జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో శుక్రవారం రోజున పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో జైపూర్ ఎస్సై శ్రీధర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఎస్ఎస్సి మరియు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన కృంగిపోతున్నారని మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలాంటి ఆలోచనలు రావడం చాలా బాధాకరమైన విషయమని, ఎప్పుడు ధైర్యంగా నమ్మకంతో ముందడుగు వేస్తూ జీవించాలని, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, పిల్లలందరూ మీ తల్లిదండ్రుల యొక్క కష్టాలను మీకోసం పడే ఆరాటాన్ని ,మీరు పంచే అనురాగాన్ని ఆనందాన్ని పొందటానికి ఎదురుచూస్తూ ఉండే ఆ కళ్ళల్లో విషాదాన్ని నింపే ఆలోచనలు చేయకూడదని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పి అండగా నిలవాలని నిత్యం పిల్లలను గమనిస్తూ ఉండాలని తెలిపారు. పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆధైర్య పడాల్సిన అవసరం ఏమీ లేదని మళ్లీ ప్రయత్నం చేసి ఉత్తీర్ణత సాధించవచ్చునని విద్యార్థులకు హితువు పలికారు. విద్యార్థులు చాలా చిన్న వయసులోనే చెడు సావాసాల ద్వారా మాదకద్రవ్యాలకు,మత్తు పదార్థాలకు, గంజాయి ,మద్యపానం మొదలగు ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అలాంటి ఆలోచనలని మొగ్గలోనే తుంచి వేయాలని, బంగారు భవిష్యత్తును నాశనం చేయడానికి ముఖ్య కారణం చెడు వ్యసనాలేనని విద్యార్థులందరూ ఇది గమనించి అలాంటి వాటికి దూరంగా ఉండి చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని భావితరాలకు అదర్శంగా నిలవాలని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.