చందుర్తి పీ.హెచ్.సీ నూతన భవన పనుల పరిశీలన
చందుర్తి, నేటిదాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో పీ హెచ్ సీ నూతన భవన తుది దశ పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తిలో రూ. 1 కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా, కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని గదులు, ఆవరణను పరిశీలించారు. దవాఖాన ఆవరణను మొత్తం శుభ్రం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. భవనంలో తుది దశ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పాత భవనం నుంచి నూతన భవనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారి సంపత్ కు సూచించారు.
ఈ పర్యటనలో ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, డీఈఓ రమేష్ కుమార్, టీచర్ వనిత తదితరులు పాల్గొన్నారు.