స్క్రాప్ మట్టి పోసేది కబ్జా చేసేందుకేనా….?

ప్రధాన రహదారి పక్కనే విలువైన భూమి కబ్జాకు గురవుతుందా…?

గతంలో ప్రభుత్వ భూమి కబ్జా జరిగినా పట్టించుకోని అధికారులు…!

సింగరేణి సూచిక బోర్డు ఉన్నా సరే బేఖాతర్ చేయని ఘనులు…

రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి:

కోల్ బెల్ట్ ప్రాంతమైన రామకృష్ణాపూర్ పట్టణం లో కొంత భూభాగం సింగరేణి సంస్థ కు సంబంధించినది, కొంత ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందని అందరికీ తెలిసిన విషయమే… ఇదే అదునుగా భావించిన భూ భాకాసురులు కబ్జాలకు తెగబడుతున్నారు. సింగరేణి సంస్థ తన ఆధీనంలో ఉన్న కొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు వెల్లడిస్తున్నా సరే మున్సిపాలిటీ అధికారులు ఇంతవరకు మాకు ఎలాంటి జీవో కాపీ రాలేదని అంటున్నారు.పట్టణంలోని బీజోన్ నుండి మంచిర్యాల కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే విజయ గణపతి దేవాలయం ఎదురుగా గతంలోనే ఇది సింగరేణి,ప్రభుత్వ భూమి అనే సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు స్క్రాప్ మట్టి పోసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో కొంతమేరకు భూమి కబ్జా జరిగిందని ప్రభుత్వ ,సింగరేణి అధికారులు పట్టించుకోలేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రాప్ మట్టి పోసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదే రహదారి నుండి సింగరేణి, మున్సిపాలిటీ అధికారులు ప్రయాణిస్తున్న సరే ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుర అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారా అనే సందేహాలు ప్రజలలో లేకపోలేదు.సామాన్య ప్రజలు చిన్న పూరి గుడిసె వేసుకుంటేనే హడావిడి చేసి పనులను నిలిపివేసే మునిసిపాలిటీ అధికారులు ఇంత జరుగుతున్నా సరే పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ, సింగరేణి భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని విలువైన భూములను కాపాడాలని పుర ప్రజలు కోరుతున్నారు. సింగరేణి సంస్థ అయినా సరే ప్రభుత్వ అధికారులైనా సరే భూమిని స్వాధీనం చేసుకోవాలని పుర ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version