భూపాలపల్లి నేటిధాత్రి
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఎలాంటి అపోహలు చెందొద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూసేకరణపై టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 3 మండలాల పరిధిలోని 13 గ్రామాలలోని రైతులు భూములను కోల్పోతున్నారని, భూసేకరణ విషయంలో రైతుల యొక్క సలహాలు , సూచనలు తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రాజెక్ట్ ల కోసం భూ సేకరణ చేయడం జరుగుతుందని భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అబీష్టం మేరకు భూసేకరణ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 130.5 ఎకరాలు 35 కిలో మీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పు మాత్రమే సేకరిస్తున్నామని అన్నారు.
గతంలో భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ల కోసం భూసేకరణ చేయడం జరిగిందనీ ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగలేదని ఆయన గుర్తు చేశారు.
రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించగా రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టరు తెలిపారు.
ఈ సమావేశంలో
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, నేషనల్ హైవే ఈ ఈ మనోహర్,
మూడు మండలాల రైతులు,
తదితరులు పాల్గొన్నారు.