టీజేఎంయూ సెంట్రల్ కమిటీ సమావేశంలో నర్సంపేట డిపో సెక్రటరీ గొలనకొండ వేణు విజ్ఞప్తి
నర్సంపేట,నేటిధాత్రి :
ఆర్టీసీ కార్మికులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు గాను అపాయింట్ డేట్ ను వెంటనే విడుదల చేసి ఆర్టీసీ కుంటుంబాలకు సంక్రాంతి కానుకగా అందించాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) నర్సంపేట డిపో సెక్రటరీ గొలనకొండ వేణు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.సోమవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన్ భవన్ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో వేణు పాల్గొని మాట్లాడారు.గత బీఆర్ ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి జీతం పెంచకుండా ఆర్టీసీ ఉద్యోగులను అప్పులపాలుచేసి విలీన ప్రక్రియ పూర్తి చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. కోరుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసే సర్క్యులర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విలీనానికి సంబంధించిన గత ప్రభుత్వం జులై 31న కేబినెట్ తీర్మానం, ఆగష్టు 6న అసెంబ్లీలో విలీన బిల్లు పాస్, న్యాయనిపుణుల సలహాలతో గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర, సెప్టెంబర్ 15న గెజిట్ కూడా విడుదల చేసిందని మిగిలిన ఒకే ఒక్క విలీన ప్రక్రియ గవర్నమెంట్ జీవో విడుదల చేస్తే విలీన ప్రక్రియ పూర్తవుతుందని వేణు అన్నారు. దాని కోసం 43 వేల మంది కార్మికులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నరని పేర్కొన్నారు. 2023 జులై నెల నుండి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు విలీన ప్రక్రియ ఫలాలు పొందాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నరని, అది పూర్తి కాకుండానే నిరాశతో రిటైర్ మెంట్ అవుతున్నారని తెలియజేశారు.త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల కోడ్ పడక ముందే ఆర్టీసీ ఉద్యోగులకు రావలసిన మిగిలిన రెండు పీఆర్సీలను, పెండింగ్ బకాయిలను కూడా అమలు చేస్తె సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం ఋణపడి ఉంటారని వేణు కోరారు.