ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 12 వ వార్డులో రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అలాగే ఇదే వార్డులో రూ.80 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో సోఫియా ఫ్లాజా, కమ్యూనిటీ హాల్ సిసి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల కాలంలో పట్టణంలో అభివృద్ధి ఎక్కడికి అక్కడ ఆగిపోయిందన్నారు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక ప్రాధాన్యత ఇస్తూ.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శ్యామ్యుల్, అజ్మత్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.