మద్యం, అక్రమ మద్యం అయితే ఈ వివరాలేవీ కనిపించవు అని ఈ విరీట్ (VERIT) మొబైల్ ఆప్ ను అందరూ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ప్రజలందరికీ ఈ విషయాలను తెలియజేసి ఏవైనా మద్యం విషయంలో ప్రజల నుండి ఫిర్యాదులు,సమాచారం కొరకు వెంటనే రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523 కు, జిల్లా స్థాయిలో జనగామ జిల్లా ఎక్సైజ్ కంట్రోల్ రూం నెంబర్ 9014017705 కు సమాచారం ఇచ్చి ఎన్నికలు సజావుగా, ప్రశాతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రవీణ్,
సి.ఐ లు ప్రభావతి, సంతోష్ రెడ్డి, ఎస్సై సిహెచ్ జనార్ధన్, కానిస్టేబుల్ లు తదితరులు పాల్గొన్నారు.