జర్నలిస్టులకు మార్గ నిర్దేశనం చేయాలి

స్వప్రయోజనాలకు వారిని పావులుగా వాడుకోవద్దు

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు “కరుణాకర్”

జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణ బాధ్యులుగా పార్వతి రాజేష్ పేరు ప్రకటన

“నేటిధాత్రి”మంచిర్యాల, డిసెంబర్, 30

సమాజ పద నిర్దేశకులైన జర్నలిస్టులకు నాయకత్వం వహించే సంఘాల నేతలు నిబద్ధతతో వారికి మార్గ నిర్దేశం
చేయాల్సింది పోయి తమ స్వప్రయోజనాలకు వారిని పావులుగా వాడుకోవడం అత్యంత విచారకరమని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీనియర్ పాత్రికేయుడు పార్వతి రాజేష్ అధ్యక్షతన జరిగిన డబ్ల్యూజేఐ సన్నాహక సమావేశానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ


తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయన్నారు.
రాష్ట్రంలోని 80 శాతం మంది జర్నలిస్టులకు వేతన వ్యవస్థ లేకుండా పోయిందన్నారు.
సర్కులేషన్, ప్రకటనల సేకరణ కర్తలుగా జర్నలిస్టులు మారిపోవడం దురదృష్టకర పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల స్థితిగతుల్లో మార్పు తేవాల్సిన, ఈ దుస్థితి నుండి వారిని బయటపడేయాల్సిన
బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంలో ఇప్పటివరకు ఈ రంగంలో పని చేస్తున్న ట్రేడ్ యూనియన్ల వైఫల్యం గ్రామీణ జర్నలిస్టులకు శాపంగా మారిందని కూడా వారు చెప్పారు. ఆయా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టుల జీతభత్యాలు, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతల నుండి యాజమాన్యాలు ఎప్పుడో వైదొలిగిపోగా, ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన జర్నలిస్టు సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో న్యాయ పరమైన హక్కుల కోసం జర్నలిస్టులకు మార్గం చూపించేందుకు దేశంలోనే అతిపెద్ద కార్మిక రంగ సంస్థ బీఎంఎస్ ఆధ్వర్యంలోని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని కరుణాకర్, ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. వృత్తి పరమైన సవాళ్లను జర్నలిస్టులు ధీటుగా ఎదుర్కొనేందుకు, పనికి తగ్గ వేతనాలు దక్కించుకునేందుకు
జర్నలిజం రంగంలోకి నూతనంగా వస్తున్న వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు డబ్ల్యూజేఐ అండగా ఉంటుందని వెల్లడించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్య భీమా, నివేషణ స్థలాల విషయంలో అర్హులందరికీ న్యాయం జరగాలన్నది తమ అభిమతం అని, దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. పాత్రికేయ రంగంలోకి నూతనంగా వస్తున్న వారికి శిక్షణ తరగతులు ఇప్పించడంలో మీడియా అకాడమీ వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. అవసరమైన పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే తాము రాష్ట్రస్థాయి సదస్సు హైదరాబాద్ లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రిడికేషన్లు, ఎంప్యానల్మేంట్, రేట్ కార్డ్ విషయంలో స్థానిక పత్రికలకు అన్యాయం జరిగితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన డబ్ల్యూజేఐ సన్నాహక సమావేశానికి 50 మందికి పైగా జర్నలిస్టులు హాజరయ్యారు.
యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సత్యనారాయణ,
కరీంనగర్ జిల్లా యూనియన్ నాయకులు దారం జగన్నాథరెడ్డి, పార్వతి రాజేష్ ,చొక్కారపు శ్రీనివాస్, దుస్స శివప్రసాద్ ,పరశురామ్ ,ముత్యం వెంకటేష్,ఓదెలు,రాజు,గట్టయ్య , అనిల్,వెంకటేష్,రాజేష్,గౌతం,తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణ బాధ్యులుగా పార్వతి రాజేష్ ను ప్రకటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version